చంద్రబాబు, లోకేష్‌లను వెంటనే అరెస్టు చేయండి

గురుమూర్తిని కించపరిచేలా టీడీపీ అఫీషియల్‌ ఫేస్‌బుక్‌లో పోస్టర్‌

తక్షణమే చర్యలు తీసుకోవాలని డీజీపీకి వైయస్‌ఆర్‌ సీపీ ఫిర్యాదు

మంగళగిరి: దళితులను అవమానిస్తున్న చంద్రబాబు నాయుడు, ఆయన కొడుకు నారా లోకేష్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్, ఐటీ యాక్ట్‌ కింద కేసు నమోదు చేసి తక్షణమే అరెస్టు చేయాలని వైయస్‌ఆర్‌ సీపీ ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యేలు మేరుగ నాగార్జున, కైలే అనిల్‌కుమార్‌‌లు డిమాండ్‌ చేశారు. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక వైయస్‌ఆర్‌ సీపీ అభ్యర్థి డాక్టర్‌ గురుమూర్తిని కించపరుస్తూ టీడీపీ అఫీషియల్‌ ఫేస్‌బుక్‌లో పెట్టిన పోస్టును వెంటనే తొలగింపజేయాలని కోరుతూ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌కు ఫిర్యాదుపత్రం అందజేశారు. దళితులను కించపరుస్తూ పోస్టు పెట్టిన చంద్రబాబు, లోకేష్‌పై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాళ్లకు మసాజ్‌ చేస్తున్నట్లు టీడీపీ ఫేస్‌బుక్‌ పేజీలో పెట్టిన పోస్టు వైయస్‌ఆర్‌ సీపీ అభ్యర్థి గురుమూర్తి కులాన్ని, వ్యక్తిత్వాన్ని, వృత్తిని తీవ్రంగా కించపరిచినట్టు దళిత జాతి యావత్తు భావిస్తుందన్నారు. చంద్రబాబు, లోకేష్, మరికొందరు కుట్ర పన్ని ఉద్దేశ్యపూర్వకంగా గురుమూర్తిని కించపరిచే రీతిలో ప్రవర్తించారని, దీనిపై తక్షణమే యాక్షన్‌ తీసుకోవాలని డీజీపీని కోరారు. 
 

Back to Top