సాయం ఎలా ఎగ్గొట్టాలన్నది బాబు సిద్ధాంతం.. సాయం ఎలా ఇవ్వాలన్నదే వైయ‌స్ జగన్ లక్ష్యం

మీడియా స‌మావేశంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కోటగిరి శ్రీధర్,  గొడ్డేటి మాధవి, తలారి రంగయ్య,  ఎన్ రెడ్డప్ప 

చేయగలిగినదానికి మించి వరద ప్రాంతాల్లో సహాయ చర్యలు

  48 గంటల్లోనే వరద బాధితులకు రూ. 2 వేలు తక్షణ సాయం అందించాం

  పోలవరంలో చంద్రబాబు చేసిన తప్పులను జగన్ గారు సరిదిద్దుతున్నారు

  ఇక రాష్ట్రానికి చంద్రబాబు అవసరం లేనే లేదు:  ఎంపీ కోటగిరి శ్రీధర్

 ముంపు మండలాల్లో చంద్రబాబు దుష్ట రాజకీయం

  మాకు సహాయం అందలేదని ఏ ఒక్కరూ చెప్పలేదు

  ఎంపీ గొడ్డేటి మాధవి 

 న్యూఢిల్లీ:  రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు సాయం ఎలా ఎగ్గొట్టాలన్నది చంద్ర‌బాబు సిద్ధాంతం.. సాయం ఎలా ఇవ్వాలన్నదే వైయ‌స్ జగన్ మోహ‌న్ రెడ్డి లక్ష్యమ‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కోటగిరి శ్రీధర్,  గొడ్డేటి మాధవి, తలారి రంగయ్య,  ఎన్ రెడ్డప్ప అన్నారు. న్యూఢిల్లీలో పార్టీ ఎంపీలు మీడియాతో మాట్లాడారు. గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులైన ప్రతి ఒక్కరికీ, 48 గంటల్లోనే, వేగంగా సహాయం అందించి, వారిని ఆదుకున్న మనసున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిగారు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు శ్రీ కోటగిరి శ్రీధర్, శ్రీమతి గొడ్డేటి మాధవిలు అన్నారు. ఢిల్లీలోని ఏపీ భవన్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ.. వరదల నేపథ్యంలో యావత్తు ప్రభుత్వ యంత్రాంగాన్ని ముందుగానే అప్రమత్తం చేసి, ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా ముంపు గ్రామాల ప్రజలను కాపాడారన్నారు. వరద తగ్గాక, ముంపు మండలాల్లో ముఖ్యమంత్రి గారు రెండు రోజులు పర్యటిస్తే.. ఏ ఒక్క బాధితుడు కూడా తమకు సహాయం అందలేదన్న మాట చెప్పలేదన్నారు.  వరద వస్తుందని తెలియగానే, వరద చేరుకోకముందే.. ప్రతి కుటుంబాన్ని పునరావాస కేంద్రాలకు తరలించామని చెప్పారు. ప్రతి బాధిత కుటుంబానికి రూ. 2 వేలు తక్షణ సాయంతో పాటు, 25 కిలోల బియ్యం, పప్పులు, నూనెలు, కూరగాయలు అందించారన్నారు.  పరిపాలన అంటే ఇలా ఉండాలి, రాష్ట్రానికి నాయకుడు అంటే ఇలా ఉండాలి...  అనే విధంగా ఆపద సమయంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిగారు బాధితులకు అండగా నిలిచారన్నారు. 48 గంటల్లోనే సచివాలయ వ్యవస్థ- వాలంటీర్ల ద్వారా ప్రతి బాధిత కుటుంబానికి రూ. 2 వేలు తక్షణ సహాయం అందించారన్నారు.  సీఎం గారు గంట- గంటకు ముంపు ప్రాంతాల్లోని జిల్లా యంత్రాంగం, కలెక్టర్లతో మాట్లాడటం, జిల్లాకు ఇద్దరు మంత్రులను ఇన్ చార్జిలుగా పెట్టి, ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా చూశారన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత.. ఏ ముఖ్యమంత్రీ పర్యటించని రాష్ట్ర సరిహద్దుల్లోని మారుమూల గ్రామాల్లో సైతం  జగన్ గారు పర్యటించి, ముంపు గ్రామాల ప్రజల బాధలను తెలుసుకుని, వారికి భరోసా కల్పించారన్నారు.  ఆపదలో ఉన్న ప్రజలను ఆదుకోవడంలో ప్రభుత్వ యంత్రాంగంతో పాటు.. పార్టీ కార్యకర్తలు, వాలంటీర్లు ముందున్నారన్నారు. అర్హులైన ప్రతి ఒక్క బాధితుడికి సహాయం అందుతుందన్నారు. సహాయం ఎవరికైనా మిస్ అయిందంటే.. బహుశా అది ఒక్క చంద్రబాబు నాయుడుకే అయి ఉండవచ్చు అని ఎద్దేవా చేశారు. వరదలకు అమరావతిలో చంద్రబాబు ఉండే ఆయన భవనం కూడా నీట మునిగి ఉంటే.. ఆయనకు కూడా రూ. 2 వేలు నష్టపరిహారం ఇవ్వాలేమో.. అని వ్యంగంగా ఎత్తిపొడిచారు. అంతకుమించి, వరద బాధిత  ప్రాంతాల్లోని ప్రజలు ఏ ఒక్కరూ తమకు సహాయం అంద లేదని చెప్పటం లేదు అని అన్నారు. వరద ప్రాంతాల్లో జగన్ మోహన్ రెడ్డిగారి పర్యటన, ఆయన పట్ల ప్రజలు చూపిస్తున్న అభిమానం, ఆదరణ చూశాక పాదయాత్ర గుర్తొచ్చిందన్నారు. శక్తివంచన లేకుండా, చేయగలిగిన దానికి మించి వరద బాధిత ప్రాంతాల్లో సహాయ చర్యలు చేపట్టామని తెలిపారు. బాధితులకు ఎలా సహాయం ఎగ్గొట్టాలనేది చంద్రబాబు సిద్ధాంతం అయితే.. ఎలా ఇవ్వాలన్నదే  జగన్ గారి లక్ష్యం.. అని ఎంపీలు తెలిపారు. 

