`పోలవరం`లో నేడే తొలి ఫలితానికి అంకురార్పణ  

ప‌శ్చిమ గోదావ‌రి: ఆంధ్ర‌ప్ర‌దేశ్ జీవ‌నాడి అయిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప‌నులు ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి సార‌థ్యంలో శ‌ర‌వేగంగా ప‌రుగులు పెడుతున్నాయి. ప్రాజెక్ట్‌ నిర్మాణంలో నేడు తొలి ఫ‌లితానికి అంకురార్ప‌ణ జ‌రుగ‌నుంది. ప్రాజెక్ట్‌లో భాగంగా డెల్టాకు స్పిల్ వే మీదుగా  కాసేపట్లో గోదావరి నీటి విడుదల చేయ‌నున్నారు. ప్రాజెక్ట్ నిర్మాణంలో భాగంగా ఈసీఆర్ఎఫ్ నిర్మాణం కోసం అప్పర్ కాఫర్ డ్యాం పూర్తి చేసి స్పిల్ వే మీదుగా నీటిని విడుదల చేయ‌నున్నారు. పోలవరం ప్రాజెక్ట్ తొలి ఫలితానికి రాష్ట్ర ప్రభుత్వం, మేఘా ఇంజనీరింగ్ సంస్థ శ్రీ‌కారం చుట్ట‌నుంది. 11.30 గంట‌ల‌కు అప్రోచ్ చానెల్ ద్వారా డెల్టాకు నీటి విడుదల చేయ‌నున్నారు. వర్చువల్ ద్వారా  డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, ఇరిగేష‌న్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాద‌వ్‌ ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొననున్నారు.

గోదావరిలో నీటిని అప్రోచ్ కెనాల్‌కు విడుదల కానుంది. ఆ నీరు స్పిల్ వే, రివర్ స్లూయిజ్ గేట్ల ద్వారా ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్‌కు చేరి, అక్కడి నుంచి సెంట్రల్ డెల్టాతో పాటు తూర్పు, పశ్చిమ కాలువల ద్వారా గోదావరి డెల్టాకు చేరనున్నాయి. వర్షా కాల సీజన్‌లోనే వరదను మళ్లించడానికి అనుగుణంగా అప్రోచ్ ఛానెల్, స్పిల్ వే గేట్ల ఏర్పాటు, స్పిల్ ఛానెల్, పైలెట్ ఛానెల్ దాదాపు పూర్తయ్యాయి. దీంతో గోదావరి నదిలో ప్రవాహానికి అడ్డుకట్ట వేసేవిధంగా అప్పర్ కాఫర్ డ్యాం నిర్మాణం పూర్తి చేశారు. అతి తక్కువ సమయంలో భారీ పనులు, నిర్మాణాలు పూర్తి చేసి, డెల్టాకు నీరందించే ప్రక్రియను మేఘా ఇంజనీరింగ్ సంస్థ పూర్తి  చేసింది.

Back to Top