తాడేపల్లి: ఆరు నెలలైనా మోంథా తుపాన్ పరిహారం చెల్లించకుండా రైతులను మోసగించిన కూటమి ప్రభుత్వంపై చీటింగ్ కేసు పెట్టాలని, తప్పుడు హామీలతో రైతులను ముంచేసిన కూటమి ప్రభుత్వానికి పుట్టగతులుండవని వైయస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ ధ్వజమెత్తారు. తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మోంథా తుపాన్ పరిహారం ఎప్పుడిస్తారో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రెండేళ్లలో ఏడుసార్లు కలెక్టర్ల కాన్ఫరెన్సులు జరిగితే ఎంతసేపటికీ సచివాలయాల పేర్లు మార్చడం, ఆర్బీకే సెంటర్లను నిర్వీర్యం చేయడం తప్ప, ఏనాడూ రైతు సమస్యలు, పంటలకు మద్ధతు ధరలపై చర్చ జరగలేదని చెప్పారు. వైయస్ఆర్సీపీ హయాంలో ఏ సీజన్లో పంట నష్టం జరిగితే ఆ సీజన్ ముగిసేలోపు పరిహారం చెల్లించి ఆదుకున్నామని, ఐదేళ్లలో ఏకంగా రూ. 7802 కోట్లు నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేసి ఆదుకున్నామని గుర్తు చేశారు. కానీ కూటమి పాలనలో యూరియా బస్తాలకు, గన్నీ బ్యాగులకు కూడా కొరతగా ఉందన్నారు. శనగ, మొక్కజొన్న, పొగాకు రైతులకు గిట్టుబాటు ధరలు లేక అలమటిస్తుంటే వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు సింగపూర్ లో విహార యాత్రలకు వెళ్లారని విమర్శించారు. వ్యవసాయం దండగ అనే తన సిద్ధాంతాలకు కట్టుబడే ఇప్పటికీ చంద్రబాబు పాలన సాగిస్తున్నాడని, కూటమి పాలన రైతులకు దినదిన గండంగా మారిందని మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ ఆరోపించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే... - రెండేళ్లలో రైతులకు చేసిన ఒక్క మంచి పని లేదు మూడు పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడి మాయమాటలతో రైతులను నిండా ముంచేశాయి. రెండేళ్ల కూటమి పాలన మొత్తం చూస్తే ఫలానా విషయంలో రైతుకు మేలు చేశామని చెప్పుకోవడానికి ఒక్కటంటే ఒక్క మంచి విషయం కూడా లేదు. గత ఐదేళ్ల వైయస్ఆర్సీపీ పాలనలో రైతు రారాజుగా బతికితే, రెండేళ్ల కూటమి పాలనలో రైతు పరిస్థితి దినదిన గండంలా మారింది. రైతు వ్యతిరేక ప్రభుత్వాన్ని చంద్రబాబు నడుపుతున్నాడు. వ్యవసాయం దండగ అనే తన సిద్ధాంతాలకు అనుగుణంగానే చంద్రబాబు పాలన సాగిస్తున్నాడు. ఉచిత పంటల బీమా లేదు. క్రాప్ ఇన్సూరెన్స్ చేయడం లేదు. అందరికీ పెట్టుబడి సాయం అందడం లేదు. ఇన్పుట్ సబ్సిడీ లేదు. ఎప్పుడూ లేనిది కనీసం బస్తా యూరియాకి కూడా క్యూలో నిలబడినా దక్కని పరిస్థితులు తీసుకొచ్చారు. కౌలు రైతులు.. అసలు రైతులుగానే ఈ ప్రభుత్వానికి కనిపించడం లేదు. - రెండు సీజన్లు ముగిసినా అందని పరిహారం మొంథా తుపాన్ వచ్చినప్పుడు 24 జిల్లాల్లో 15 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగి రైతులు రూ.869 కోట్లు నష్టపోయారని కూటమి ప్రభుత్వమే కేంద్రానికి నివేదిక ఇచ్చింది. ఆ తర్వాత రైతులను బెదిరించి 4.27 లక్షల ఎకరాల్లోనే పంట నష్టం జరిగిందని, నష్టాన్ని రూ. 