తాడేపల్లి: వరద సాయంపై చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైయస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. లైట్స్ ఆన్.. స్టార్ట్ కెమెరా.. యాక్షన్..అంటూ ప్రచారం కోసమే చంద్రబాబు వరద ప్రాంతాల్లో పర్యటించారని ధ్వజమెత్తారు. చంద్రబాబు దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి ప్రభుత్వానికి మంచి ఫీడ్ బ్యాక్ ఉందన్నారు. చంద్రబాబు చెప్పేదంతా అబద్ధమని తేలిపోయిందని.. పరామర్శ కంటే ప్రచారానికే ఆయన ప్రాధాన్యత ఇస్తున్నారని సజ్జల అన్నారు. శుక్రవారం తాడేపల్లిలోని వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు.
సాయం అందలేదని ఏ ఒక్కరి నోటి నుంచీ బాబు చెప్పించలేకపోయారు
2014-19 మే 30 వరకూ ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు వరద సహాయ చర్యలు, పునరావాస కార్యక్రమాలు పరిశీలించే పేరుతో రెండు రోజుల నుంచి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన చేస్తున్నారు. ఆయన తన సహజశైలిలో వరద ప్రాంతాలకు వెళ్లేముందే రంగం సిద్ధం చేసుకుని, వరద బాధితులకు ప్రభుత్వం తరఫున నుంచి ఎలాంటి సహాయం అందలేదని నిరూపించాలని ప్రయత్నించాడు. చంద్రబాబు పర్యటన ఆసాంతం పరిశీలిస్తే ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందలేదని ఏ ఒక్కరితో కూడా చెప్పించలేకపోయారు. సాయం అందలేదనే మాట ఒక్కరి నోటి నుంచి కూడా రాని పరిస్థితి కనిపించింది. అయినా తన పార్టీ కార్యకర్తలతోనో, అబద్ధపు సాక్ష్యాలు క్రియేట్ చేయగల సామర్ధ్యం ఉన్నవ్యక్తి చంద్రబాబు నాయుడు. అసలు చంద్రబాబు వరద ప్రాంతాల్లో చేసిన పర్యటన చూస్తే... ప్రభుత్వ పనితీరు, సహాయ చర్యలు ఏవిధంగా జరుగుతున్నాయని పరిశీలించడానికి వెళ్ళాడా? లేక రాజకీయ లబ్ధి కోసం, తన ప్రచార ఆర్భాటం చూపించడానికి వెళ్ళాడా అన్న అనుమానం కలుగుతోంది. బాబు హడావుడి, పబ్లిసిటీ పిచ్చి అంతా నిన్న, ఈరోజు జరిగిన రోడ్ షోల్లోనే కనిపించింది. మీడియాను వెంట వేసుకుని, మీడియా కెమెరాలకు తగినట్లుగా తను ట్యూన్ కావడం, సందర్భానికి తగ్గట్టుగా హావభావాలు పలికించడం ఆయన పర్యటనలో చూశాం. తన పర్యటన ద్వారా ప్రజలకు ఏమి సందేశం పంపించాలనుకున్నారో అవన్నీ పచ్చి అవాస్తవాలు అని, ఏమాత్రం నిజం లేదనేది బాధిత ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు తెలుసు. అయినా చంద్రబాబు తన పంథాను కొనసాగిస్తూనే ఉన్నారు.
బాబు పబ్లిసిటీ పిచ్చికి ఇవిగో సాక్ష్యాలు..
ఒక స్టేట్ ఆఫ్ మైండ్తో, దానికి తగ్గట్టే ప్రభుత్వం మీద, మా ముఖ్యమంత్రిగారి మీద విమర్శలు చేస్తూ వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు విన్యాసాలు చేస్తున్నారు. చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధం అనేదానికి సంబంధించిన వీడియోలను మీడియా ముందు ప్రదర్శిస్తున్నాం. అబద్ధం సాక్ష్యం క్రియేట్ చేయడం ఒకటైతే, వరద బాధితులను పరామర్శించడం కంటే ప్రచారం కోసమే చంద్రబాబు అక్కడకు వెళ్లారు అనేదానికి ఈ వీడియో క్లిప్పింగ్ లే సాక్ష్యాలు. రాష్ట్ర ప్రజలంతా వీటిని చూడాలి అంటూ ఆ వీడియో క్లిప్పింగ్స్ను ప్రదర్శించారు.
