విశాఖ:వైయస్ఆర్ పేరును ఆయన మరణం తరువాత ఎఫ్ఐఆర్లో చేర్చి అవమానించిన కాంగ్రెస్ పార్టీలో చేరడమే కాకుండా తప్పుడు మాటలు మాట్లాడుతున్నావని పీసీసీ అధ్యక్షురాలు షర్మిలపై వైయస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ను అడ్డగోలుగా విభజించడమే కాకుండా ఇప్పటికీ రాజధాని లేని రాష్ట్రంగా తయారుచేసిన కాంగ్రెస్, టీడీపీలతో జతకట్టి వైయస్ఆర్సీపీ ప్రభుత్వంపై విమర్శలు చేయడం తగదన్నారు. వాస్తవాలు మాట్లాడడం షర్మిల నేర్చుకోకపోతే రానున్న కాలంలో ప్రజలు తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని ఆమె హెచ్చరించారు. విశాఖలో ఆమె మీడియాతో మాట్లాడారు. పొరుగు రాష్ట్రం నుంచి ఇక్కడకు వచ్చి ప్రభుత్వంపై అవాస్తవాలు మాట్లాడడం సబబు కాదని హితవు పలికారు. ఏపీలో గ్రామ సచివాలయ వ్యవస్థను యావత్తు దేశమే పొగుడుతుంటే షర్మిల సచివాలయ వ్యవస్థపై బురదజల్లేలా వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. గ్రామ సచివాలయ ఉద్యోగ నియామక ప్రక్రియ అత్యంత పారదర్శకంగా జరిగిందని.. వలంటీర్లు, సచివాలయ ఉద్యోగుల మధ్య తేడా కూడా తెలియకుండా మాట్లాడడం ఆమె అవగాహనారాహిత్యమని వరుదు కళ్యాణి విమర్శించారు. ఎక్కువ ఉద్యోగాలిచ్చింది వైయస్ఆర్సీపీ సర్కారే.. వైయస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత రాష్ట్రంలో 2 లక్షల 14 వేల శాశ్వత ఉద్యోగాలు, 6 లక్షల 30 వేలకు పైగా ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగాలు కల్పించామన్నారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వోద్యోగులుగా.. 2008లో డీఎస్సీ నోటిఫికేషన్లో ఆగిన ఉద్యోగాలను కూడా తమ ప్రభుత్వంలో భర్తీ చేశామన్నారు. యువతకు ఎక్కువ ఉద్యోగాలు కల్పించిన ఏకైక ప్రభుత్వం వైయస్ఆర్సీపీ ప్రభుత్వమన్నారు. కనీస అవగాహనలేకుండా ఎవరో రాసిన స్క్రిప్ట్ చదువుతున్న షర్మిల తన సొంత కుటుంబాన్ని వేధించిన వారితోనే జతకట్టడానికి సిగ్గులేదా అని ఆమె ప్రశ్నించారు.