అవార్డులు ప్రదానం చేసిన సీఎం వైయస్‌ జగన్‌

తాడేపల్లి: జాతీయ పంచాయతీ రాజ్‌ దినోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్రమోడీ జాతీయ స్థాయి అవార్డుల ప్రదానోత్సవాన్ని వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించారు. పంచాయతీ రాజ్‌ శాఖలో ఆంధ్రప్రదేశ్‌కు నాలుగు కేటగిరీల్లో మొత్తం 17 అవార్డులు వచ్చాయి. ఈ–పంచాయత్‌ కేటగిరీలో రాష్ట్రస్థాయి రెండో అవార్డుతో పాటు, జిల్లా స్థాయిలో 2, మండల స్థాయిలో 4, పంచాయతీ స్థాయిలో 10 జాతీయ అవార్డులు ఈ ఏడాది (2021) రాష్ట్రానికి దక్కాయి. ఈ మేరకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ప్రకటించిన జాతీయ స్థాయి అవార్డులను ప్రదానం చేశారు.

ఈ–పంచాయత్‌ కేటగిరీలో ఆంధ్రప్రదేశ్‌ పొందిన రాష్ట్రస్థాయి రెండో అవార్డును పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆ శాఖ కమిషనర్‌ ఎం.గిరిజాశంకర్‌కు ప్రదానం చేశారు. ఆ తర్వాత జిల్లా, మండల, పంచాయతీల అవార్డులు ఇచ్చారు.

జిల్లా స్థాయిలో గుంటూరు జిల్లా పొందిన అవార్డు (దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ పంచాయత్‌ సశక్తికరణ్‌ పురస్కారం)ను జడ్పీ సీఈఓ డి.చైతన్యకు, కృష్ణా జిల్లా పొందిన అవార్డును జడ్పీ సీఈఓ పీఎస్‌ సూర్యప్రకాశరావుకు సీఎం వైయస్‌ జగన్‌ అందజేశారు.

అనంతరం మండల స్థాయిలో చిత్తూరు జిల్లా సొడెం, తూర్పు గోదావరి జిల్లా కాకినాడ రూరల్, కృష్ణా జిల్లా విజయవాడ రూరల్, అనంతపురం జిల్లా పెనుకొండ ఎంపీడీలకు దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ పంచాయత్‌ సశక్తికరణ్‌ పురస్కారాలు (అవార్డులు) అందజేశారు.

ఆ తర్వాత పంచాయతీల స్థాయిలో కర్నూలు జిల్లా వర్కూరు, విశాఖపట్నం జిల్లా పెదలబూడు, గుంటూరు జిల్లా గుల్లపల్లి, నెల్లూరు జిల్లా తడ కండ్రిగ, అదే జిల్లాకు చెందిన తాళ్లపాలెం, పార్థవెల్లంటి, పెన్నబర్తి, చిత్తూరు జిల్లా రేణిమాకులపల్లి, తూర్పు గోదావరి జిల్లా జి.రంగంపేట పంచాయతీలకు సీఎం వైయస్‌ జగన్‌ పురస్కారాలు ప్రదానం చేశారు.     

ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి వి.ఉషారాణి, పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి కమిషనర్‌ ఎం.గిరిజాశంకర్, ల్యాండ్‌ రికార్డ్స్‌ సర్వే సెటిల్‌మెంట్‌ కమిషనర్‌ సిద్దార్థజైన్‌తో పాటు, వివిధ జిల్లాల అధికారులు, మండల స్థాయి అధికారులు, సర్పంచ్‌లు పాల్గొన్నారు.
 

Back to Top