పులివెందుల: వైయస్ఆర్సీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి తన పులివెందుల పర్యటనలో భాగంగా పార్టీకి చెందిన దివంగత నేత సుధాకర్ రెడ్డి కుటుంబాన్ని ఇవాళ పరామర్శిస్తారు. రెండో రోజు పర్యటనలో భాగంగా ఆయన సుధాకర్ రెడ్డి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను కలుసుకుని వారి బాధను పంచుకుంటారు. ఇటీవల సుధాకర్ రెడ్డి మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన జగన్, కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇవ్వనున్నారు. పార్నపల్లి నిర్వాసితుల ఆవేదన ఇదే పర్యటనలో పార్నపల్లి రహదారిపై రాజారెడ్డి కాలనీకి చెందిన ప్రజలు వైయస్ జగన్ను కలిసి తమ సమస్యలను వివరించారు. జాతీయ రహదారి నిర్మాణం కారణంగా తమ ఇళ్లు కోల్పోతున్నామని, సరైన పరిహారం అందడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించడం లేదని, తమను ఆదుకోవాలని జగన్ను కోరారు. వారి వినతిపై స్పందించిన జగన్, “న్యాయం కోసం మనం పోరాటం చేద్దాం. ప్రభుత్వం స్పందించకపోతే ప్రజలతో కలిసి ఉద్యమం చేస్తాం” అని అన్నారు. అవసరమైతే వచ్చే ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చాక తప్పకుండా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. “మీకు అన్యాయం జరగదు” అని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కడప ఎంపీ వైయస్ అవినాష్రెడ్డి కూడా నిర్వాసితులకు ధైర్యం చెప్పారు. వైయస్ జగన్ నాయకత్వంలో మీ సమస్యలు తప్పకుండా పరిష్కారం అవుతాయని భరోసా ఇచ్చారు. ఈ పరిణామాలతో పార్నపల్లి నిర్వాసితుల్లో కొత్త ఆశలు నెలకొన్నాయి. వారి సమస్యల పరిష్కారానికి వైఎస్సార్సీపీ నాయకత్వం కట్టుబడి ఉందని స్థానికులు అభిప్రాయపడ్డారు.