గుంటూరు: గుంటూరు జిల్లా కొండవీడులో బీసీ రైతు కోటయ్య కుటుంబ సభ్యులను వైయస్ఆర్ సీపీ నిజ నిర్ధారణ కమిటీ సభ్యులు పరామర్శించారు. కోటయ్య మరణంపై వాస్తవాలను గుర్తించేందుకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి నిజనిర్ధారణ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ సభ్యులు కొద్దిసేపటి క్రితమే కొండవీడు చేరుకున్నారు. అంతకుముందు కమిటీ సభ్యులను గ్రామంలోకి రాకుండా ఇద్దరు డీఎస్పీలు, 200 మంది పోలీసులతో ప్రభుత్వం అడ్డుకుంది. పోలీసుల ఆంక్షలను లెక్క చేయకుండా కమిటీ సభ్యులు వాహనాలు ఊరి శివారులోనే వదిలి నడుచుకుంటూ గ్రామంలోకి చేరుకున్నారు. కోటయ్య మరణంపై కుటుంబ సభ్యులను, గ్రామస్తులతో ఆరా తీశారు. ఉమ్మారెడ్డి ఆధ్వర్యంలోని ఈ నిజనిర్ధారణ కమిటీలో పార్టీ ముఖ్యనేతలు బొత్స సత్యనారాయణ, కొలుసు పార్థసారథి, మోపిదేవి వెంకటరమణ, జంగా కృష్ణమూర్తి, గుంటూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు మహ్మద్ ముస్తఫా, కోన రఘుపతి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కృష్ణా జిల్లాకు చెందిన ఎమ్మెల్యే కొడాలి నాని, మర్రి రాజశేఖర్, విడదల రజని, లావు శ్రీకృష్ణదేవరాయలు, మేరుగ నాగార్జున, లేళ్ల అప్పిరెడ్డి, గాంధీ తదితరులు కొండవీడుకు వెళ్లారు.