అమరావతి : స్థానిక సంస్థల ఎన్నికల ముందు ప్రతిపక్ష టీడీపీకి షాక్ తగిలింది. ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే ఎస్ఏ రెహమాన్ వైయస్ఆర్సీపీలో చేరారు. విశాఖ టీడీపీ అర్బన్ అధ్యక్షుడు వ్యవహరించిన రెహమాన్ గత ఏడాది డిసెంబర్ 26న టీడీపీకి రాజీనామా చేశారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో సోమవారం వైయస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వైయస్ఆర్సీపీలో చేరడం సంతోషంగా ఉందన్నారు. సీఎం వైయస్ జగన్ తీసుకుంటున్న విప్లవాత్మక నిర్ణయాలను స్వాగతిస్తున్నానని అన్నారు. విశాఖపట్నంను ఎగ్జిక్యూటివ్ కాపిటల్ ప్రకటించిన రోజే సీఎం నిర్ణయానికి మద్దతు తెలిపానని గుర్తుచేశారు. తన సతీమణి మద్యపాన నిషేధం కోసం పోరాటం చేశారని.. ప్రస్తుతం రాష్ట్రంలో అమలు చేస్తున్న మద్య విధానం వల్ల ఎంతో మేలుచేస్తోందని అభినందించారు. పదవుల కోసం పార్టీలో చేరలేదని మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికల్లో వైయస్ఆర్సీపీ అభ్యర్థులను గెలిపించుకునేందుకు చేరారని ఎస్ఏ రెహమాన్ స్పష్టం చేశారు. విశాఖపట్నం మేయర్ పీఠాన్ని ఖచ్చితంగా వైయస్ఆర్సీపీ గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.