తిరుమలలో టీటీడీ చైర్మన్ ఆకస్మిక తనిఖీలు

టీటీడీ సేవ‌ల గురించి భ‌క్తుల‌ను అడిగి తెలుసుకున్న చైర్మ‌న్‌ వైవీ సుబ్బారెడ్డి

తిరుప‌తి: తిరుమల శ్రీవారి దర్శనం కోసం రద్దీ భారీగా పెరిగిన నేపథ్యంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి శుక్రవారం ఉదయం పలు ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రాంభగీచా బస్టాండ్ సమీపంలోని అన్నప్రసాద వితరణ కౌంటర్‌ను ప‌రిశీలించారు. భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేసే విధానాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రాంతంలో భక్తులకు తాగునీటి ఇబ్బంది లేకుండా, పారిశుద్ధ్య  సమస్యలు త‌లెత్త‌కుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం పీఏసీ-1 కు చేరుకొని అక్కడ ఉన్న భక్తులతో మాట్లాడారు. గదులు సులువుగా దొరుకుతున్నాయా,  దర్శనం ఎలా అయ్యింది, ఎంత సమయం పట్టింది అని భ‌క్తుల‌ను అడిగి తెలుసుకున్నారు. టీటీడీ సేవ‌ల‌పై భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు. టీటీడీ చైర్మ‌న్ వెంట ఆరోగ్యాధికారి డాక్టర్ శ్రీదేవి, వీజీఓ బాలిరెడ్డి పాల్గొన్నారు.

Back to Top