ప్రాణం ఉన్నంతవరకూ వైయ‌స్ జగనన్న వెంటే.. 

వైయ‌స్ఆర్ సీపీ  విశాఖ నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్‌ 

 
విశాఖపట్నం:   వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అంటే తనకు అమితమైన ప్రేమ.. ప్రాణమున్నంతవరకు ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వెంటే నడుస్తానని పార్టీ విశాఖ నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్‌ పేర్కొన్నారు. పార్టీ ఎప్పుడూ తనకు అన్యాయం చేయలేదని, ఎప్పటిలాగే పార్టీ కోసం, వైయ‌స్‌ జగనన్న కోసం సైనికుడిలా పనిచేస్తానన్నారు. జీవీఎంసీ మేయర్‌ పదవి దక్కలేదన్న కోపంతో పార్టీ నగర అధ్యక్షుడి పదవికి రాజీనామా చేస్తున్నట్టు కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని, వాటిని ప్రజలు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు నమ్మవద్దని కోరారు.

ఫేక్‌ అకౌంట్‌తో వివాదాస్పద పోస్టింగ్‌లు 
కొంతమంది నా పేరుతో సోషల్‌ మీడియాలో ఫేక్‌ అకౌంట్లు క్రియేట్‌ చేసి వైయ‌స్సార్‌ సీపీపై వివాదాస్పద వ్యాఖ్యలు, పోస్టింగ్‌లు పెడుతున్నారని, అలా చేసిన వారిపై పోలీస్‌లకు ఫిర్యాదు చేస్తానని వంశీకృష్ణ శ్రీనివాస్‌ హెచ్చరించారు. పార్టీకి, నా వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించే చర్యలను ఉపేక్షించబోనని స్పష్టం చేశారు. తల్లి వంటి పార్టీని, పెద్దల ప్రతిష్టకు భంగం కల్గించే చర్యలను పూర్తిగా ఖండిస్తున్నానని వంశీకృష్ణ పేర్కొన్నారు.
 

Back to Top