ఏలూరు: దళితులను కించపరుస్తూ మాట్లా డితే అందులో ఎలాంటి తప్పు లేదని రాష్ట్రంలో తెలుగుదేశంపార్టీ ప్రభుత్వం ఎలుగెత్తి చాటుతోంది. కానీ, దాన్ని బయటపెట్టిన వారికి మాత్రం శిక్ష తప్పదని హెచ్చరి స్తోంది. పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ (టీడీపీ) ప్రసంగ వీడియోలను షేర్ చేసిన వారిపై ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. చింతమనేని మాట్లాడిన వీడియోను మరొకరికి పంపించాడంటూ కామిరెడ్డి వెంకట నరసింహారావు(నానీ) అనే యువకుడిని పోలీసులు శనివారం అరెస్టు చేశారు. నానీకి శుక్రవారం రాత్రి పెళ్లి జరగ్గా, శనివారం మధ్యాహ్నం తన స్వగ్రామం దెందులూరు మండలం శ్రీరామవరంలో రిసెప్షన్ జరిగింది. రిసెప్షన్ ముగిసి అత్తగారింటికి వెళ్లిన నానీని పోలీసులు అరెస్టు చేశారు. చింతమనేని ప్రభాకర్ ఒత్తిడి మేరకే నానీ అరెస్టు చేసినట్లు సమాచారం. చింతమనేని శనివారం ఉదయం ఏలూరు త్రీటౌన్ పోలీస్స్టేషన్లో పోలీసు ఉన్నతాధికారితో గంటసేపు సమాలోచనలు జరిపిన తర్వాత ఈ అరెస్టు జరగడం గమనార్హం. వివాహమై 12 గంటలైనా కాకముందే తన కుమారుడిని అరెస్టు చేయడం పట్ల నానీ తండ్రి ఆనంద్బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులను బూతులు తిట్టిన వారిని వదిలేసి, తన కుమారుడిని అరెస్టు చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఎమ్మెల్యే చింతమనేని కక్షగట్టి తన కుమారుడిని అరెస్టు చేయించారని ఆనంద్బాబు ఆరోపించారు. కామిరెడ్డి నానికి బెయిల్ మంజూరు ఇదిలా ఉంటే నానీకి బెయిల్ మంజూరైంది. ఈ సందర్భంగా కామిరెడ్డి నాని మాట్లాడుతూ... బెదిరింపులు, కేసులకు తాను భయపడేది లేదని, ఎమ్మెల్యే చింతమనేని అరాచకాలకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.