సీఎం వైయస్‌ జగన్‌ ప్రయత్నం హర్షణీయం

సీఎంతో ఇజ్రాయెల్‌ ఐడీఈ టెక్నాలజీస్‌ ప్రతినిధుల బృందం భేటీ
 

తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌లో నీటి కొరతను తీర్చడానికి ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న ప్రయత్నం హర్షణీయమని ఐడీఈ టెక్నాలజీస్‌ ప్రతినిధులు పేర్కొన్నారు. బుధవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఇజ్రాయెల్‌ ఐడీఈ టెక్నాలజీస్‌ ప్రతినిధుల బృందం సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో భేటీ అయ్యింది. ఈ సందర్భంగా ఆ సంస్థ  ఐడీఈ టెక్నాలజీస్‌ డిప్యూటీ సీఈఓ లీహి టోరెన్‌స్టైన్  మాట్లాడుతూ..ఇండియా అనేక రకాలుగా నీటి కొరతను ఎదుర్కొంటోందని, నీటి భద్రత అనేది చాలా ముఖ్యమని పేర్కొన్నారు.  ఇజ్రాయెల్, భారత్‌ మధ్య మంచి సంబంధాలు ఉన్నాయని తెలిపారు. 1964 లో తొలిసారిగా కమర్షియల్‌ డీశాలినేషన్‌ ప్లాంటును ఇజ్రాయెల్‌లో పెట్టామని పేర్కొన్నారు. ఐడీఈ టెక్నాలజీస్‌ ప్రపంచవ్యాప్తంగా కార్యకలాపాలు సాగిస్తోందని గుర్తు చేశారు. నాలుగు దశాబ్దాలుగా 40 దేశాల్లో 400కు పైగా ఈ ప్లాంట్లను నిర్వహిస్తున్నామని ప్రతినిధుల బృందం తెలిపింది.

భారత్‌తోపాటు చైనా, అమెరికా, ఆస్ట్రేలియా దేశాల్లో తమ కంపెనీ కార్యకలాపాలు జరుగుతున్నాయని తెలిపారు. భారత్‌లో 25 ఏళ్లుగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. డీశాలినేషన్‌ ప్లాంట్ల వల్ల పారిశ్రామికాభివృద్ధి జరుగుతుందని.. ఉద్యోగాలు వచ్చి ఆదాయం కూడా పెరుగుతుందన్నారు. సముద్రపునీటిని డీశాలినేషన్‌ చేయడంతో పాటు కలుషిత నీటిని కూడా శుద్ధిచేయడంలో అత్యుత్తమ సాంకేతిక విధానాలను అవలంభిస్తున్నామని ఐడీఈ టెక్నాలజీస్‌ బృందం తెలిపింది. ఎస్సార్, రిలయన్స్‌ కంపెనీల్లో ఇండస్ట్రియల్‌ మురుగు నీటి శుద్ధికేంద్రాలను నిర్వహిస్తున్నామని చెప్పారు. శుద్ధిచేసిన మురుగు నీటిని పరిశ్రమలు వినియోగించుకుంటున్నాయిని వారు తెలిపారు. 
 

Back to Top