బాబుకు ఆ పాటి జ్ఞానం లేదా..?
        జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరానికి సంబంధించి, ప్రతి రూపాయి కేంద్రం నుంచే తెచ్చుకోవాల్సిన అవసరం ఉందని  శ్రీధర్ చెప్పారు. ఆ విషయమే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిగారు మాట్లాడితే.. చంద్రబాబు నిన్న, ఈరోజు పోలవరం ముంపు మండలాల్లో తిరుగుతూ, పోలవరం ప్రాజెక్టుపై చేతులెత్తేశారని దుష్ప్రచారం చేస్తున్నారని ఎంపీ కోటగిరి శ్రీధర్ మండిపడ్డారు.  రాజకీయాల్లో 40 ఏళ్ళు అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబుకు ఈపాటి జ్ఞానం లేకపోవడం సిగ్గు చేటు అని విమర్శించారు. చంద్రబాబు పరిపాలనలో జరిగిన తప్పులను సరిదిద్దుతూ,  ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసేందుకు జగన్ మోహన్ రెడ్డి గారు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారన్నారు.  ఇప్పటికే పోలవరం ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం రూ. 2900 కోట్లు సొంతంగా ఖర్చు చేసిందని, దానిని రీయింబర్స్ చేయాలని కేంద్రాన్ని పదే పదే కోరుతున్నామన్నారు. చంద్రబాబు నాయుడు అనుసరించిన తప్పుడు విధానాల వల్లే ఈరోజు పోలవరం ప్రాజెక్టు ఆలస్యమైందన్నారు. 

