ఎన్టీఆర్ జిల్లాలో క్లీన్‌స్వీప్ సాధించి జ‌గ‌న‌న్న‌కు కానుక‌గా ఇస్తా

వైయ‌స్ఆర్‌సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్య‌క్షుడు వెల్లంప‌ల్లి శ్రీ‌నివాస్‌

విజ‌య‌వాడ‌:  వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎన్టీఆర్ జిల్లాలోని ఏడు నియోజ‌క‌వ‌ర్గాల్లో వైయ‌స్ఆర్‌సీపీ అభ్య‌ర్థుల‌ను గెలిపించి సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి కానుక‌గా అందిస్తామ‌ని వైయ‌స్ఆర్‌సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్య‌క్షుడు వెల్లంప‌ల్లి శ్రీ‌నివాస్ ధీమా వ్య‌క్తం చేశారు. 
 సీఎం వైయ‌స్ జ‌గ‌న్ త‌న తొలి కేబినెట్‌లో  దేవాదాయశాఖ మంత్రిగా అవకాశం కల్పించార‌ని, మూడేళ్లు ప్రభుత్వానికి చెడ్డపేరు రాకుండా చేశాన‌ని, ఇప్పుడు పార్టీ బాధ్యతలు అప్పగించార‌న్నారు. ఎన్టీఆర్‌ జిల్లా వైయ‌స్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడిగా నియమించినందుకు సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు వెల్లంప‌ల్లి కృతజ్ఞతలు. రాబోయే రోజుల్లో పార్టీ కోసం నా వంతుగా శక్తివంచన లేకుండా కృషిచేస్తాన‌ని పేర్కొన్నారు.  

బీజేపీ నేత‌లు వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక‌
విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో బీజేపీ నుంచి పలువురు నేతలు బుధవారం వైయ‌స్ఆర్‌సీపీలో చేరారు. బీజేపీ యువమోర్చా పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు బోండా నిరీష్ కుమార్‌తో పాటు, పలు మండలాల కార్యకర్తలకు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా మాజీ మంత్రి వెల్లంపల్లి మీడియాతో మాట్లాడుతూ.. 'పశ్చిమ నియోజకవర్గంలో వేట మొదలైంది. రాబోయే రోజుల్లో ఇతర పార్టీల నుంచి మరిన్ని చేరికలుంటాయి. పశ్చిమ నియోజకవర్గంలో ఇతర పార్టీల అడ్రస్ గల్లంతవ్వడం ఖాయం. 2024కి నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో ఉండేది వైయ‌స్ఆర్‌సీపీ మాత్రమే. చంద్రబాబు అమరావతిలో కూర్చుని విజయవాడ అభివృద్ధిని గాలికొదిలేశాడు. వైయ‌స్ జగన్‌మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాతే విజయవాడ అభివృద్ధి చెందింద‌ని తెలిపారు.
 
టీడీపీ హయాంలో ఇక్కడి నేతలు రోడ్లు కూడా వేయించుకోలేకపోయారు. టీడీపీ నేతల ఇళ్లముందు కూడా మేమే రోడ్లు వేయించాం. ఎంపీ కేశినేని నాని ఎందుకున్నాడో అర్థం కావడం లేదు. పశ్చిమ నియోజకవర్గానికి టీడీపీ ఇంఛార్జినని చెప్పుకుంటాడు. కేశినేనికి ఎన్నికలప్పుడే ప్రజలు గుర్తుకొస్తారు. చంద్రబాబు వైశ్యులకు చేసిందేమీ లేదు. ఎన్నికల ఓటు బ్యాంకుగా వాడుకున్నాడే కానీ ఏనాడైనా వైశ్యులకు మేలు చేశారా. రోశయ్య బ్రతికున్నంత వరకూ వేధింపులకు గురిచేశారు. ఇప్పుడు వైశ్యుల గురించి ముసలి కన్నీరు కారుస్తున్నాడు' అంటూ మాజీ మంత్రి వెల్లంపల్లి టీడీపీ అధినేత చంద్రబాబుపై మండిపడ్డారు. 

Back to Top