మహిళల అక్రమ రవాణా నిరోధించటానికి ప్రతిజిల్లా లో ప్రత్యేక యూనిట్‌

   ఇంటర్నేషనల్ వెబినార్ ను ప్రారంభిస్తూ ఏపీ మహిళా కమిషన్ ఛైర్-పర్సన్ వాసిరెడ్డి పద్మ 

విజ‌య‌వాడ‌: మహిళల అక్రమ రవాణా నిరోధించటానికి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని ప్రతిజిల్లా లో ప్రత్యేక యూనిట్ల ను ఏర్పాటు చేసి పోలీస్ అధికారులను ప్ర‌భుత్వం నియమించిందని ఏపీ మహిళా కమిషన్ ఛైర్-పర్సన్ వాసిరెడ్డి పద్మ పేర్కొన్నారు.  మహిళల అక్రమ రవాణా, లైంగిక అణచివేత లో అక్రమార్కులు కొత్త ఆధునిక పద్దతులను ఉపయోగిస్తున్నారని వీటిపై దర్యాప్తు సంస్థలు సమగ్ర దృష్టి సారించాలని సూచించారు. మంగ‌ళ‌వారం విజ‌య‌వాడ‌లోని మేరీ స్టెల్లా కాలేజీ  ఆధ్వర్యంలో జరిగిన  ఇంటర్నేషనల్ వెబినార్‌ను మహిళా కమిషన్ ఛైర్-పర్సన్ వాసిరెడ్డి ప‌ద్మ ప్రారంభించారు. ``మహిళల అక్రమ రవాణా- లైంగిక అణచివేత ఆన్లైన్ భద్రత``  అనే అంశాలపై ఆగస్టు 17 నుంచి 19 వరకు 3 రోజులు పాటు జరిగే వెబినార్ ను ఆమె ఈ రోజు ప్రారంభించారు. 

 అమెరికా, ఆఫ్రికా, ఫిలిప్పీన్స్, నేపాల్, పాకిస్థాన్, వియాత్నం, ఇటలీ, 13 రాష్ట్రాల భారతదేశ ప్రతినిధులు ప్రసంగించిన ఈ అంతర్జాతీయ వెబినార్ లో  వాసిరెడ్డి పద్మ ప్రారంభోపన్యాసం చేస్తూ.. కోవిడ్ తర్వాత ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ముఖ్య మంత్రి శ్రీ. వై.య‌స్. జగన్ మోహ‌న్ రెడ్డి గారి నాయకత్వం లో మహిళల అక్రమ రవాణా నిరోధించటానికి ప్రతిజిల్లా లో ప్రత్యేక యూనిట్ల ను ఏర్పాటు చేసి పోలీస్ అధికారులను నియమించిందని పేర్కొన్నారు.

 రాష్ట్ర మహిళా కమిషన్ కూడా ఇంటర్నేషనల్ జస్టిస్ మిషన్ వంటి సంస్థల తో కలిపి యూనివర్సిటీ లలో, కాలేజిల్లో యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ క్లబ్ లను ఏర్పాటు చేసిందని అవగాహనా సదస్సు లు నిర్వహిస్తుందని పేర్కొన్నారు.

 ఆన్లైన్ ద్వారా అమాయక యువతు లపై వల విసురుతున్న కేటుగాళ్ళ గురించి స్కూల్ స్థాయి వరకు బాలికలకు, విద్యార్థినులకు అవగాహన కల్పించుటకు మహిళా కమిషన్ చర్యలు తీసుకుంటుందని పద్మ పేర్కొన్నారు.

 ఆన్లైన్ ద్వారా, ఇతర కొత్త పద్ధతులను ఉపయోగించి అక్రమ రవాణా ముఠాలు మహిళలను దొంగ దెబ్బ తీస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఇంటర్నేషనల్ వెబినార్ లో అనేకమంది ప్రముఖులు తమ అభిప్రాయాలు, సూచనలు తెలియజేశారు. 

Back to Top