జగన్ గారిని చూసి బాబు నేర్చుకోవాలి..
        ముఖ్యమంత్రి జగన్ గారు తాడేపల్లిలో నివాసం ఉంటున్నారని చంద్రబాబు పదే పదే విమర్శలు చేస్తున్నారు. తాడేపల్లి అనేది ఏపీలోనే ఉంది. చంద్రబాబు స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నట్టు హైదరాబాద్ జూబ్లిహిల్స్ లో, తెలంగాణలో లేదు కదా.. అని సూటిగా ప్రశ్నించారు శ్రీధర్. చంద్రబాబు నాయుడు ఇంకా బుద్ధి తెచ్చుకోకుండా  ఇలానే విమర్శలు చేస్తే.. వచ్చే ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డిగారు చెప్పినట్టు 175 స్థానాలకు 175 సీట్లు సాధిస్తాం అని చెప్పారు. ఇప్పటికైనా చంద్రబాబు తన 40 ఏళ్ళ అనుభవాన్ని పక్కనపెట్టి, నిజమైన పరిపాలన అంటే ఎలా ఉండాలో..  జగన్ గారిని చూసి నేర్చుకోవాలి అని హితవు పలికారు. గత ఎన్నికల్లో టీడీపీ చెత్త పాలన, విధానాల వల్ల, ఇచ్చిన వాగ్దానాలను తుంగలో తొక్కడం వల్ల మాకు 151 సీట్లు వస్తే.. ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్ గారి పరిపాలన చూసి అభిమానంతో, ఆనందంతో ప్రజలు మాకు 170కు పైగా స్థానాల్లో గెలిపిస్తారన్న నమ్మకం, దీమా ఉందన్నారు. ఫస్ట్ టైం ఎంపీగా గెలిచిన నేను చంద్రబాబుకు చెబుతున్నాను... 2024లోనే కాదు, 2029, 2034లో కూడా జగన్ గారే ముఖ్యమంత్రి అవుతారని గుండె మీద చేయి వేసుకుని మరీ దమ్మూ, ధైర్యంతో చెబుతున్నామన్నారు. 

- ఇక అమరావతికి గానీ, ఆంధ్రప్రదేశ్ కుగానీ చంద్రబాబు అవసరం లేనే లేదు. బహుశా హైదరాబాద్ లోనే స్థిరపడిపోయిన చంద్రబాబు అటునుంచి అటు సింగపూర్ వెళ్ళి స్థిరపడతాడేమో.. అని శ్రీధర్ అన్నారు. 

వ్యవసాయాన్ని పండగ చేసిన ముఖ్యమంత్రి జగన్ గారు..
        ముఖ్యమంత్రి గారు అమలు చేస్తున్న నవరత్నాల పథకాలు, సామాజిక సంస్కరణల వల్ల పేదరికం నుంచి  పేదలను బయటకు తీసుకురావలన్న మా ప్రయత్నం మూడేళ్ళలోనే సత్ఫలితాలను ఇస్తుందన్నారు. రాష్ట్రంలోని పేదలు ఈరోజు ఆత్మ విశ్వాసంతో బతుకుతున్నారన్నారు.  పోలవరం నియోజకవర్గంలో రైతాంగం చాలా ఆనందంగా ఉన్నారని  చెబుతూ,  పొగాకు పండించే రైతుల కోసం మార్క్ ఫెడ్ ను రంగంలోకి దింపి, ప్రతి ఆకును కొనుగోలు చేశామన్నారు. దీంతో కేజీకి రూ. 245 ధర పెరిగి, ఎకరాకు రూ. 3 లక్షలు పోలవరం నియోజకవర్గంలో రైతులకు లాభం జరిగిందన్నారు. అలానే, జగన్ గారు తన పాదయాత్రలో పామాయిల్ రైతుల కష్టాలు చూసి, పామాయిల్ కు మినిమమ్ ధర రూ. 10 వేలు ఇస్తామన్నారని, అయితే అంతకు మించి ఈరోజు  రూ. 23 వేలు ధర వచ్చిందని తెలిపారు.  టీడీపీ హయాంలో పామాయిల్ టన్ను రూ. 7 వేలు ఉంటే గొప్ప అనిపించేదని, ఇప్పుడు ఎకరాకు రూ. 3 లక్షల ఆదాయం వచ్చే పరిస్థితి ఉందని తెలిపారు.  స్వాతంత్ర్యం వచ్చాక, వ్యవసాయం అంటే పండగ అని చేతల్లో చూపించిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిగారు అని గర్వంగా చెబుతామన్నారు. వ్యవసాయమే స్పూర్తి, రైతులే ఊపిరి అన్నట్టుగా జగన్ గారి  పరిపాలన ఉందన్నారు. అలానే, సోషల్ ఇం బ్యాలెన్స్ లు తగ్గించడానికి పలు పథకాలు అమలు చేస్తున్నారన్నారు. ఎవరూ, ఎవరికన్నా గొప్ప కాదని, మరెవరూ తక్కువ  కాదని, తన పరిపాలన ద్వారా ముఖ్యమంత్రి జగన్ గారు రుజువు చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి జగన్ గారు అమలు చేస్తున్న కార్యక్రమాలు, పథకాల వల్ల, ఇతర రాష్ట్రాలే కాదు.. ఇతర దేశాలు కూడా మన రాష్ట్రంవైపు చూస్తున్నాయని చెప్పారు. కొవిడ్ సమయంలో ఏ పేదవాడు కూడా ఇబ్బంది పడకుండా, రాష్ట్రంలోని పేద ప్రజల ప్రాణాలను నిలబెట్టిన ముఖ్యమంత్రి జగన్ గారు అని గర్వంగా  చెబుతామన్నారు.  ఈరోజు ఇతర రాష్ట్రాలకంటే.. ఏపీ చాలా బలంగా ఉందన్నారు. ఓటు రాజకీయాలకు సంబంధం లేకుండా, కులం, మతం, రాజకీయాలను చూడకుండా.. తాను పరిపాలన చేస్తానని ప్రమాణస్వీకారం నాడు ఏ మాట అయితే చెప్పారో.. మూడేళ్ళుగా అదే రీతిలో పరిపాలన చేస్తున్నారన్నారు. 

