జల విద్యుత్‌ కేంద్రంలో అగ్నిప్రమాదంపై సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ దిగ్భ్రాంతి

సీఎం వైయ‌స్‌ జగన్‌ శ్రీశైలం పర్యటన రద్దు

తాడేప‌ల్లి : శ్రీశైలం జల విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రంలో అగ్నిప్రమాదంపై  ఏపీ ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఘటనపై అధికారుల‌ను అడిగి తెలుసుకున్నారు. అగ్ని ప్ర‌మాద ఘ‌ట‌న నేప‌థ్యంలో  ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి‌ శ్రీశైలం పర్యటనను రద్దుచేసుకున్నట్లుగా శనివారం సీఎంఓ అధికారులు వెల్లడించారు. వరుసగా రెండో ఏడాది శ్రీశైలంలోకి వరదనీరు భారీగా వస్తున్న నేపథ్యంలో రాయలసీమ సహా వివిధ ప్రాజెక్టులకు తాగు, సాగునీటి అవసరాలకు నీటి తరలింపు సహా, ప్రాజెక్టు వద్ద పరిస్థితులను సమీక్షించేందుకు, అక్కడ పూజలు నిర్వహించేందుకు ఇవాళ ముఖ్యమంత్రి శ్రీశైలం వెళ్లాల్సి ఉంది. అయితే శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర పరిధిలో ఉన్న ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్‌ కేంద్రంలో గత రాత్రి అగ్నిప్రమాదం సంభవించిన విషయాన్ని సీఎంఓ అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

తెలంగాణ విద్యుత్‌ కేంద్రంలో జరిగిన ప్రమాదం పట్ల సీఎం దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. చిక్కుకుపోయిన వారు సురక్షితంగా బయటపడాలని ఆకాంక్షించారు. ఏపీ ప్రభుత్వం నుంచి, యంత్రాంగం నుంచి ఎలాంటి సహాయం కోరినా వెంటనే వారికి అందించాలని సీఎం ఆదేశాలు జారీచేశారు. ఈ నేపత్యంలో శ్రీశైలం పర్యటనను రద్దుచేయాల్సిందిగా ఆదేశాలు ఇచ్చారు. దీంతో ఇవ్వాళ్టి సీఎం శ్రీశైలం పర్యటనను రద్దుచేస్తున్నట్టుగా సీఎం అధికారులు వెల్లడించారు

Back to Top