జ్యోతి క్షేత్రాన్ని పరిరక్షించుకుంటాం 

వైయ‌స్ఆర్ జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్‌రెడ్డి

కలసపాడు : శ్రీ అవధూత కాశినాయన జ్యోతిక్షేత్రాన్ని పరిరక్షించుకుంటామని వైయ‌స్ఆర్ జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ  అధ్యక్షుడు పి.రవీంద్రనాఽథ్‌రెడ్డి పేర్కొన్నారు. ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్‌ సుధలతో కలిసి జ్యోతిక్షేత్రాన్ని సందర్శించారు. ఇటీవల జ్యోతిక్షేత్రంలో మహిళల స్నానపుగదులు, క్షౌ రశాల, గోశాల, విశ్రాంతి గదులను అటవీశాఖ అధికారులు కూల్చివేసిన ప్రదేశాలను పరిశీలించారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పేదల ఆకలి తీర్చేందుకు దేవాలయాల వద్ద నిత్యాన్నదాన సత్రాలు ఏర్పాటు చేసి కాశినాయన అన్నదానం కొనసాగించారన్నారు. జ్యోతిక్షేత్రంలో ఆయన పరిత్యాగం చెందారని, ఆయన ఆలయాన్ని నిర్మించేందుకు అటవీశాఖ ఇబ్బందులు సృష్టించడం దురదృష్టకరమన్నారు. గతంలో వైయ‌స్‌ రాజశేఖర్‌రెడ్డి, గోవిందరెడ్డి సహకారంతో జ్యోతిక్షేత్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయన్నారు. 2019 నుంచి అటవీశాఖ అనుమతి కోసం కడప పార్లమెంటు సభ్యులు వైయ‌స్‌ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డిలు విశేషంగా కృషి చేశారన్నారు. కూటమి ప్రభుత్వంలో అటవీశాఖ మంత్రిగా ఉన్న పవన్‌కళ్యాణ్‌ సనాతన ధర్మవాదియై జ్యోతిక్షేత్రంలో కూల్చివేతలపై స్పందించకపోవడం విచారకరమన్నారు. ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్‌ సుధ మాట్లాడుతూ ..కాశిరెడ్డినాయన భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా అటవీశాఖ అధికారులు వ్యవహరించాలన్నారు. కార్యక్రమంలో కడప డిప్యూటీ మేయర్‌ నిత్యానందరెడ్డి, పీఆర్‌ఆర్‌డీ మాజీ ప్రభుత్వ సలహాదారు నాగార్జునరెడ్డి, సోషల్‌ వెల్ఫేర్‌ బోర్డు మాజీ చైర్మన్‌ పులి సునీల్‌కుమార్‌, నియోజకవర్గ బూత్‌ కన్వీనర్ల సమన్వయకర్త కె.రమణారెడ్డి, ఆప్కాస్‌ మాజీ డైరెక్టర్‌ డాక్టర్‌ కళ్యాణ్‌చక్రవర్తి, వైయ‌స్ఆర్‌సీపీ  నాయకులు సూదా రామకృష్ణారెడ్డి, సుదర్శన్‌, నారాయణ యాదవ్‌, చిత్తా రాజశేఖర్‌రెడ్డి, పులి వీరారెడ్డి, దేవసాని శ్రీనివాసులరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Back to Top