వైయస్ఆర్ కడప: డాక్టర్ ఈసీ గంగిరెడ్డి తన సేవలతో ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించి చిరస్మరణీయులుగా నిలిచిపోయారని వైయస్ఆర్ ర్సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అన్నారు. వైయస్సార్ జిల్లా పులివెందుల భాకరాపురంలోని వైయస్సార్ ఆడిటోరియంలో ఆదివారం ప్రముఖ చిన్నపిల్లల వైద్యుడు డాక్టర్ ఈసీ గంగిరెడ్డి ప్రథమ వర్ధంతిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన సంస్మరణ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ఎంత కాలం బతికామన్నది కాదు.. ఎలా బతికామన్నది ముఖ్యమని ఎప్పుడూ వైయస్సార్ చెప్పేవారన్నారు. అలాంటి వారు సమాజంలో ఒక గుర్తింపు కలిగి ఉంటారని, వారు ఈ లోకంలో లేకపోయినా వారు చేసిన పనులు, ప్రజలతో మెలిగిన తీరును కలకాలం ప్రజలు కీర్తిస్తూనే ఉంటారని వివరించారు. గంగిరెడ్డి అన్నలో తనకు.. క్రెడిబులిటీ, కమిట్మెంట్, కరేజ్, కేర్, కన్సర్న్ లక్షణాలు ప్రధానంగా కనిపించాయని, ఆయనలో ఇంకా అనేక మంచి గుణాలు ఉన్నాయని చెప్పారు.
అందరికీ వారధి
అన్న గంగిరెడ్డి, సుగుణమ్మ దంపతులిద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని వైయస్ విజయమ్మ చెప్పారు. బంధాలకు, అనుబంధాలకు విలువ ఇస్తారన్నారు. ‘ఎలాంటి మనస్పర్థలు వచ్చినా వారధిలా వ్యవహరించి అందరినీ ఒకతాటిపైకి తెచ్చి నడిపించడంలో ఆయనకు ఆయనే సాటి. ప్రతిఫలం ఆశించకుండా పని చేసుకుంటూ వెళ్లే వారు. డబ్బు గురించి ఆయన ఏనాడూ ఆలోచించలేదు. ఇది నా మాట కాదు.. జనం మాట. హస్తవాసి మంచిదని నాలుగు జిల్లాల నుంచి ప్రజలు వైద్యం కోసం వచ్చే వారు. వారణాసిలో తనకు అత్యంత ముఖ్య స్నేహితుడైన దినేష్ను మరచిపోకూడదని తన కుమారుడికి అదే పేరు పెట్టుకున్న గొప్ప వ్యక్తిత్వం ఆయనది. దివంగత సీఎం డాక్టర్ వైయస్సార్, డాక్టర్ ఈసీ గంగిరెడ్డిల మధ్య చాలా మంచి అనుబంధం ఉండేది’ అని వివరించారు.