త్వరలో పెద్దఎత్తున పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం

మూడు దశాబ్దాల పాటు అధికారంలో ఉండేలా పార్టీ పటిష్టం

వైయ‌స్ జ‌గ‌న్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు దేశంలో మరెక్కడా లేవు

వైయ‌స్ఆర్ సీపీ అనుబంధ విభాగాల ఇన్‌చార్జ్‌, ఎంపీ విజయసాయిరెడ్డి

తాడేప‌ల్లి: రాష్ట్రంలో వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్నన్ని అభివృధ్ది - సంక్షేమ పథకాలు దేశంలో మరే ఇత‌ర రాష్ట్రాల్లో అమలు జరగడం లేదని పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, అనుబంధ విభాగాల ఇన్‌చార్జ్‌, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అన్నారు. ప్రతి కార్యకర్త వైయ‌స్ జగన్ అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజల వద్దకు తీసుకువెళ్లి, వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పని చేసిందని గర్వంగా చెప్పుకునే పరిస్థితిని కల్పించారన్నారు. తాడేపల్లిలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో అనుబంధ విభాగాల ఇన్‌చార్జ్‌, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అధ్య‌క్ష‌త‌న‌ పార్టీ అనుబంధ విభాగాల సమావేశం నిర్వ‌హించారు. ఈ సమావేశానికి పార్టీ కేంద్ర కార్యాలయ పర్యవేక్షకులు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి సమన్వయకర్తగా వ్యవహరించారు.

ఈ సంద‌ర్భంగా ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. వైయ‌స్ఆర్ సీపీ స్దాపించిన నాటినుంచి కష్టపడి పనిచేస్తున్న కార్యకర్తలకు గుర్తింపు ఇవ్వాలనే లక్ష్యంతో.. అన్ని వర్గాలకు సముచితమైన పదవులు కేటాయించామన్నారు. రాష్ట్రంలో బీసీల కోసం ఏర్పాటు చేసిన 56 కార్పోరేషన్లే కాక, ఆయా వర్గాలకు సంబంధించిన వందకు పైగా కార్పోరేషన్లలో ఛైర్మన్లు ,డైరక్టర్లుగా నియమించడం జరిగిందన్నారు. స్థానిక  సంస్ధల ఎన్నికలు వ‌రుసగా ఒకేసారి నిర్వహించి.. ఘ‌న విజ‌యం సాధించిన ఘనత ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌కే ద‌క్కుతుంద‌న్నారు. తద్వారా పార్టీ నేతలకు వేలల్లో పదవులు లభించాయన్నారు. తనదైన వ్యూహాలతో అటు పార్టీని, ఇటు ప్రభుత్వాన్ని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ నడిపిస్తున్నతీరే ఈ ఘన విజయాలకు కారణమ‌న్నారు. ద్వితీయ శ్రేణి నాయకులను, కార్యకర్తలను మరింత ఉత్తేజపరుస్తూ, ఎక్కడైనా, ఎవరిలో అయినా నిర్లిప్త భావం ఉంటే.. దానిని కూడా పోగొట్టి పార్టీని పటిష్టం పరిచేందుకు కృషిచేస్తున్నామన్నారు. 

రాబోయే మూడు దశాబ్దాలపాటు రాష్ట్రంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండేలా.. పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేస్తున్నామని, ఇందులో కార్యకర్తల పాత్ర క్రియాశీలకంగా ఉంటుందని అన్నారు. 2019లో పార్టీ అధికారంలోకి రావడంలో బూత్ స్థాయి కమిటీలు కీలక పాత్ర వహించాయని, వాటిని మరింత శక్తివంతం చేయాలని అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవడం జరుతుందన్నారు. పార్టీ సభ్యత్వ కార్యక్రమాన్ని త్వరలో చేపట్టడం జరుగుతుందని, ప్రజలలో పార్టీకి ఉన్న ఆదరణ పార్టీ సభ్యత్వంలో ప్రతిఫలించాలని విజయసాయిరెడ్డి సూచించారు. అలాగే ప్రపంచంలోని ఏ దేశంలో తెలుగువారు నివసిస్తున్నా వారి వివరాలు అన్నీ కూడా ఏపీ ఎన్.ఆర్.టి.ఎస్ వద్ద ఉండేలా చూడాల్సిన అవసరం ఉందన్నారు. వారికి అవసరమైన సమాచారాన్ని ప్రభుత్వం నుంచి అందేలా చూడాలన్నారు.

ఈ సమావేశంలో పార్టీ అనుబంధ విభాగాల నేతలు, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి (వైయ‌స్ఆర్‌ సేవాదళ్), ఎమ్మెల్యే తెల్లం బాలరాజు (ఎస్టీ విభాగం), ఎమ్మెల్యే జక్కంపూడి రాజా (యూత్ విభాగం), విజయ శారదారెడ్డి (డ్వాక్రా విభాగం), ఖాదర్ భాషా (మైనారిటీ విభాగం), డి.సూర్యనారాయణరాజు (పంచాయతీరాజ్ విభాగం), గుర్రంపాటి దేవేంద్రరెడ్డి (సోషల్ మీడియా కో ఆర్డినేటర్), టీఎస్ విజయచందర్ (పబ్లిసిటి విభాగం కోఆర్డినేటర్), శ్రీమతి వంగపండు ఉష (సాంస్కృతిక విభాగం), కుప్పం ప్రసాద్ (వాణిజ్య విభాగం), టూరిజం కార్పోరేషన్ ఛైర్మన్ వరప్రసాదరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Back to Top