విజయవాడ: ప్రకాశం బ్యారేజీకి ఎగువన ఒకటి, దిగువన రెండు బ్యారేజీల నిర్మాణానికి త్వరలోనే టెండర్ల ప్రక్రియ చేపడతామని కృష్ణా జిల్లా ఇంచార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన అధ్యక్షతన కృష్ణా జిల్లా 33వ నీటిపారుదల సలహామండలి సమావేశం జరిగింది. ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, జోగి రమేష్, సింహాద్రి రమేష్, మొండితోక జగన్మోహన్రావు, జిల్లా కలెక్టర్ ఇంతియాజ్, జాయింట్ కలెక్టర్ మాధవీలత, ఇరిగేషన్ శాఖ అధికారులు హాజరయ్యారు. ఒకే జిల్లాలో మూడూ బ్యారేజీల నిర్మాణం శుభ పరిణామం అని పేర్కొన్నారు. సీఎం వైయస్ జగన్.. బ్యారేజీల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టారని తెలిపారు. నేడు కేబినెట్ సమావేశంలో కూడా ఈ అంశం చర్చకు వచ్చిందన్నారు.
‘‘గత ఏడాది రబీకి 16 టీఎంసీల నీరు ఇచ్చాం. ఈ ఏడాది 26 టీఎంసీలు ఇస్తున్నాం. బందరు కాలువకు కూడా 1 టీఎంసీ నీరు ఇవ్వాలని నిర్ణయించాం. ఈ ఏడాది నీటి లభ్యత ఎక్కువగా ఉంది కాబట్టి ఎక్కువగా ఇవ్వాలని నిర్ణయించాం. గత ఏడాది కంటే రెట్టింపుగా ఈ సారి నీటిని ఇస్తున్నాం. టెయిల్ఎండ్ ప్రాంతాలకు మంచి ఉపయోగకరం. ప్రయారిటీ ప్రాతిపదికన పనులు చేపట్టాలని అధికారులకు ఆదేశించామని’’ మంత్రి తెలిపారు. ఇబ్బందులు ఉంటే కలెక్టర్ దృష్టికి తీసుకురావాలని, అన్ని పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని మంత్రి పెద్దిరెడ్డి పేర్కొన్నారు.