ఎంపీ  గొడ్డేటి మాధవి మాట్లాడుతూః
- మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన, ఛత్తీస్ గఢ్, ఒడిశా, తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న అరకు పార్లమెంటు నియోజకవర్గంలోని గోదావరి ముంపు గ్రామాల్లో తన సెక్యూరిటీని కూడా లెక్కచేయకుండా ముఖ్యమంత్రి జగన్ గారు పర్యటించి కష్టంలో ఉన్న ప్రజల బాధలను స్వయంగా తెలుసుకున్నారన్నారు. ముంపు గ్రామాల ప్రజలను ఆదుకోవడంలో జగన్ గారు అందరికంటే ముందున్నారన్నారు ఎంపీ మాధవి. 
- కేవలం పబ్లిసిటీ కోసం చంద్రబాబు, టీడీపీ నేతలు పర్యటిస్తుంటే, ప్రజలను ఆదుకోవడమే లక్ష్యంగా జగన్ గారి పర్యటన సాగిందన్నారు. ముఖ్యమంత్రి గారు బాధితుల ఇళ్ళకు వెళ్ళి, మీకు రేషన్ ఇచ్చారా, రూ. 2 వేలు సాయం అందిందా, కలెక్టర్ అండదండగా ఉన్నాడా, లేదా.. అని అడిగి తెలుసుకున్నారన్నారు. జగన్ గారి పర్యటనలో..  ఏ ఒక్కరూ కూడా, మాకు ఇది రాలేదని చెప్పలేదు అని స్పష్టం చేశారు. 
- చంద్రబాబు కేవలం దుష్ట రాజకీయం చేయడం కోసం, ముంపు గ్రామాల్లో పర్యటిస్తూ, ముఖ్యమంత్రి గారిని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని అన్నారు. ఒకవైపు మావోయిస్టుల వారోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో..  రెండు ముంపు మండలాల్లో కేవలం 2 గంటల పర్యటనకు మాత్రమే సెక్యూరిటీ వారు అనుమతి ఇస్తే, నిబంధనలు పక్కనపెట్టి, ప్రతి ఒక్కరినీ జగన్ గారు పరామర్శించారన్నారు. కేవలం రెండు ప్రదేశాల్లో మాత్రమే జగన్ గారి పర్యటనకు సెక్యూరిటీ అధికారులు పర్మిషన్స్ ఇస్తే.. 16 ప్రదేశాల్లో ముఖ్యమంత్రి జగన్ గారు పర్యటించి ప్రజలకు భరోసా ఇచ్చారన్నారు. ముఖ్యమంత్రి జగన్ గారికి ప్రజల పట్ల ఉండే బాధ్యత, ప్రేమ, అభిమానాలకు ఆయన పర్యటనే నిదర్శనమన్నారు ఎంపీ మాధవి.

తాజా వీడియోలు

Back to Top