సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో రాజ‌కీయం ఏమీ లేదు

కేంద్రం నుంచి నిధులు రాబ‌ట్టేందుకే కేంద్ర మంత్రుల‌తో సీఎం భేటీ

రహస్య చర్చలు, తెరవెనుక అజెండాలు మాకు లేవు

రాజకీయంగా టీడీపీ వాడుతున్న భాష  సరిగా లేదు

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు  సజ్జల రామకృష్ణారెడ్డి  

తాడేప‌ల్లి:  ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఢిల్లీ ప‌ర్య‌ట‌న వెనుక ఎలాంటి రాజ‌కీయం లేద‌ని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు  సజ్జల రామకృష్ణారెడ్డి  స్ప‌ష్టం చేశారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధుల‌పై చ‌ర్చించేందుకు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఢిల్లీ వెళ్లార‌ని తెలిపారు. మాకు ర‌హ‌స్య చ‌ర్చ‌లు, తెర వెనుక అజెండాలు లేవ‌ని ఆయ‌న వెల్ల‌డించారు. తాడేప‌ల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాల‌యంలో స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు.

అభివృద్ధి ల‌క్ష్యంగా ముందుకు..

 కేంద్రంలోని ప్రముఖులను సీఎం వైయ‌స్‌ జగన్ ఎప్పుడు కలిసినా రాష్ట్ర సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళ్లారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సినవి  ఎలా నచ్చచెప్పి  రాబట్టుకోవాలనే ప్రయత్నంలో భాగంగా ఇవాళ సీఎం వైయ‌స్‌ జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ఇది రొటీన్‌గా జరిగే వ్యవహారమే అని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ప్రత్యేక హోదా, ఆర్థికలోటు వంటి పెండింగ్‌ అంశాలపై సీఎం వైయ‌స్ జగన్ కేంద్రంతో చర్చించనున్నారు. 

 వైయస్‌ఆర్‌సీపీకి, కేంద్రంలో ఉన్న బీజేపీ, ఎన్డీయేతో రాజకీయంగా ఎలాంటి సంబంధాలు లేవు.  కేంద్ర హోంమంత్రితో సీఎం వైయ‌స్ జగన్ రాష్ట్ర సమస్యలపైనే చర్చిస్తారు. ఇతర అంశాలు చర్చిస్తున్నప్పుడు ఏవైనా రావొచ్చు ఏమో. ప్రధానంగా కేంద్రంతో రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ సమస్యలపై మాట్లాడటానికే సీఎం వైయస్‌ జగన్ ఢిల్లీ వెళ్లారు. ఇందులో రాజకీయం ఏమీ లేదు. 

 వికేంద్రీకరణ విషయంలో హైకోర్టును కర్నూలుకు మార్చాలంటే కేంద్రం ప్రభుత్వం, కేంద్ర న్యాయవ్యవస్థ ఇన్వాల్వ్ అయి ఉంది. దాని వెనుక ప్రాతిపదికను ముఖ్యమంత్రి  వివరిస్తారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై సీఎం వైయ‌స్ జగన్ కేంద్రంతో చర్చిస్తారు. ఇప్పటి వరకు వచ్చిన నిధులు, రావాల్సిన నిధులపైనే చర్చిస్తారు. 

మాకు రాష్ట్ర ప్ర‌యోజ‌నాలే ముఖ్యం..

సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి, వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర ప్ర‌యోజ‌నాలే ముఖ్య‌మని స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి స్ప‌ష్టం చేశారు.  ప్రతిపార్టీకి ఓ విధానం ఉంటుంది.  రహస్య చర్చలు, తెరవెనుక అజెండాలు, ఎవరో ఒకర్ని బ్రతిమాలుకోవటం వంటివి మాకు ఉండాల్సిన అవసరం లేదు. చంద్రబాబు హయాంలోనూ, గతంలోనూ తెరవెనుక ఇలాంటివి జరిగాయి. కాంగ్రెస్‌ హయాంలోనూ జరిగాయి. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు చంద్రబాబు ఢిల్లీ వెళ్ళిన సందర్భాల్లో ఏం చేశారో అందరూ చూశారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు బీజేపీని రకరకాలుగా వాడుకొని, తన అవసరాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను చంద్రబాబు తాకట్టు పెట్టారు. మాకు అటువంటి అవసరం లేదు. ఎంతో పారదర్శకతతో వ్యవహరిస్తున్నామని సజ్జల రామ‌కృష్ణారెడ్డి తెలిపారు.  

సీఎం వైయ‌స్ జ‌గ‌న్ చెప్పింది చేసుకుంటూ వెళ్తారు..

 ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్ రాజకీయమే ప్రధానం అనుకుంటే వేరేలా ఉండేదని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. కానీ  వైయ‌స్ జగన్  హిస్టరీనే మార్చారు. వైయ‌స్ జ‌గన్ గారి వ్యక్తిగత హిస్టరీ చూసినా.. పదేళ్ల రాజకీయ జీవితం చూసినా చెప్పింది .. చేసుకుంటూ వెళ్తారు.. తప్ప తెరవెనుక అజెండాతో ఎప్పుడూ వ్యవహరించలేదు. తెరవెనుక అజెండాతో వ్యవహరించే వ్యక్తి కాదని వైయ‌స్‌ జగన్ ప్రూవ్‌ చేసుకున్నారు. 

కొడాలి నాని ముత‌క భాష‌లో చెప్పారంతే..

 కొడాలి నాని దేవినేని ఉమాను కొడతానని అన్న వ్యాఖ్యలపై మీడియా ప్రశ్నలకు స్పందిస్తూ... ఎవరు మాట్లాడినా, ఎక్కడ మాట్లాడినా, ఒక్కొక్కరు తాము ఆగ్రహంతో ఉన్నామని చెప్పే విధానాన్ని ఒక్కోలా వెల్లడిస్తుంటారు. ఎవరు మాట్లాడినా పరుషంగా, ఇంకోరకంగా మాట్లాడటం సరైంది కాదు. అవతల వారికి ఎంత చెప్పినా అవతల వాళ్లు వినకపోతే వచ్చే ఆవేశంలో ఒక్కొక్కరు చెప్పే భాష విధానంలో తేడా ఉంటుంది. కొడాలి నాని భాషలో నాకు అదే కనపడిందని సజ్జల అన్నారు. చెవిటి వాడి ముందు శంఖం ఊదినట్లు .. ప్రతిరోజూ అబద్దాలే చెబుతూ వాటిని నిజం చేయాలనుకుంటే .. ముతక భాషలో కొడాలి నాని తన అభిప్రాయాన్ని వెల్లడించారు. అంతేగానీ ఈయన వెళ్లి కొట్టేది లేదు.. ఆయన వచ్చి డొక్క తీసేది ఉండదని సజ్జల తెలిపారు. అలాంటి భాష కూడా సరికాదు. రాజకీయంగా టీడీపీ వారు వాడుతున్న భాష కూడా సరిగా లేదని సజ్జల తెలిపారు. ఇలాంటి భాషకు టీడీపీనే బాధ్యత వహించాలి. 

 అమరావతి భూముల వ్యవహారంపై సీబీఐకి ఇవ్వటం జరిగింది. రాజధాని భూముల కొనుగోలు వ్యవహారంలో ఇంకా చాలా ఉంది. కిలారి రాజేష్ అంశం చాలా చిన్నది. దర్యాప్తులో కచ్చితంగా  వాళ్ల తప్పులు దొరుకుతాయ‌ని స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి పేర్కొన్నారు.

Back to Top