మాచ‌ర్ల‌లో టీడీపీ రౌడీయిజం  

వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తపై టీడీపీ గూండాలు దాడి

పథకం ప్రకారం బండరాళ్లతో, కర్రలతో  వైయ‌స్ఆర్ సీపీ శ్రేణుల‌పై జూలకంటి బ్రహ్మారెడ్డి ముఠా దాడి

ముగ్గురికి తీవ్రగాయాలు, ఆసుపత్రిలో చేర్చిన స్థానికులు, బంధుమిత్రులు 

మాచర్ల: ప‌ల్నాడు జిల్లా మాచ‌ర్ల‌లో టీడీపీ రౌడీలు రెచ్చిపోయారు. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్య‌కర్త‌ల‌పై బండరాళ్లు, క‌ర్ర‌ల‌తో దాడికి తెగ‌బ‌డ్డారు. మారణాయుధాలతో వీధుల్లో స్వైర­విహారం చేశారు. విలేకరుల సమావేశం పేరిట పక్కా పథకం ప్రకారం రాడ్లు, కర్రలు ముందే తెచ్చుకుని.. తమను అడ్డుకున్నారంటూ ఏ సంబంధం లేని ముగ్గురు వైయ‌స్ఆర్ సీపీ కార్యకర్తలను హతమార్చబోయారు. అంతటితో ఆగకుండా ‘‘మా నాయకుడు జూలకంటి బ్రహ్మారెడ్డి. మేం ఎవరినైనా చంపేస్తాం’’ అని కేకలు వేస్తూ పట్టణ నడిబొడ్డున వీరంగం సృష్టించారు. అంతు చూస్తామంటూ సవాళ్లు విసిరారు. 

ఎలా జరిగిందంటే.. 
తెలుగుదేశం పార్టీ కొద్ది రోజులుగా చంద్రబాబు నాయుడి పిలుపు మేరకు ‘ఇదేమి ఖర్మ  రాష్ట్రానికి’ అనే కార్యక్రమం నిర్వహిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఈ కార్యక్రమం నిర్వహించడానికి ప్రయత్నించినా ప్రజల నుంచి పెద్దగా స్పందన లేకపోవటంతో ఫెలయ్యింది. ఇక ఫ్యాక్షన్‌ రాజకీయాల్లో ఆరితేరిన టీడీపీ మాచర్ల నియోజకవర్గ ఇన్‌చార్జి జూలకంటి బ్రహ్మారెడ్డి శుక్ర‌వారం ఇదేం ఖర్మ కార్యక్రమంలో భాగంగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. మాచర్లలో రెండు రోజుల క్రితం తాగి రోడ్లపై బీభత్సం సృష్టిస్తున్న యువకులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. తన అనుచరులను అరెస్టు చేస్తారా? అంటూ బ్రహ్మారెడ్డి కొందరితో కలిసి వెల్దుర్తి పోలీస్‌స్టేషన్‌పైనే దాడికి పాల్పడ్డారు. దానికి కొనసాగింపుగానే అన్నట్టుగా.. శుక్రవారం స్థానిక సొసైటీ కాలనీలోని టీడీపీ కార్యాలయంలో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసే వంకతో.. చుట్టుప్రక్కల ఫాక్షన్‌ గ్రామాలకు చెందిన తన అనుచరులను ముందే పిలిపించుకున్నారు.

ముందస్తు పథకం ప్రకారం రాడ్లు, కర్రలతో వారిని సిద్ధంగా ఉంచారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డిని, స్థానిక ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని తెలుగుదేశం కార్యకర్తలు తీవ్రంగా దుర్బాషలాడుతుండటంతో అక్కడి వైయ‌స్ఆర్ సీపీ కార్యకర్తలు, స్థానికులు వారిని ప్రశ్నించారు. దీంతో తమను అడ్డుకుంటున్నారంటూ టీడీపీ కార్యకర్తలు దాడులకు తెగబడ్డారు. వెంట తెచ్చుకున్న రాడ్లు, కర్రలతో వైయ‌స్ఆర్ సీపీ స్థానిక నేతలు చల్లా మోహన్, ఓర్సు కిషోర్, ఉప్పుతోళ్ల శ్రీనివాసరావులపై దాడి చేశారు. వారు కిందపడిపోయినా వదలకుండా కర్రలతో దాడులు చేస్తూ, బండరాళ్లతో బలంగా గుండెలపై కొట్టారు. వైయ‌స్ఆర్ సీపీ కార్యకర్తలు నిస్సహాయంగా పడి ఉండిపోవటంతో.. నినాదాలు చేస్తూ, ఈలలు వేసుకుంటూ పోలీసులు నచ్చజెప్పినా వినకుండా ప్రదర్శనగా రైలు గేటు వరకూ వెళ్లారు. ఒకదశలో పోలీసులపై కూడా దౌర్జన్యానికి దిగారు. కొందరు వ్యక్తులు రైల్వే గేటు వద్ద ఓ వాహనాన్ని పూర్తి స్థాయిలో దహనం చేశారు. రింగ్‌రోడ్డులోని మరో వాహనంపై రాళ్లతో దాడిచేశారు. మరో నాలుగు ద్విచక్ర వాహనాలను ధ్వంసం చేశారు. చివరకు పోలీసులు బ్రహ్మారెడ్డిని బలవంతంగా అక్కడి నుంచి గుంటూరు పంపించారు. 

వైయ‌స్ఆర్ సీపీ కార్యకర్తలు దారుణంగా దెబ్బలు తిని, నిస్సహాయంగా రోడ్డుపై పడిపోయిన విషయం వారి బంధువులు, స్నేహితులకు తెలియటంతో వారు అక్కడికి చేరుకున్నారు. గాయపడ్డ ముగ్గురినీ ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు వారికి చికిత్స చేస్తున్నారు. తమ వారిని దారుణంగా కొట్టడం, దాదాపుగా హతమార్చే ప్రయత్నం చేయటంతో.. వారి బంధుమిత్రులు టీడీపీ కార్యకర్తల జులుంను నిరసించారు. ఇదే సమయంలో కొందరు టీడీపీకి చెందిన వ్యక్తులు ఓ కారుకు నిప్పు పెట్టారు. జూలకంటి బ్రహ్మారెడ్డి అద్దెకు ఉంటున్న ఇంటిపై కూడా దాడి చేశారు. అప్రమత్తమైన పోలీసులు అగంతకులను చెదరగొట్టి.. పట్టణంలో 144వ సెక్షన్‌ అమలులోకి తెచ్చారు. ప్రత్యేక దళాలను రంగంలోకి దింపి, శాంతిభద్రతలను అదుపులోకి తెచ్చారు. ఎక్కడికక్కడ పికెటింగ్‌లు ఏర్పాటుచేశారు. 

Back to Top