1- తాగే నీళ్ళు అన్నీ మురికి అంటూ చంద్రబాబు నిన్న బాటిల్ పట్టుకుని చూపించాడు. ఆ బాటిల్ ఇచ్చినామే.. అది టీడీపీ వాళ్ళెవరో ఇవ్వటం వల్లే చంద్రబాబుకు ఇచ్చాను అని, నాకు తెలియదు అని చెప్పింది. తమకు మంచినీళ్ళు వస్తున్నాయని చెప్పింది.
2- బోటులో ప్రయాణిస్తున్నప్పుడు మీడియాలో కవరేజ్ కోసం కెమెరాల కోసం చంద్రబాబు ఆత్రం చూస్తే... అప్పట్లో రాష్ట్ర విభజన సమయంలో పార్లమెంట్ వద్ద కెమెరాలు రెడీనా అన్న సన్నివేశం గుర్తుకు వచ్చింది.
ఈ రెండు వీడియోలు చూడగానే 40ఏళ్ల చంద్రబాబు అబద్ధపు రాజకీయ జీవితం అలానే కొనసాగుతూ ఇవాళ ఆఖరి దశకు చేరినట్లు ఉంది. అబద్ధాలతో మొదలైన జీవితం అలా సాగుతూ... చివరకు అబద్ధం, నిజం మధ్య ఉండే సన్నటి గీత చెరిగిపోయాక అబద్ధమే నిజం అనే స్థితికి, అసలు నిజమే లేదు... అబద్ధమే జీవితం అనే స్థాయికి చేరి అదే భ్రాంతిలో చంద్రబాబు నాయుడు ఉన్నాడేమో అనిపిస్తోంది. చంద్రబాబు నాయుడు మామకు వెన్నుపోటు పొడిచి అడ్డదారిలో అధికారంలోకి వచ్చాడు. అధికారం అనేది హక్కుగా బాబు భావిస్తున్నాడు. ఈ హక్కుకు భంగం కలిగితే తట్టుకోలేడు. భ్రాంతికి తోడు ఈ స్థితి కూడా తోడు కావడం, మరోవైపు ఆ మైకాన్ని మరింత ఎక్కించే ఎల్లో మీడియ గొట్టాలు తోడైతే ఎలాంటి పరిస్థితి ఉంటుందో దానికి ఉదాహరణే చంద్రబాబు నాయుడు ఉదంతంగా చెప్పుకోవాలి. ఇదంతా వరద ప్రాంతాల్లో పరామర్శ పేరుతో చంద్రబాబు చేస్తున్న విన్యాసాలు చూస్తే చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది.
బాబు హయాంలో ఒక్క రుపాయి అయినా తక్షణ సాయం చేశాడా..?
చంద్రబాబు నాయుడు హయాంలో వరదలు, కరువు వస్తే బాధితులకు ఏరోజు అయినా ఒక్క రూపాయి అయినా తక్షణ సాయం అందించారా?. తాను ఈ పని చేశానని చెప్పుకోవడానికి చంద్రబాబుకు ఏమైనా మిగిలిందా? ఆయనకు మిగిలిందల్లా విపత్తు సమయంలో చీపుర్లు పట్టుకుని రోడ్లు ఊడుస్తున్నట్లు ఫోజులు ఇవ్వడమే. విపత్తు వచ్చినప్పుడు బాధితులకు అండగా వ్యవస్థలు నడవలా లేక ఒక వ్యక్తికి ఉండాలా అంటే చంద్రబాబు మాత్రం తానే ఉండాలనుకునే రకం. ఆ లక్షణం వల్లే గోదావరి పుష్కరాల్లో 29మంది ప్రాణాలు కోల్పోయారు. చంద్రబాబుకు ఎప్పుడూ మీడియాలో కనిపించేందుకు ప్రచార ఆర్భాటం, యావతో అధికారులను పనులు కూడా సరిగా చేయనిచ్చేవాడు కాదు. అంతేకాకుండా విపత్తు సమయంలో తక్షణ సాయంగా బాధితులకు ఏమైనా చేశారా? అంటే, ఎప్పుడూ చేయలేదు. ఆయన చేసి ఉంటే, జీవోలు చూపించమనండి.
