బాబులను ఇంటికి పంపండి

చీరాల సభలో వైయస్‌ షర్మిల

జయంతికి, వర్ధంతికి తేడా తెలియని వ్యక్తికి మూడు మంత్రిత్వ శాఖలా?

చంద్రబాబును చూసి ఊసరవెళ్లి సైతం సిగ్గుతో పారిపోతుంది

జగనన్న పోరాడకపోతే హోదా ఊసే చంద్రబాబు ఎత్తకపోయేవారు

బాబు–మోడీ జోడి కలిసి ప్రత్యేక హోదాను ఎగ్గొట్టేశారు

వచ్చే రాజన్న రాజ్యంలో మళ్లీ రైతు రాజవుతాడు

జగనన్న సీఎం అయితే ప్రతి పేదవాడికి ఇల్లు..ప్రతి ఎకరాకు నీరు

 

ప్రకాశం: చంద్రబాబు వస్తే కరువు వస్తుందని, ఆయన్ను, పప్పును ఇంటికి పంపించాలని వైయస్‌ జగన్‌ సోదరి వైయస్‌ షర్మిల పిలుపునిచ్చారు. చంద్రబాబును చూసి ఊసరవెళ్లి కూడా సిగ్గుతో పారిపోతుందని ఆమె వ్యాఖ్యానించారు. రాజన్న పాలన రావాలంటే జగనన్న రావాలని పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రకాశం జిల్లా చీరాల పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైయస్‌ షర్మిల పాల్గొని ప్రసంగించారు. ఆమె మాట్లాడుతూ..
దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి ఐదేళ్లలో సుపరిపాలన అందించారు. ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలని చేసి చూపించారు. తన ప్రజలకు కావాల్సింది చేయాలని తపన పడిన నేత వైయస్‌ఆర్‌ మాత్రమే అన్నారు. గత ఐదేళ్లుగా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ముఖ్యమంత్రి అంటే ఎలా ఉండకూడదో..ముఖ్యమంత్రిగా ఏ పనులు చేయకూడదో అవన్నీ కూడా చేశారు. రైతులకు మొత్తం రుణాలు మాఫీ చేస్తామని అధికారంలోకి వచ్చారు. డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ చేస్తామని ఐదేళ్లలో ఒక్క రూపాయి కూడా మాఫీ చేయలేదు. ఇప్పుడు పసుపు–కుంకుమ పేరుతో భిక్షం ఇచ్చినట్లు ఇచ్చి మళ్లీ మోసం చేస్తున్నారు. నమ్ముతారా? ఎంగిలి చేయి విదల్చుతున్న చంద్రబాబును చూసి మోసపోవద్దు. పూర్తి ఫీజులు చెల్లించడం లేదు. తల్లిదండ్రులు తమ పిల్లలను చదివించలేక అప్పులపాలవుతున్నారు.

మళ్లీ పేదవారు గవర్నమెంట్‌ ఆసుపత్రికి వెళ్లాలని శాసిస్తున్నారు. ఆయనకు, ఆయన కుమారుడికి జబ్బు చేస్తే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తారా? పోలవరం ఐదేళ్లలో పూర్తి చేస్తామన్నారు. చంద్రబాబు మాట మీద నిలబడిన వ్యక్తి అయితే ఈ పాటికి పూర్తి అయ్యేది. రాజధాని పేరుతో వేల ఎకరాల భూములు దోచుకున్నారు. ఒక్క శాశ్వతమైన భవనం కూడా రాజధానిలో కట్టలేని చేతకాని ముఖ్యమంత్రి మనకు అవసరమా? ప్రజాతీర్పు..బై బై బాబు అంటూ నినదించారు.
బాబు వస్తే జాబు వస్తుందని చెప్పారు. జాబు వచ్చింది ఒక్క చంద్రబాబు కొడుక్కు మాత్రమే. ఈ పప్పుకు వర్ధింతి, జయంతికి తేడా తెలియదు. అఆలు రావు కానీ అగ్రతాంబుళం తనకే కావాలన్నారట..ఇలాంటి వ్యక్తే. ఏ అర్హత, అనుభవం ఉందని మూడు శాఖలకు మంత్రిని చేశారు. ఇది పుత్రవాత్సల్యం కాదా? చంద్రబాబును అడగండి. బాబు–మోడీ జోడి కలిసి మన రాష్ట్రానికి రావాల్సిన హోదాను ఎగ్గోట్టారు. హోదా రాలేదంటే ఆ పాపం చంద్రబాబే. హోదా వద్దు ప్యాకేజీ ముద్దుఅని అమ్ముడపోయారు. ఎన్నికలకు ముందు హోదా అన్నారు. అధికారంలోకి వచ్చాక ప్యాకేజీ అన్నారు. మళ్లీ ఎన్నికలు వచ్చేసరికి హోదా అంటున్నారు. మళ్లీ ఏమంటారో ఆయనకే తెలియదన్నారు. మొన్న ఎన్నికల్లో బీజేపీతో పొత్తు..ఇప్పుడు కాంగ్రెస్‌తో పొత్తు అంటున్నారు. చంద్రబాబుది రెండు నాల్కల దోరణి, రోజుకో మాట..పూటకో వేషం చంద్రబాబుది.

