చిత్తూరు: సీఎం వైయస్ జగన్ తీసుకున్న చర్యల వల్లే తుపాన్ ముప్పు నుంచి తప్పించుకున్నామని ఎమ్మెల్యే ఆర్కే రోజా పేర్కొన్నారు. నివర్ తుపాను ప్రభావంతో చిత్తూరు, కడప, కర్నూలు, ప్రకాశం జిల్లాలలో భారీ వర్షాలు కురవడంతో జనజీవనం అస్తవ్యస్తమైందని, ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే రోజా ముఖ్యమంత్రి వైయస్ జగన్ కార్యాచరణపై ప్రశంసలు కురిపించారు. శనివారం ఆమె తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ..రానున్న రోజుల్లో మరో రెండు తుపానులు ఉన్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. రానున్న తుపాన్లపై సీఎం సమీక్ష జరుపుతున్నారని చెప్పారు. వరద బాధిత ప్రాంతాలను సీఎం ఏరియల్ సర్వే ద్వారా సమీక్షించారని తెలిపారు. వర్షాల వల్ల పంటను నష్టపోయిన రైతులకు డిసెంబర్ 31లోగా నష్టపరిహారం ఇస్తారని, రైతుల అకౌంట్లలో నేరుగా డబ్బు జమ అవుతుందని చెప్పారు. వరద నష్ట పరిహారం కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచామని తెలిపారు.