ఇవిగో జీవోలు.. అదిగో సాయం
తాను పర్యటనకు వస్తేనే రెండువేలు ఇస్తున్నారని చంద్రబాబు చెప్పడం సిగ్గుచేటు. అప్పటికన్నా వ్యవస్థ ఇప్పుడు గ్రాస్రూట్ లెవల్కు వెళ్లి డీసెంట్రలైజ్ అయింది. అప్పుడున్న రెండు జిల్లాలు ఇప్పుడు ఆరు జిల్లాలు అయ్యాయి. ఆరుగురు కలెక్టర్లు, ఆరుగురు జేసీలు, ఎస్పీలు, గ్రామ సచివాలయాలుతో పాటు 50మంది జనాభాకు ఒక వాలంటీర్ ... ఇలా బలోపేతమైన వ్యవస్థ తయారైంది. గోదావరికి వరద రాకముందే 12వ తేదీనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిగారు అధికారులు, జిల్లా కలెక్టర్లతో ముందస్తుగా వరదలపై సమీక్ష నిర్వహించి ఎలాంటి ప్రాణ నష్టం రాకూడాదని ఆదేశాలు ఇచ్చారు. ఆరు జిల్లాలకు సంబంధించి వరద బాధితులకు సాయం అందించేందుకు తొమ్మిదిన్నర కోట్లు నిధులు కేటాయిస్తూ, అలాగే తక్షణ సాయం కింద రూ. 2వేలు ఇవ్వాలంటూ రెండు జీవోలు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ జీవోలను ఒకసారి చూడండి. ఇందులో 37, 38 నంబర్ జీవోలు జులై 12నే జారీ చేస్తే.. మిగతా జీవోలు జులై 15న, చివరి జీవో జులై 18న జారీ చేశారు. చంద్రబాబు తన జన్మకు ఏనాడైనా ఇలా చేశారా?, జన్మకు ఎందుకు, మూడేళ్ళ క్రితం వరకు అధికారంలో ఉన్నప్పుడు అయినా ఇలా చేశారా, అంటే లేదు. ఈ నెల 16వ తేదీన ముఖ్యమంత్రిగారు వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు.
- 15వ తేదీ నిత్యావసర వస్తువులు పంపిణీకి సంబంధించి వరద బాధితులకు అందించడం జరిగింది. దీనిపై బాధితులకు నాలుగు ఉల్లిపాయలు, ఆలుగడ్డలు అంటూ చంద్రబాబు ట్వీట్ చేస్తూ ఫోటో పెట్టడం చంద్రబాబు దాష్టీకానికి నిదర్శనం. అసలు చంద్రబాబు మనిషేనా? ఆయన పైశాచికత్వం ఏంటో అర్థం కావడం లేదు.
- టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రజలకు ఏం చేశారు? మా ప్రభుత్వ హయాంలో ప్రజలకు ఏం చేస్తున్నామనే దానిపై కావల్సినన్ని లిట్మస్ టెస్ట్లు ఉన్నాయి. ముఖ్యమంత్రిగారు చేసిందేమిటంటే... ప్రచార ఆర్భాటం లేకుండా వ్యవస్థ కదలాలి, అధికారులు అప్రమత్తం కావాలి, అందుకు అవసరం అయిన వనరులు సమకూర్చాలి, యంత్రాంగం అంతా ఎఫెక్టివ్గా పనిచేయాలనేదే ముఖ్య ఉద్దేశం. తమకు సాయం అందలేదని బాధితుల నోటి నుంచి మాట రాకుండా చూసుకోవాలని జిల్లా కలెక్టర్లు, అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
పబ్లిసిటీ కోసం సీఎం జగన్ గారు పనిచేయరు
అంతేకానీ పబ్లిసిటీ కోసం ముఖ్యమంత్రి జగన్ గారు ఎప్పుడూ పనిచేయరు. కిందవాళ్ల చేతులు కట్టేసి పని చేయమని మేము అనడం లేదు. అధికారులకు బాధ్యతలను గుర్తు చేయడంతో పాటు, వారికి కావల్సిన వనరులు కూడా సమకూర్చి, క్షేత్రస్థాయిలో పనులు చేయిస్తున్నారు. వరద బాధితులను ఆదుకున్న తర్వాత, ఆ ప్రాంతాల్లో తాను పర్యటిస్తాను, అప్పటికి బాధితులెవరూ తమకు సాయం అందలేదనే మాట రాకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. అంతేకానీ పనులు జరగకుండా అడ్డుపడుతూ లైట్స్ ఆన్, కెమెరా.. యాక్షన్.. అంటూ చంద్రబాబులా ప్రచారం చేయడం ముఖ్యమా?. పని జరగటం ముఖ్యమా..?
- చంద్రబాబు నాయుడు అంటేనే అబద్దం. నిజాయితీ, నిజం, నిబద్ధతతో జగన్ మోహన్ రెడ్డిగారు ఉంటారు కాబట్టే తాను కనపడకుండా... చేతల్లో కనిపిస్తున్నారు. చంద్రబాబు నాయుడు, తానే స్క్రీన్ అంతా కనిపించాలనుకునే రకం అయితే జగన్గారు చేతల్లో చూపిస్తున్నారు. ఎవరూ ఊహించనంతగా ఇంత పెద్ద ఎత్తున వరదలు వచ్చినా, అధికార యంత్రాంగం అప్రమత్తం అయింది. ప్రభుత్వం ఇచ్చిన సపోర్టు, ఆర్థిక వనరుల మంజూరుతో పోటీ పడి పనిచేస్తున్నారు. వాటితో పాటు వ్యవస్థలు క్రిందిస్థాయి వరకూ వెళ్లడంతో పనులు చక్కగా జరుగుతున్నాయి. అక్కడక్కడ చిన్నపాటి లోపాలు ఉండవచ్చు. వాటిని మీడియాను చూపిస్తోంది.
- బోటు బోల్తా పడటాన్ని కూడా చంద్రబాబు నాయుడు బృందం ప్రచారంగానే తీసుకుంది. వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్లిన చంద్రబాబు అక్కడ చేసిందేంటయ్యా అంటే.. రెండు ఫోటోలు తీసుకోవడం, రోడ్డు షోలు చేయడమే. అనుకోకుండా వచ్చిన ఈ విపత్తులో "ప్రజలకు ఏదైనా జరిగితే బాగుండేది, అప్పుడు మాకు మాట్లాడేందుకు సరుకు దొరికేది కదా.." అనే ఆలోచన చేస్తాడు. ఇటువంటి ఆలోచనలు చేసే వారిని ఈ రాక్షస మూకలే అనాలి. అలాంటిది మరణాలేవీ లేకపోవడంతో, చంద్రబాబు అండ్ కో బ్యాచ్కు ఈ పర్యటనలో ఆశాభంగం కలిగినట్లు అనిపిస్తోంది. చంద్రబాబు నాయుడు నైజం మాత్రం ఎప్పటికీ మారదు.
