అనుమతులు, క్లియరెన్స్‌ విషయంలో వేగం మరింత పెంచాలి

పరిశ్రమల పట్ల సానుకూల క్రియాశీలతను మరింత బలోపేతం చేయాలి

ఏ సమస్య ఉన్నా ఒక్క ఫోన్‌ కాల్‌ దూరంలో ఉన్నామన్న భరోసా కల్పిస్తున్నాం

ఎంఎస్‌ఎంఈల రంగానికి పునరుజ్జీవం ఇచ్చాం.. వీటిని కాపాడుకోవడం మ‌న‌ బాధ్యత

ఎస్‌ఐపీబీ  సమావేశంలో మొత్తం రూ.19,037 కోట్ల పెట్టుబడులకు ఆమోదం 

తద్వారా 69,565 మందికి ల‌భించ‌నున్న ఉద్యోగాలు

స్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ బోర్డు స‌మావేశంలో ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌

తాడేప‌ల్లి: ప‌రిశ్ర‌మ‌ల అనుమతులు, క్లియరెన్స్‌ విషయంలో ఇప్పుడున్న వేగాన్ని మరింతగా పెంచాల్సిన అవసరం ఉందని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అన్నారు. పరిశ్రమల ఉత్పాదకతలో సాంకేతికంగా విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయని, వీటన్నింటినీ అధికారులు ఎప్పటికప్పుడు అవగాహన‌ చేసుకోవాల‌ని సూచించారు. తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్‌ అధ్యక్షతన స్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ బోర్డు (ఎస్‌ఐపీబీ) స‌మావేశం జ‌రిగింది. ఈ స‌మావేశంలో పలు పరిశ్రమల ప్రతిపాదనలకు, ప్రోత్సాహకాలకు ఎస్‌ఐపీబీ ఆమోదం తెలిపింది. ఎస్‌ఐపీబీ సమావేశంలో మొత్తంగా రూ.19,037 కోట్ల పెట్టుబడులకు ఆమోదం ల‌భించింది. తద్వారా 69,565 మందికి ఉద్యోగాలు రానున్నాయి. ఈ సంద‌ర్భంగా సీఎం వౌయ‌స్ జ‌గ‌న్ అధికారులకు పలు ఆదేశాలు జారీ చేయడంతో పాటు సూచనలు చేశారు. 

సీఎం వైయస్‌.జగన్ ఏమన్నారంటే..
ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామికరంగంలో అనూహ్య మార్పులు వస్తున్నాయి. పరిశ్రమల ఉత్పాదకతలో సాంకేతికంగా విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. వీటన్నింటినీ అధికారులు ఎప్పటికప్పుడు అవగాహన‌ చేసుకోవాలి. ప్రపంచ పారిశ్రామిక రంగం పోకడలను అవగతం చేసుకోవాలి. ఆ మేరకు పారిశ్రామిక విధానాల్లో మార్పులు, చేర్పులు చేయాలి. అత్యంత పారదర్శకత విధానాల ద్వారా అత్యంత సానుకూల వాతావరణాన్ని తీసుకురాగలిగాం. ఈ క్రమంలో ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ ర్యాంకింగ్స్‌లో దేశంలోనే ప్రథమస్థానంలో నిలిచాం. ఈ ప్రయాణం మరింతగా ముందుకు సాగాలి. పరిశ్రమల పట్ల సానుకూల క్రియాశీలతను మరింత బలోపేతం చేయాలి. పరిశ్రమల ఏర్పాటుకోసం ఇచ్చే అనుమతులు, తదితర అంశాల్లో ప్రభుత్వం నుంచి వేగంగా స్పందిస్తున్నాం. ఏ సమస్య ఉన్నా ఒక్క ఫోన్‌ కాల్‌ దూరంలో ఉన్నామన్న భరోసాను వారికి కల్పిస్తున్నాం.

అనుమతులు, క్లియరెన్స్‌ విషయంలో ఇప్పుడున్న వేగాన్ని మరింతగా పెంచాల్సిన అవసరం ఉంది. పారిశ్రామిక వర్గాలనుంచి వచ్చే ప్రతిపాదనల పట్ల చురుగ్గా వ్యవహరించడంతో పాటు, వాటికి త్వరగా అనుమతులు మంజూరు చేసే ప్రక్రియ వేగాన్ని ఇంకా పెంచాలి. విశాఖ గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సదస్సులో కుదుర్చుకున్న ఒప్పందాల అమలు విషయంలో మరింత వేగం పెంచాలి. 

గత ప్రభుత్వంలో కన్నా పరిశ్రమలకు పోత్సాహకాల విషయంలో ఈ ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున మేలు చేకూర్చాం. ఎంఎస్‌ఎంఈల రంగానికి పునరుజ్జీవం ఇచ్చాం. ఇన్సెంటివ్‌లు ఇస్తూ వారికి చేదోడుగా నిలిచాం. ఎంఎస్‌ఎంఈల పట్ల చాలా సానుకూలతతో ఈ ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఎక్కువ మంది వీటిపై ఆధారపడి బతుకుతున్నారు కాబట్టి.. వీటిని కాపాడుకోవడం ప్రభుత్వంమీదున్న బాధ్యత. 

