అమరావతి: పారిశ్రామిక ప్రమాదాలకు బాధ్యులైన వారిపట్ల కఠినంగా వ్యవహరించాలని సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు. ఎవరైనా ప్రమాదంలో మరణిస్తే రూ.50లక్షల పరిహారం ఇచ్చేలా విధానంలో పొందుపర్చాల్సిందిగా అధికారులకు సూచించారు. రాష్ట్రంలో జరిగిన వరుస పారిశ్రామిక ప్రమాదాలపై ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి క్యాంపు కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. పరిశ్రమల్లో భద్రత, ప్రమాదాలు, కాలుష్య నివారణ అంశాలపై విస్తృతంగా చర్చించారు. రాష్ట్రవ్యాప్తంగా పరిశ్రమల్లో తనిఖీలు చేస్తున్నామని సమావేశంలో అధికారులు వెల్లడించారు. వచ్చే రెండు మూడు నెలల్లో ఈ తనిఖీలు పూర్తి చేస్తామని అధికారులు సీఎంకు తెలిపారు. పారిశ్రామిక ప్రమాదాల నివారణకుగాను అధికారులు ఇండస్ట్రీయల్ సేఫ్టీ పాలసీని ప్రతిపాదించారు.
ఈ-అట్లాస్లో వివరాలు ..
పరిశ్రమల భద్రత కోసం ప్రస్తుతమున్న రెగ్యులేటరీ వ్యవస్థలన్నీ సేఫ్టీ పాలసీ కిందకు వస్తాయని అధికారులు తెలిపారు. ఎలాంటి పరిశ్రమలు ఏయే ప్రాంతాల్లో ఉన్నాయన్నదాని గురించి ఇ అట్లాసులో వివరాలు పొందుపర్చాలని సూచించారు. పరిశ్రమలు ఏర్పాటు చేయాలనుకునేవారు కూడా.. కేటగిరీ ప్రకారం ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలన్నదాని పై ఇ అట్లాస్ ద్వారా వివరాలు వెల్లడించాలని అధికారులు తెలిపారు.
ఏడాదికి రెండుసార్లు నివేదికలు..
పరిశ్రమలు దాఖలు చేసే కాంప్లియన్స్ నివేదికలను ఏడాదికి రెండు సార్లు ఇచ్చేలా చూడాలని సీఎం జగన్ ఆదేశించారు. వీటిపై ఎలాంటి చర్యలు తీసుకున్నామన్న అంశాన్ని సంబంధిత కంపెనీలు బోర్డులపై పెట్టాలని తెలిపారు. వీటిపై థర్డ్పార్టీ తనిఖీలు కూడా ఉండాలని ఆదేశించారు. కేవలం పరిశ్రమల్లోనే కాకుండా ఇండస్ట్రియల్ పార్కుల్లో కూడా నిబంధనలు అమలవుతున్నాయా.. లేదా అన్నది చూడాలన్నారు. పర్యవేక్షణ యంత్రాంగం బలంగా ఉండాలని తెలిపారు. విశాఖ గ్యాస్ దుర్ఘటనలో ఇన్హెబిటర్స్ (నిరోధం) ఉంటే ఆ ప్రమాదం జరిగేది కాదన్నారు సీఎం జగన్. ఎవ్వరూ పర్యవేక్షణ చేయకపోవడం వల్లే ఈ సమస్య వచ్చిందన్నారు.
మనం కూడా ఇలాంటి విషయాల్లో కఠినంగా ఉండాలి..
అభివృద్ధి చెందిన పాశ్చాత్య దేశాల్లో కాంప్లియన్స్ నివేదిక ఇవ్వకపోతే భారీ జరిమానాలు వేస్తారని తెలిపారు సీఎం జగన్. మన దగ్గర అలాంటి పరిస్థితి లేదన్నారు. మనం కూడా ఇలాంటి విషయాల్లో కఠినంగా ఉండాలన్నారు. ఈ సమావేశంలో పర్యావరణ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ నీరబ్ ప్రసాద్, పరిశ్రమల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కరికాల వలవన్ సహా ఇతర అధికారులు హాజరయ్యారు.