390 కోట్లకే పరిమితం చేయించారు. నిట్టనిలువునా అబద్ధమాడిన ప్రభుత్వంపై 420 సెక్షన్ కింద చీటింగ్ కేసు పెట్టాలి. రాష్ట్ర ప్రజలు గతంలో ఎప్పుడూ ఇలాంటి ప్రభుత్వాన్ని చూసి ఉండరు. గతేడాది అక్టోబర్లో మోంథా తుపాను విరుచుకుపడితే, ఆరునెలలు గడిచినా రైతులకు పంట నష్టపరిహారం అందలేదు. దాదాపు 3.23 లక్షల మంది రైతులు పరిహారం కోసం ఎదురు చూస్తున్నారు. పంట నష్టపరిహారం క్షణాల్లో చేతుల్లో పెట్టేస్తామన్నట్టుగా నానా హంగామా చేసిన ప్రభుత్వం.. పంటనష్టం తుది అంచనాలకు 24 గంటల గడువునిచ్చి పారదర్శకతకు పాతరేసింది. అధికారులు కనీసం క్షేత్రస్థాయి పరిశీలన జరపకుండా టీడీపీ నేతల సిఫార్సులు, కనుసన్నల్లోనే గాలిలెక్కలతో తుది జాబితాలను రూపొందించారు. ఆర్బీకేల్లో ఆ జాబితాల ప్రదర్శన, అభ్యంతరాల స్వీకరణ, పరిష్కారాన్ని మొక్కుబడి తంతుగా మార్చేశారు. మోంథా పరిహారం ఊసెత్తడం లేదు. కరువు సాయం బకాయిలు కలిపి రూ.1,100 కోట్లకు పైగా రైతులకు జమ చేయాల్సి ఉంది. రెండు వ్యవసాయ సీజన్లు ముగిసినా పరిహారం ఎప్పుడు చెల్లిస్తారో చెప్పలేని దుస్థితిలో చంద్రబాబు ప్రభుత్వం ఉంది. - 16 సార్లు ప్రకృతి విపత్తులు శనగ, మొక్కజొన్న, పొగాకు, మినుము పంటలకు మద్ధతు ధరలు లేక రైతులు అలమటిస్తుంటే వ్యవసాయశాఖ మంత్రి సింగపూర్ లో విహార యాత్రలు చేస్తున్నాడు. ఈ రెండేళ్లలో ఏడు సార్లు కలెక్టర్ల కాన్ఫరెన్సులో పెట్టిన చంద్రబాబు ఏనాడూ రైతులను ఆదుకునే అంశంపై చర్చించిన పాపాన పోలేదు. రైతులు పండించే పంటలకు మద్ధతు ధర అందించడంపై దృష్టిపెట్టిందే లేదు. రెండేళ్ల కూటమి పాలనలో 16 సార్లు ప్రకృతి విపత్తులు వచ్చినా దానిపై చర్చ జరగలేదు. ఎంతసేపటికీ వైయస్ జగన్ గారు తీసుకొచ్చిన సచివాలయాలకు పేర్లు మార్చడం, ఆర్బీకే సెంటర్లను నిర్వీర్యం చేయడం తప్ప రైతులకు మంచి చేసే ఆలోచన చేయడం లేదు. - నాడు ఉచిత పంటల బీమా ద్వారా రూ. 7802 కోట్ల పరిహారం వైయస్ఆర్సీపీ హయాంలో విత్తనం నుంచి విక్రయం వరకు రైతులను చేయి పట్టి నడిపించిన ఆర్బీకే సెంటర్లను ఈ ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. చంద్రబాబు చేస్తున్న మోసాలపై రైతులు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. రైతులకు కనీసం గోనె సంచులు కూడా ఇవ్వలేని దుస్థితిలో కూటమి ప్రభుత్వం ఉందని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు అంటున్నారు. వైయస్ఆర్సీపీహయాంలో చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఏ సీజన్లో పంటనష్టం జరిగితే పరిహారాన్ని అదే సీజన్ ముగిసేలోగా నేరుగా రైతుల ఖాతాలో జమ చేయడం జరిగేది. ఇలా ఐదేళ్లలో 34.41 లక్షలమంది రైతులకు రూ.3,261.60 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చారు. పైసా భారం పడకుండా అమలుచేసిన ఉచిత పంటల బీమా ద్వారా ఐదేళ్లలో 54.48 లక్షలమంది రైతులకు రూ.7,802.05 కోట్ల పరిహారాన్ని అందజేసి వైయస్ జగన్ గారు రైతులకు అండగా నిలిచారు.