దేవుడిని కూడా రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటారా? 

సప్తగిరి మాసపత్రికపై రాజకీయ కుట్రకోణం

బాధ్యులను ఉపేక్షించేది లేదు

టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి

విజయవాడ: దేవుడిని కూడా రాజకీయ లబ్ధి కోసం వాడుకోవాలని ఎవరు చూస్తున్నారో.. వారి ఇంగిత జ్ఞానానికి వదిలి వేస్తున్నామ‌ని టీటీడీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు.  సప్తగిరి మాసపత్రికపై రాజకీయ కుట్రకోణం దాగుందని ఆయ‌న అనుమానం వ్య‌క్తం చేశారు.  గతంలోనూ సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారం చేశారని మండిపడ్డారు. ‘గతంలో ఆర్టీసీ బస్సుల్లో అన్యమత ప్రచారం, తిరుమల కొండల్లో సిలువ పెట్టారని సోషల్ మీడియాలో టీడీపీ తప్పుడు ప్రచారం చేసింద‌ని పేర్కొన్నారు.  మధ్యలో ఎవరైనా కవర్లు మార్చారా? అనేది విచారణలో తేలాల్సి ఉంద‌న్నారు.  టీటీడీ కార్యాలయంలో అన్యమత పుస్తకాలు ఎందుకు ఉంటాయి? దేవుడిపైనే నింద వేయాలని చూస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు.  

పోలీసు స్టేష‌న్‌లో ఫిర్యాదు 
ఈ ఘటనలో ఎవరైనా సరే ఉపేక్షించేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. దీనిపై తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని వెల్లడించారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభణ సమయంలో ప్రజలను కాపాడమని సుందరకాండ, వేద పారాయణం టీటీడీ తరపున చేశామని, భక్తులకు దర్శనం కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ప్రస్తుత కష్ట కాలంలో రాజకీయ దురుద్దేశ్యం తో చేస్తున్న ఆరోపణలు సరికావని వైవీ సుబ్బారెడ్డి ఖండించారు.

Back to Top