భీమవరం: టీడీపీ కూటమి ప్రభుత్వం ఆక్వా రైతులను నిలువునా ముంచేస్తోందని, ఇంకా ఏకంగా ఆక్వా రంగాన్ని కుప్పకూలుస్తోందని పశ్చిమ గోదావరి జిల్లా వైయస్ఆర్సీపీ అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు ధ్వజమెత్తారు. ఇప్పటికే అనేక సమస్యలతో కొట్టుమిట్లాడుతున్న ఆక్వా రంగం, ఇప్పుడు ఫీడ్ ధరల పెంపుతో మరింత సంక్షోభంలో పడుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఆక్వా ఫీడ్ ధరల పెంపు దారుణమన్న ఆయన.. ప్రభుత్వ పెద్దలు, ఫీడ్ కంపెనీలు కుమ్మక్కై ఆక్వా రైతులను దోపిడీ చేస్తున్నారని ఆక్షేపించారు. రోపించారు. ప్రభుత్వం వెంటనే ఆక్వా ఫీడ్ ధరలు తగ్గించేలా చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో ఆక్వా రైతులతో కలిసి ఉద్యమిస్తామని భీమవరంలోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ముదునూరి ప్రసాదరాజు హెచ్చరించారు. ప్రెస్మీట్లో ముదునూరి ప్రసాదరాజు ఇంకా ఏం మాట్లాడారంటే..: ఆక్వా రంగానికి శాపంలా మారిన కూటమి ప్రభుత్వం: రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, ప్రభుత్వ వైఖరి వల్ల ఆక్వా రంగం అనేక సమస్యలు ఎదుర్కొంటోంది. ఆ విధంగా ప్రభుత్వం ఆక్వా రంగానికి శాపంలా మారుతోంది. ఇప్పుడు ఏకపక్షంగా పెరిగిన ఫీడ్ ధరలు, ఆక్వా రంగాన్ని మొత్తం సంక్షోభంలోకి నెట్టేస్తోంది. ప్రతి నెలా ఫీడ్ కంపెనీల నుంచి ప్రభుత్వ పెద్దలకు ముడుపులు అందుతున్నాయి. అందుకే ప్రభుత్వం ఆక్వా ఫీడ్ ధరల పెంపును అడ్డుకోలేదు. టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆక్వా ఫీడ్ కంపెనీలు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నాయి. అంతా ఏకమయ్యారు. విద్యుత్ సబ్సిడీ ఒట్టిదే: ఆక్వా ఫీడ్ కంపెనీలు, అధికార పార్టీ నేతలు కుమ్మక్కై ఆక్వా రైతులను దోచుకుంటున్నారు. ఆక్వా ఫీడ్లో వాడే పదార్థాలపై సుంకాలు తగ్గినందువల్ల, టన్నుకు రూ.25 వేలు తగ్గాల్సి ఉంది. కానీ కేవలం రూ.4 వేలు మాత్రమే ధర తగ్గింది. అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. మరోవైపు ఆక్వా సాగులో వాడే విద్యుత్లో యూనిట్కు రూ.1.50 మాత్రమే వసూలు చేస్తామని ఎన్నికల ముందు చెప్పిన టీడీపీ కూటమి, అధికారంలోకి రెండేళ్లవుతున్నా, పైసా సబ్సిడీ ఇవ్వలేదు. అదే గత వైయస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఆక్వా సాగులో 50,800 కనెక్షన్లకు విద్యుత్ సబ్సిడీ కింద రూ.3,640 కోట్లు ఖర్చు చేయడం జరిగింది. ప్రభుత్వం ఇప్పటికైనా వెంటనే విద్యుత్ సబ్సిడీ చెల్లించడంతో పాటు, పెంచిన ఆక్వా ఫీడ్ ధరలు తగ్గేలా చూడాలని, లేని పక్షంలో ఆక్వా రైతులతో కలిసి ఉద్యమిస్తామని ముదునూరి ప్రసాదరాజు హెచ్చరించారు.