ఆంధ్రప్రదేశ్‌ వచ్చి మాట్లాడండి బాబూ?

 విజయవాడ: కరోనా నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ విపత్కర పరిస్థితుల్లో ఉంటే టీడీపీ రాజకీయాలు చేయటం సిగ్గు చేటని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ ధ్వజమెత్తారు. హైదరాబాద్‌లో కూర్చొని చంద్రబాబు, లోకేష్‌ నీతులు చెబుతున్నారని.. ఆంధ్రప్రదేశ్‌కు వచ్చి ప్రజల్లో తిరిగితే ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు తెలుస్తాయని హితబోధ చేశారు.

ఆదివారం కంటోన్‌మెంట్‌ జోన్‌లలో పర్యటించిన మంత్రి వెల్లంపల్లి ఆనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు.  ప్రజాశ్రేయస్సు కోసం ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నో సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటున్నారని ప్రశంసించారు. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదల కష్టాలు తీర్చేందుకు పక్కా ప్రణాళికలు అమలు చేస్తున్నారని మంత్రి తెలిపారు.  

కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందన్నారు. లాక్‌డౌన్‌లో పేదలు ఇబ్బంది పడకూడదనే ఉచిత బియ్యం, ఆర్థిక సాయం అందించినట్లు తెలిపారు. రెండు రోజుల్లో 20వేల కుటుంబాలకు రూ.15 లక్షల విలువచేసే కూరగాయలు పంపిణీ చేశామన్నారు. దాతల సహకారంతో విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ప్రతీ ఇంటికీ ఉచితంగా కూరగాయలు అందిసున్నామని వివరించారు. కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు, లాక్‌డౌన్‌లో ప్రజలు ఇబ్బందులు పడకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయన్నారు. రాష్ట్రవ్యాప్తంగా యాంటీ కరోనా సోడియం హైపో క్లోరైడ్‌ స్ప్రే చేయిస్తున్నట్లు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ తెలిపారు.  

Back to Top