తాడేపల్లి: ప్రతి ఓటు విలువైనదే ఏమాత్రం ఏమరుపాటు పనికిరాదని వైయస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు. చిన్నచిన్నవిషయాలని వదిలివేయవద్దని కౌంటింగ్ ఏజెంట్లను హెచ్చరించారు. తాడేపల్లిలోని వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి పార్టీ కౌంటింగ్ ఏజెంట్లతో సజ్జల రామకృష్ణారెడ్డి జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏజెంట్లకు పలు సూచనలు చేశారు. కౌంటింగ్ ఏజంట్లు మనకు వచ్చిన ఓట్లు ఒక్కటి కూడా పొల్లుపోకుండా పార్టీ అకౌంట్ లో పడేలా చూడండి. కౌంటింగ్ సమయంలో అప్రమత్తంగా ఉండండి. తెలుగుదేశం పార్టీ అక్రమాలకు తెరలేపేందుకు అవసరమైన గ్రౌండ్ ప్రపేర్ చేసుకున్నారు. అధికారులపైన,ఎన్నికల కమీషన్ పైన వత్తిడి తీసుకువచ్చారు. పార్టీ కౌoటింగ్ ఏజంట్లు ఈసి నిబంధనలను పాటిస్తూ వాటిని అమలు చేయించేందుకు న్యాయంగా గట్టిగా నిలబడండి. ఉదయం కౌంటింగ్ కేంద్రంలోకి వెళ్లినప్పటినుంచి డిక్లరేషన్ పత్రం తీసుకునేంతవరకు బయటకు రావద్దు. ఓరియంటేషన్ ప్రోగ్రామ్ లో అవగాహన కల్పించుకున్న అంశాలను మననం చేసుకోండి. పోస్టల్ బ్యాలెట్ ,ఈవిఎంలను ఓపెన్ చేసే విషయంలో ప్రతి అంశాన్ని కూలంకషంగా గమనించాలి. ఎన్నికల ముందు ఎలా అయితే నా పోలింగ్ బూత్.. నా విజయం అని ఎలా అయితే ఒక నినాదంతో పనిచేశామో... నా టేబుల్, నా కౌంటింగ్,మన మెజారిటీ అనే లక్ష్యంగా పనిచేయాలి. 175 కి 175 టార్గెట్ అలానే ఉంది.టిడిపి అంచనాలు తలకిందులవుతాయి. టిడిపి బోగస్ సర్వేలన్నీ కూడా తలకిందులవుతాయి. ఎవర్నో శాటిస్ ఫై చేయడానికి తయారుచేసిన సర్వేలు అవి.అవన్నీ కూడా చెత్తబుట్టలో వేసుకోవడానికి పనికివస్తాయి.లేదా ఈ రెండు రోజులపాటు టిడిపి వాళ్ళు సంబరాలు చేసుకోవడానికి పనికివస్తాయి. నిజం మనకు తెలుసు.అది ఈవిఎంలలో ఉంది.రాష్ర్టం అంతా జగన్ గారివైపు ఉంది. వైయస్ఆర్సీపీ విజయంలో భాగస్వాములవుతున్న అందరికి అభినందనలు తెలియచేస్తున్నాను