పలాస: ఎంపీ సీటు కోసం ఎర్రన్నాయుడిని రోడ్డు ప్రమాదంలో దారుణంగా చంపించారని మాతో అనిపించాలనేది అచ్చెన్నాయుడి ఉద్దేశమా? అందుకే వైయస్ఆర్ ఆకస్మిక మరణాన్ని అడ్డం పెట్టుకుని వైయస్ జగన్ గారి వ్యక్తిత్వ హననం చేస్తున్నారా? అంటూ మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యలపై వైయస్ఆర్సీపీ డాక్టర్స్ సెల్ అధ్యక్షుడు, మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు ఫైర్ అయ్యారు. మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ గారిని ఉద్దేశించి మంత్రి అచ్చెన్నాయుడి మాటలు చాలా అభ్యంతరకరంగా ఉన్నాయని పలాసలోని తన నివాసంలో ఆయన మాట్లాడిన వీడియోని మీడియాకు విడుదల చేశారు. చంద్రబాబుకి భజన చేయాలనుకుంటే చేసుకోవాలే కానీ అందుకు వైయస్ జగన్ గారి వ్యక్తిత్వంపై బురదజల్లుదామనుకుంటే మాత్రం ఎంతమాత్రం సహించేది లేదని ఆయన హెచ్చరించారు. మాట మీద నిలకడలేని వ్యక్తులే సైకోలైతే ప్రపంచంలో చంద్రబాబుని మించిన సైకో ఇంకొకరు ఉండరని వైయస్ఆర్సీపీ డాక్టర్స్ సెల్ అధ్యక్షుడు, మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు మండిపడ్డారు. చంద్రబాబుని సంతృప్తి పరిచి ఇంట్లో ఉన్న రెండు మంత్రి పదవులను కాపాడుకోవడం కోసం వైయస్ జగన్ గారిని ఉద్దేశించి అచ్చెన్నాయుడు బరితెగించి మాట్లాడుతున్నాడని, రామ్మోహన్నాయుడు, అచ్చెన్నాయుడులు కలిసి చేస్తున్న చంద్రబాబు భజన కారణంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి తీరని నష్టం జరుగుతోందని ధ్వజమెత్తారు. "తెలుగుదేశం పార్టీ రాజకీయంగా సంక్షోభంలో ఉంటే వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి ఆకస్మిక మరణం, వివేకానందరెడ్డి మర్డర్ గురించి నీచంగా మాట్లాడి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఎర్రన్నాయుడు రోడ్డు ప్రమాదంలో మరణించడం వల్లే కదా వారబ్బాయి రామ్మోహన్నాయుడు ఎంపీగా గెలిచి మంత్రి కాగలిగాడు. ఆయన్ను ఎంపీని చేయడం కోసమే ఎర్రన్నాయుడిని రోడ్డు ప్రమాదంలో చంపించారని మేం మాట్లాడితే ఎలా ఉంటుందో ఆలోచించుకోవాలి. చంద్రబాబుని ఇంప్రెస్ చేయడానికి ఇంతకు మించిన మార్గం కనపడటం లేదా? చంద్రబాబుకి ఇంతలా బానిసత్వం చేయాల్సిన అవసరం ఏముంది? ఉత్తరాంధ్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టి మరీ అమరావతిని సపోర్టు చేయడం దేనికి? అమరావతి కోసం విశాఖ అభివృద్ధిని కాలరాసి ఎర్రన్నాయుడు కుటుంబం చరిత్ర హీనులుగా మిగిలిపోయారు. ఇన్ని దశాబ్దాలు రాజకీయం చేసి ఉత్తరాంధ్ర కోసం ఫలానా ప్రాజెక్టు తీసుకొచ్చామని చెప్పుకోగలరా? ఇవి అడిగితే కోపం, ఆక్రోశం. సమాధానం చెప్పలేక నోటికి పనిచెబుతున్నారు. మాటకు మాటలే సమాధానం చెప్పాల్సి వస్తే మీకన్నా చాలా గొప్పగా మాట్లాడగలమ"ని దీటుగా బదులిచ్చారు.