అమరావతి: టీ-20 వరల్డ్ కప్ గెలుచుకున్న భారత క్రికెట్ జట్టుకు మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్.జగన్ మోహన్ రెడ్డి అభినందనలు తెలిపారు. టోర్నీ ఆద్యంతం సమిష్టి కృష్టితో భారత జట్టు విజయాలు సాధించిందన్నారు. కృషి, పట్టుదలతో మరో గొప్పగెలుపు సొంతంచేసుకున్నారని ప్రశంసించారు. వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఇండియా టీం ఓటమితో తీవ్ర నిరాశకు గురైన అభిమానులకు ఈ విజయం గొప్ప ఊరటినిస్తుందన్నారు. భారతజట్టు కెప్టెన్గా ఉన్న రోహిత్ శర్మ తెలుగువాడు కావడం గర్వకారణమన్నారు. జట్టును విజయవంతంగా నడిపించడంలో రోహిత్ చక్కటి నాయకత్వాన్ని ప్రదర్శించాడని కొనియాడారు. రానున్న రోజుల్లో టీం ఇండియా మరిన్ని ఛాంపియన్షిప్లు సాధిస్తుందని ఆకాంక్షించారు. టీ20 వరల్డ్కప్-2024 ఛాంపియన్స్గా భారత్.. టీ20 వరల్డ్కప్-2024 ఛాంపియన్స్గా టీమిండియా నిలిచింది. బార్బోడస్ వేదికగా జరగనున్న ఫైనల్లో 7 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించిన భారత్.. రెండో సారి టీ20 వరల్డ్కప్ టైటిల్ను ముద్దాడింది. 177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 169 పరుగులు మాత్రమే చేయగల్గింది. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్, హార్దిక్ పాండ్యా అద్బుతమైన ప్రదర్శన కనబరిచారు.