కాసినోల కార్యకలాపాలపై కేంద్ర‌మంత్రుల పరిశీలన

రాజ్యసభలో వైయ‌స్ఆర్ సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నకు కేంద్ర‌మంత్రి జవాబు

న్యూఢిల్లీ: కాసినోలు, రేస్‌ కోర్సులు, ఆన్‌లైన్‌ గేమింగ్‌ కార్యకలాపాల విలువను అంచనా వేసి వాటిపై ఎంత రేటు చొప్పున జీఎస్టీ  విధించవచ్చో పరిశీలన చేయడానికి జీఎస్టీ కౌన్సిల్‌ మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేసినట్లు ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి వెల్లడించారు. రాజ్యసభలో మంగళవారం వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర‌మంత్రి రాతపూర్వకంగా జవాబిచ్చారు. ఆన్‌లైన్‌ గేమింగ్‌ నియంత్రణ కోసం నియమ నిబంధనలు రూపొందించే అంశాన్ని పరిశీలించేందుకు ప్రభుత్వం వివిధ మంత్రిత్వ శాఖలతో టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆన్‌లైన్‌ గేమింగ్‌పై ప్రస్తుతం 28 శాతం జీఎస్టీ విధిస్తున్నట్లు చెప్పారు. ఆన్‌లైన్‌ గేమింగ్‌లో ఆడేది స్కిల్‌ గేమా లేక చాన్స్‌ గేమా అనే దానితో నిమిత్తం లేకుండా బెట్టింగ్‌, గాంబ్లింగ్‌ వంటి ఆన్‌లైన్‌ గేమ్స్‌పై జీఎస్టీ విధిస్తోంది. ఆన్‌లైన్‌ గేమింగ్‌పై జీఎస్టీని సవాలు చేస్తూ కొన్ని కేసులు కూడా దాఖలయ్యాయని కేంద్ర‌మంత్రి తెలిపారు.

Back to Top