ఈయన మార్చే రంగులు చూస్తే ఊసరవెళ్లి కూడా సిగ్గుతో పారిపోతుంది. జగనన్న ప్రత్యేక హోదా కోసం పోరాటం చేయకపోతే చంద్రబాబు ఈ మాటే మరిచిపోయేవారు. జగనన్న ప్రత్యేక హోదా కోసం ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఉద్యమించారు. యువభేరిలతో యువతను జాగృతం చేశారు. కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టారు. ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేశారు. చంద్రబాబుకు దమ్ముంటే నిజం చెప్పాలి. ఈ రోజు చంద్రబాబు నోట ప్రత్యేక హోదా మాట వచ్చేదా? చంద్రబాబు యూటర్న్‌ తీసుకుంది జగనన్నే కారణం కాదా? నాన్న ఒక మాట అనే వారు. చంద్రబాబు ఏ రోజైతే నిజం చెబుతారో ఆరోజు చంద్రబాబు తల వెయ్యి ముక్కలు అవుతుందట. అందుకే చంద్రబాబు నిజాలు చెప్పరు. అమరావతిలో ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉండి ఒక్క ఇటుక కూడా వేయలేదు.

మళ్లీ వస్తే అమరావతిని సింగపూర్‌ చేస్తారట. అమ్మకు అన్నం పెట్టడుకానీ..చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తా అన్నాడట చంద్రబాబు లాంటి వ్యక్తి ఒక్కరు. గత ఎన్నికల్లో 600 హామీలు ఇచ్చారు. ఐదేళ్లలో ఒక్కటి కూడా నెరవేర్చలేదు. చంద్రబాబును నమ్ముతారా? చేపలకు ఎర వేసినట్లు..చిన్న పిల్లలకు చాకెట్లు ఇచ్చినట్లు పసుపు–కుంకుమ, పింఛన్ల పెంపు అంటున్నారు. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అన్నారు. ఆడబిడ్డ పుడితే రూ.25 వేలు ఇస్తామని వాగ్ధానం చేశారు. చంద్రబాబు ఆడబిడ్డల తల్లిదండ్రులకు రూ.25 వేలు బాకీ పడ్డారు. మహిళలందరికీ స్మార్ట్‌ పోన్లు ఇస్తామన్నారు. ఈ ఎన్నికల్లో అడగండి. ఇంటికో ఉద్యోగం అన్నారు. రూ.2 వేల నిరుద్యోగ భృతి అన్నారు. ప్రతి ఇంటికి రూ.1.20 లక్షలు బాకీ పడ్డారు. ఈ బాకీ మొత్తం తీర్చమని అడగండి. ప్రతి పేదవాడికి మూడు సెంట్ల బూమి ఇస్తామన్నారు. ఇళ్లు కట్టిస్తామన్నారు. రైతులకు, చేనేతలకు, మహిళలకు రుణమాఫీ అన్నారు. ఎన్నికలు వచ్చాయి .. మీ ఓట్లు కొనుగోలు చేసేందుకు డబ్బు ఇస్తామంటారు. డబ్బుతో ముడిపెడతారు. అమ్ముడపోతారా? ఆ డబ్బు తీసుకోండి. ఆ డబ్బు తీసుకొని కూడా అడగండి.

ఇచ్చిన ప్రతి హామీని  వసూలు చేయండి. హక్కుగా అడిగి తీసుకోండి. జగనన్న ఈ తొమ్మిదేళ్లు విలువలతో కూడిన రాజకీయాలు చేశారు. ప్రజలకు వచ్చిన ప్రతి కష్టంలో అండగా ఉన్నారు. 3648 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. జగనన్నకు ఒక్క అవకాశం ఇవ్వండి.బాబు వస్తే కరువు వచ్చింది. అందుకే ప్రజా తీర్పు..బైబై బాబు కావాలన్నారు. బాబుకు ఇంటికి పంపండి..పప్పును పంపించండి. ఫ్యాన్‌ గుర్తుకే మీ ఓటు. మహిళలకు మొత్తం రుణమాఫీ చేయడానికి నాలుగు దఫాల్లో మీ చేతుల్లోనే పెడతారు. మహిళలకు రూ.75 వేలు ఉచితంగా జగనన్న ఇస్తారు. పిల్లలను స్కూళుకు పంపిస్తే రూ.15 వేలు ప్రతి ఏటా ఇస్తారు. మీ పిల్లల చదువులకు ఎన్ని లక్షలు ఖర్చైనా ఫర్వాలేదు. పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుంది. ప్రతి పేదవాడికి ఇళ్లు ఉంటుంది. ప్రతి ఎకరాకు నీరుంటుంది. రాజన్న రాజ్యం రావాలంటే జగనన్న రావాలి. మాట తప్పని వాడు..మడమ తిప్పని నేత వైయస్‌ జగన్‌ అన్నారు. వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ అభ్యర్థి సురేష్, ఎమ్మెల్యే అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్‌ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని షర్మిల విజ్ఞప్తి చేశారు. 

 

తాజా వీడియోలు

Back to Top