విశాఖపట్నం : ముఖ్యమంత్రి చంద్రబాబు చేతిలో పీసీసీ అధ్యక్షురాలు షర్మిల కీలుబొమ్మగా మారారని వైయస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు, టీడీపీ నేతలు వైయస్ జగన్ కు వ్యతిరేకంగా చేస్తున్న ప్రచారాన్నే షర్మిల కూడా చేస్తోందని మండిపడ్డారు. దివంగత నేత వైయస్ఆర్ కుమార్తెగా, వైయస్ జగన్ సోదరిగా షర్మిల అంటేవైయస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకు, రాష్ట్ర ప్రజలకు గౌరవం ఉండేదని, ఇప్పుడు షర్మిల వ్యవహరిస్తున్న తీరు అత్యంత దురదృష్టకరమని అభిప్రాయపడ్డారు. విశాఖలోని తన క్యాంప్ కార్యాలయంలోని ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ... తండ్రి వైయస్ఆర్ ఆగర్భ శత్రువైన చంద్రబాబుతో కలిపి వైయస్ జగన్ ను బలహీన పరచడానికి కుట్ర పన్నడమే కాకుండా, తండ్రికి చెడ్డపేరు తెచ్చేలా కుటుంబ పరువును బజారు కీడ్చుతుంటే ఆ మహానేత ఆత్మ క్షోభిస్తోందన్నారు. వైయస్ జగన్ తాను స్థాపించిన కంపెనీల్లో షర్మిలకు వాటా ఉంటే కంపెనీల్లో ఆమె పేర్లు పెట్టాలని ఎందుకు ఆరోజు మాట్లాడలేదని ప్రశ్నించారు. షర్మిలలో అడుగడుగునా స్వార్థం కనిపిస్తోందని ధ్వజమెత్తారు. చంద్రబాబు డైరక్షన్ లో కుట్రలకు పాల్పడుతూ ఆయన అడుగుజాడల్లో నడుస్తోందని, ఇందుకు షర్మిల రాసిన లేఖ టీడీపీ కార్యాయం నుంచి విడుదల కావడమే నిదర్శనమని తేల్చి చెప్పారు. వైయస్ జగన్ పై బనాయించిన అక్రమాస్తుల కేసుల్లో వైయస్ఆర్ పేరు చేర్చిన కాంగ్రెస్ పార్టీని, వెనుకుండి కధ నడిపించిన చంద్రబాబును ఏరోజూ ఎందుకు ప్రశ్నించలేదని వరుదు కల్యాణి దుయ్యబట్టారు. జగన్మోహన్ రెడ్డి దివంగత నేత వైఎస్ఆర్ పేరును ఎఫ్ ఐ ఆర్ లో తొలగించేలా ప్రయత్నాలు చేసారని గుర్తు చేసిన ఆమె.. జగన్ను దెబ్బతీసేందుకు అభాడాలు వేస్తున్నారని మండిపడ్డారు. తల్లిని కోర్టుకు ఈడ్చినది షర్మిలనే గానీ వైయస్ జగన్ కాదని స్పష్టం చేసారు. వైఎస్ రక్తం పంచుకు పుట్టిన షర్మిల జగన్ కోసం నీచంగా మాట్లాడుతున్నారంటే ఎంత కుట్ర, స్వార్థం దాగి ఉన్నాయో అర్థం చేసుకోచవ్చనని వెల్లడించారు. జగన్ పై షర్మిల చేస్తున్న తప్పుడు ఆరోపణలను రాష్ట్రంలోని ఏ మహిళా నమ్మడం లేదని స్పష్టం చేసిన వరుదు కల్యాణి, రాష్ట్రంలోని మహిళలను సామాజికంగా, ఆర్థికంగా ఉన్నతంగా ఉంచిన జగన్ గురించి అందరికీ తెలుసునని వ్యాఖ్యానించారు. వైయస్ఆర్సీపీని నేనే నిలబెట్టా అని షర్మిల పదే పదే ప్రకటించడాన్ని తప్పుబట్టిన ఆమె, 2014కు ముందు షర్మిల పని చేసినపుడు పార్టీ ఎందుకు అధికారంలోకి రాలేదని ప్రశ్నించారు. 2014 – 19లో షర్మిల ప్రచారం చేయకపోయినా సరే వైయస్ జగన్ మీద నమ్మకంతో 2019లో భారీ మెజార్టీతో ప్రజలు గెలిపించారని గుర్తు చేసారు. మహానేత కుమార్తెగా వైయస్ఆర్సీపీ కుటుంబం షర్మిలను గౌరవిస్తే, ఇప్పుడు చంద్రబాబు కనుసన్నల్లో ఆయన ఆదేశానుసారం నడవడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేసారు. రాష్ట్రంలో వైయస్ వారసత్వాన్ని నిలబెడుతున్నది వైయస్ జగన్ మాత్రమేనని ఉద్ఘాటించిన వరుదు కల్యాణి, చెడగొడుతున్నది షర్మిలేనని మండిపడ్డారు. తండ్రి వైయస్ఆర్, సొదరుడు వైయస్ జగన్ రాజకీయ శత్రువు చంద్రబాబుతో చేతులు కలపడం సబబా అని షర్మిలను నిలదీశారు. ఇప్పటికైనా చంద్రబాబు కబంధ హస్తాల నుంచి షర్మిల బయటకు రావాలని, . తప్పుడు ఆరోపణలు మానుకోవాలని హితవు పలికారు.