ఏపీ కేబినెట్‌ అంతా ఇష్టపూర్వకంగానే రాజీనామా  

  చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ

విజయవాడ: ఏపీ కేబినెట్‌ అంతా ఇష్టపూర్వకంగానే రాజీనామా చేసిందని, అసంతృప్తి అనేది కేవలం మీడియా సృష్టేనని స్పష్టత ఇచ్చారు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ. ఏపీ కేబినెట్‌లో ఆయన బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా పని చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీ తరపున ఎలాంటి బాధ్యతలు అప్పగించినా పని చేస్తానని ఆయన అంటున్నారు. 

‘‘ఏపీ కేబినెట్‌లో మంత్రులకి స్వేచ్చ లేదనే ప్రచారం అబద్దం. మాకు పూర్తి స్వేచ్చ ఇచ్చారు కాబట్టే సమర్థవంతంగా పనిచేయగలిగాం. కేబినెట్‌లో అన్ని వర్గాలకు అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి చరిత్రకెక్కారు. పిల్లి సుభాష్ చంద్రబోస్కి రాజ్యసభ అవకాశం ఇచ్చి...అదే సామాజిక వర్గానికి చెందిన‌ నాకు మంత్రి బాధ్యతలు అప్పజెప్పారు. ఇప్పుడు కూడా నాకు ఎటువంటి పగ్గాలు అప్పగించినా.. మరింత బాధ్యతగా పనిచేయడానికి సిద్దం’’ అని వేణుగోపాలకృష్ణ అన్నారు.  

ఏపీ మంత్రి వర్గంలో పని చేయడం‌ తన అదృష్టం.. కేబినెట్‌ కూర్పు అనేది పూర్తిగా ముఖ్యమంత్రి‌ కార్యాలయానికి సంబంధించిందని తెలిపారు. అయితే తొలి కేబినెట్ కూర్పు తరహాలోనే.. ఈసారి కూడా అన్ని వర్గాలకి సమ ప్రాధాన్యత ఉంటుందని ఆశిస్తున్నట్లు వేణుగోపాల‌కృష్ణ చెప్పారు. 

Back to Top