నీరు-చెట్టు అక్రమాలపై విజిలెన్స్‌ విచారణ 

 మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి
 

అమరావతి: నీరు-చెట్టు అక్రమాలపై విజిలెన్స్‌ విచారణ జరిపిస్తామని, ఈ పథకంలో అవినీతికి పాల్పడిన వారి నుంచి సొమ్ము తిరిగి రాబడతామని మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి వెల్లడించారు. గత చంద్రబాబు ప్రభుత్వం అమలు చేసిన ‘నీరు-చెట్టు’ పథకంలో భారీ దోపిడీ జరిగిందని వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు మేరుగ నాగార్జున, కాట‌సాని రాంభూపాల్‌రెడ్డిలు పేర్కొన్నారు.  గురువారం అసెంబ్లీ సమావేశాల్లో  ఎమ్మెల్యేలు మాట్లాడుతూ.. నీరు-చెట్టు నిధులను టీడీపీ నేతలు పందికొక్కుల్లా దోచుకున్నారని మండిపడ్డారు.  నీరు-చెట్టులో జరిగిన అవినీతిపై పూర్తి విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ వ్యవహారంపై విచారణ పూర్తయ్యేవరకు బిల్లులు మంజూరు చేయొద్దని సూచించారు. 

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందిస్తూ.. నీరు-చెట్టు నిధులు పక్కదారి పట్టిన విషయం వాస్తవమేనన్నారు. ఈ పథకం కింద రూ. 22వేల కోట్ల నిధులు దుర్వినియోగం చేశారని పేర్కొన్నారు. జన్మభూమి కమిటీల పేరుతో టీడీపీ కార్యకర్తలకు ఈ నిధులను దోచి పెట్టారని ఆయన ఆరోపించారు. నీరు-చెట్టు పథకంలో జరిగిన అవినీతిపై విచారణ జరిపిస్తామని మంత్రి పెద్దిరెడ్డి  స్పష్టం చేశారు. 
 

Back to Top