వరద బాధితులకు రూ. 2వేలు తక్షణ సాయం ఇచ్చిన ఏకైక ప్రభుత్వం మాదే
వరద బాధితులకు తక్షణ సాయంగా రెండువేలు ఇవ్వడం అనేది రాష్ట్రంలో ఇదే తొలిసారి. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏ సీజన్లో అయితే నష్టం(పంట, ఆస్తి, ప్రాణ) కలిగితే ఆ సీజన్ ముగిసేలోగా ఇన్ఫుట్ సబ్సిడీ, పరిహారం అందేలా ఒక నిబంధన పెట్టుకుని దానికి తగ్గట్టుగా పనిచేస్తున్నాం. 2017-18, 2018-19లో ఇన్పుట్ సబ్సిడీని చంద్రబాబు నాయుడు ఎగ్గొట్టేసి పోయాడు. మా ప్రభుత్వం ఆయా సీజన్ ముగిసేలోపే ఇస్తోంది. కాదని చెప్పమనండి... చేతనైతే రుజువు చేయండి. తాను మూడేళ్ల క్రితం తన పాలనలో ఏం చేశాడో చెప్పుకోలేని చంద్రబాబు మళ్లీ సిగ్గు లేకుండా పక్కరాష్ట్రం పదివేలు ఇస్తున్నారంటున్నాడు.
- చంద్రబాబు నాయుడు ఇచ్చే స్టేట్మెంట్లు అన్ని అబద్ధాలే. వరదలపై పూర్తి అప్రమత్తతతోపాటు, సహాయక చర్యలు చేపట్టడం, పునరావాసం కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం అన్నింటా ముందుంది అనేది మేం సాక్ష్యాధారాలతో సహా మీడియా ముందు ఉంచాం.
- చిన్న చిన్న లోపాలను సరిదిద్దుకోవడానికి ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. మురికి నీళ్లు బాటిల్లో చూపిస్తూ బురద రాజకీయాలు చేయడం చంద్రబాబు సహజ లక్షణం. అందులో భాగంగానే బాబు విమర్శలు ఉన్నాయి. చంద్రబాబు తన హయాంలో ఏం చేశాడో చెప్పాలి. అంతేకానీ మాపై విమర్శలు చేయడం సరికాదు.
- చంద్రబాబు నాయుడు తాను ఏంచేశాడో చెప్పనంతకాలం ఆయన ఫెయిల్డ్ వన్. ఫెయిల్యూర్ పర్సన్. ఫెయిల్యూర్ లీడర్గా, ఆయన పాలన ఫెయిల్.. అని చెబుతాం. ఇందుకు ఆయన ఏం చేశాడో చెప్పలేకపోవడాన్నే రుజువులుగా తీసుకోవాలి.
- చంద్రబాబు తీవ్ర అసహనంలో ఉన్నారు. ఇప్పుడు వచ్చిన వరదల్లో 30మందో 40మందో ప్రాణాలు కోల్పోయి ఉంటే ముఖ్యమంత్రిగారిపై ధ్వజం ఎత్తడానికో, ప్రభుత్వ యంత్రాంగం ఫెయిల్ అయితే ఎత్తి చూపాలని ఆశపడ్డాడు. ఆయన అనుకున్నవేమీ జరగలేదు. చంద్రబాబు నాయుడు అధికారంలో లేనందుకు దుష్టచతుష్టయానికి ఆక్రోశం, కడుపు మంట, బాధ ఉన్నాయేమో...
- అవన్నీ ప్రజలకు ఎందుకు లేవనదే చంద్రబాబు బాధ.
- తమకు అధికారం ఇవ్వలేదని ప్రజలను తిట్టే స్టేజ్కు టీడీపీ, దాని అధినేత చంద్రబాబు వెళ్లిపోయారు. అంతేతప్ప తమలో ఉన్న లోపాన్ని ఎందుకు సరిదిద్దుకోవడం లేదు. అధికారంలో ఉండటం హక్కుగా చంద్రబాబు భావిస్తాడు కాబట్టే ఊకదంపుడు ఉపన్యాసాలు చేస్తాడు.