ఎస్‌ఐపీబీ ఆమోదం పొందిన కంపెనీల వివరాలు..
1.చిత్తూరు జిల్లా పుంగనూరులో ఎలక్ట్రిక్‌ బస్సుల తయారీ పరిశ్రమను ఏర్పాటు చేయనున్న పెప్పర్‌ మోషన్‌ కంపెనీ. రూ.4,640 కోట్ల పెట్టుబడి, ప్రత్యక్షంగా 8080 మందికి ఉద్యోగాలు.

2.విజయనగరం జిల్లా ఎస్‌.కోటలో జేఎస్‌ డబ్ల్యూ ఇండస్ట్రియల్‌ పార్కు ఏర్పాటు ప్రతిపాదనలకు ఆమోదం. రూ.531 కోట్లు పెట్టుబడి, 35,750 మందికి ప్రత్యక్షంగానూ, 9,375 మందికి పరోక్షంగానూ ఉద్యోగాలు.

3. శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో శ్రేయాస్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ పరిశ్రమ ఏర్పాటు. రూ.1750 కోట్ల పెట్టుబడి, 2000 మందికి ప్రత్యక్షంగానూ, మరో 500 మందికి పరోక్షంగానూ ఉద్యోగాలు.

4. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఎస్‌ఈజెడ్‌లో స్మైల్‌ (సబ్‌స్ట్రేట్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ ఇండియా లిమిటెడ్‌ ఎంటర్‌ప్రైజెస్‌)కంపెనీ ఆధ్వర్యంలో ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఎలక్ట్రానిక్‌ ప్రొడక్ట్స్‌ తయారీ యూనిట్‌. 
రూ.166 కోట్ల పెట్టుబడి, దాదాపు 5 వేలమందికి ఉద్యోగాలు. 

5. నెల్లూరు జిల్లా కృష్ణపట్నం వద్ద కోస్టల్‌ ఆంధ్రా పవర్‌ లిమిటెడ్‌ (రిలయెన్స్‌ పవర్‌) తన పారిశ్రామిక కార్యకలాపాన్ని మార్చుకునేందుకు ఎస్‌ఐపీబీ ఆమోదం. థర్మల్‌ పవర్‌ స్ధానంలో కొత్త తరహా, సాంప్రదాయేతర పర్యావరణహిత గ్రీన్‌ హైడ్రోజన్, గ్రీన్‌ అమ్మోనియా ఉత్పత్తి ప్లాంటుకు ఎస్‌ఐపీబీ ఆమోదం. రూ.6,174 కోట్ల పెట్టుబడి, 600 మందికి ప్రత్యక్షంగానూ, 2000 మందికి పరోక్షంగానూ ఉద్యోగాలు. 

6. ఇవికాక మరో మూడు కంపెనీల విస్తరణకూ ఎస్‌ఐపీబీ ఆమోదం, ఆమేరకు వారికి ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు ఎస్‌ఐపీబీ ఆమోదం. తూర్పుగోదావరి జిల్లా కడియం వద్ద ఆంధ్రాపేపర్‌ లిమిటెడ్‌ విస్తరణ. 
రూ.4వేల కోట్ల పెట్టుబడి, 3 వేలమందికి ఉద్యోగాలు.

7. విశాఖపట్నం జిల్లా అచ్యుతాపురం ఎస్‌ఈజెడ్‌లో ఏటీసీ టైర్స్‌ లిమిటెడ్‌ విస్తరణ.  రూ.679 కోట్ల పెట్టుబడి, 300 మందికి ఉద్యోగాలు.

8. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి సమీపంలో ఎలక్ట్రోస్టీల్‌ కాస్టింగ్‌ లిమిటెడ్‌ కంపెనీ విస్తరణ. రూ.933 కోట్ల పెట్టుబడి, 2,100 మందికి ఉద్యోగాలు.

9. ఏలూరు జిల్లా కొమ్మూరు వద్ద రూ.114 కోట్ల పెట్టుబడి పెట్టనున్న శ్రీ వెంకటేశ్వర బయోటెక్‌ లిమిటెడ్‌. 310 మందికి ఉద్యోగాలు. ఆమోదం తెలిపిన ఎస్‌ఐపీబీ.

10. విశాఖపట్నం జిల్లా పద్మనాభం మండలం మద్ది వద్ద రూ.50 కోట్ల పెట్టుబడి పెట్టనున్న ఓరిల్‌ పుడ్స్‌ లిమిటెడ్‌. దాదాపుగా 550 మందికి ఉద్యోగాలు.

ఈ స‌మావేశంలో విద్యుత్‌, అటవీ పర్యావరణశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌, పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్‌, పర్యాటకశాఖ మంత్రి ఆర్‌ కే రోజా, సీఎస్ డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి, రెవెన్యూశాఖ స్పెషల్ సీఎస్‌ రజత్ భార్గవ, ఇంధనశాఖ స్పెషల్ సీఎస్‌ కె విజయానంద్‌, ఆర్థికశాఖ స్పెషల్ సీఎస్ ఎస్‌ ఎస్ రావత్‌, పరిశ్రమలశాఖ కార్యదర్శి ఎన్ యువరాజ్‌, పరిశ్రమలు, వాణిజ్యశాఖ (చేనేత, జౌళి) ముఖ్యకార్యదర్శి కె సునీత, ఏపీఐఐసీ ఎండీ ప్రవీణ్ కుమార్‌, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Back to Top