టెర్రరిస్ట్‌ దాడులన్నీ కాంగ్రెస్‌ హయాంలోనే 

 రాజ్యసభ చర్చలో విజయసాయి రెడ్డి వ్యాఖ్యలు 
 

న్యూఢిల్లీ : దేశం యావత్తు విస్తుపోయే టెర్రరిస్టు దాడులన్నీ కాంగ్రెస్‌ హయాంలోనే జరిగాయని వైయ‌స్ఆర్‌సీపీ సభ్యులు  వి.విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు. నేరాలకు పాల్పడిన వ్యక్తులను వెంటనే గుర్తించి, దర్యాప్తును వేగవంతం చేసేందుకు వీలుగా అనుమానితులు, నేరస్తుల కొలతలు, బయోమెట్రిక్‌ నమూలను సేకరించే అధికారం పోలీసులు, జైలు వార్డెన్లకు కల్పించే క్రిమినల్‌ ప్రొసీజర్‌ (ఐడెంటిఫికేషన్‌) బిల్లుపై బుధవారం రాజ్యసభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీపై ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మాజీ హోం మంత్రి, కాంగ్రెస్‌ నాయకుడు  చిదంబరం అంతకు ముందు ఈ బిల్లుపై చేసిన వ్యాఖ్యలను ఆయన తూర్పారబడుతూ కాంగ్రెస్‌ పార్టీ ఆనాడు పాల్పడిన దుశ్చర్యల కారణంగానే తాను ఈ బిల్లును సమర్ధిస్తున్నట్లు  విజయసాయి రెడ్డి  చెప్పారు. 2007లో సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌లో బాంబు పేలుళ్ళు, 2008లో అస్సాంలో బాంబు పేలుళ్ళు, 2010లో పూణేలో బాంబు పేలుళ్ళు, 2011లో ముంబైపై కసాబ్‌ ముఠా దాడులు ...దేశాన్ని నివ్వెరపరచిన ఈ టెర్రరిస్టు దాడులన్నీ కాంగ్రెస్‌ హయాంలోనే జరిగాయి. కానీ ఈరోజు మాజీ హోం మంత్రి, కాంగ్రెస్‌ నాయకుడు చిదంబరం సభను తప్పుదోవ పట్టించేలా మాట్లాడుతున్నారు. ఈ సందర్భంగా చిందబరంను ఒక్కటే ప్రశ్న అడుగుతున్నా. ఈ బిల్లును మీరు సెలక్ట్‌ కమిటీకి పంపిచాలని కోరుతున్నారు. అయితే హోం మంత్రిగా మీ హయాంలో ఎన్ని బిల్లులను సెలక్ట్‌ కమిటీకి పంపించారని ఆయన ప్రశ్నించారు. చిదంబరం చెప్పేవన్నీ శ్రీరంగ నీతులు...చేసేవి తప్పుడు పనులు అని అన్నారు. చిదంబరం, గులాంనబీ అజాద్ కలసి నాపైన, మా పార్టీ అధ్యక్షుడు శ్రీ వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిపైన తప్పుడు కేసులు బనాయించారని అన్నారు. అలాంటి దుష్టచింతన కలిగిన చిదంబరం  ఈరోజు ఈ సభలో ఈ బిల్లును వ్యతిరేకిస్తూ మాట్లాడుతున్నారని శ్రీ విజయసాయి రెడ్డి ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్‌ హయాంలో టెర్రరిస్టుల పట్ల అనుసరించిన ఉదాశీన వైఖరి వల్లనే వాళ్ళు పేట్రేగిపోయారు. దేశ ప్రజలు తీవ్ర భయాందోళనలతో గడపాల్సి వచ్చింది. ప్రపంచం దృష్టిలో నాడు భారత్‌ బలహీనమైన దేశంగా ముద్రపడిందని శ్రీ విజయసాయి రెడ్డి అన్నారు. ప్రధానమంత్రిగా   నరేంద్ర మోదీ అధికారం చేపట్టిన తర్వాత టెర్రరిస్టుల గుండెల్లో రైళ్ళు పరిగెత్తించారు. టెర్రర్‌ దాడులను ప్రోత్సహిస్తున్న పొరుగు దేశంపై సర్జికల్‌ దాడులు చేయడానికి కూడా మోదీ వెనుకాడలేదు. ప్రధాని అనుసరించిన విధానాల వలన దేశ భద్రతపై ప్రజలలో మళ్ళీ విశ్వాసం చూరగొందని శ్రీ విజయసాయి రెడ్డి ప్రశంసించారు.
ఆయన ప్రసంగానికి కాంగ్రెస్‌ సభ్యులు తరచుగా అంతరాయం కలిగిస్తుండటంతో ఒక దశలో హోం మంత్రి  అమిత్‌ షా లేచి కాంగ్రెస్‌ సభ్యులను ఉద్దేశించి మాట్లాడుతూ సహచర సభ్యుడు మాట్లాడుతుంటే మీకు వినే ఓపిక, సహనం లేకపోతే ఎలా అని ప్రశ్నించారు. మీకు మాట్లాడే అవకాశం వచ్చినపుడు ఆయనకు సమాధానం చెప్పండని సూచించారు.
  విజయసాయి రెడ్డి తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ ఎప్పుడో 1920లో చేసిన ఈ చట్టానికి మారిన పరిస్థితులకు అనుగుణంగా సవరణ చేపట్టడం ఎంతైనా అవసరం ఉంది. దానికి కారణాలేమిటో కూడా వివరిస్తానని అన్నారు. ఈ బిల్లును ప్రవేశపెట్టినందుకు ఆయన హోం మంత్రి శ్రీ అమిత్‌ షాను అభినందిస్తూ 2020 నేషనల్‌ క్రైమ్‌ బ్యూరో రికార్డుల ప్రకారం దేశంలో వివిధ నేరాలకు పడుతున్న శిక్షల శాతాన్ని వివరించారు. మర్డర్‌ కేసుల్లో 40 శాతం, రేప్‌ కేసుల్లో 39 శాతం, హత్యాయత్నం కేసుల్లో 24 శాతం నిందితులకు శిక్షలు పడ్డాయని తెలిపారు. శిక్షలు పడిన కేసుల శాతం ఇంత తక్కువగా ఉండటానికి కారణం నేరస్తులను శిక్షించే బలమైన ఆధారాల సేకరణకు పోలీసుల వద్ద తగిన ఉపకరణాలు లేకపోవడమే అన్నారు. ఇతర దేశాలతో పోల్చుకుంటే మన దేశంలో శిక్షలు పడుతున్న కేసులు చాలా తక్కువగా ఉంటున్నాయని చెబుతూ యూకేలో 2020-21లో 83.6 శాతం కేసుల్లో నిందితులకు శిక్షలు పడ్డాయి. అదే అమెరికాలో 93 శాతం, జపాన్‌లో 99 శాతం నేరాలకు తగిన శిక్షలు పడ్డాయని చెప్పారు.
సమర్ధవంతమైన విచారణకు క్రైమ్‌ అండ్‌ క్రిమినల్‌ ట్రాకింగ్‌ నెట్‌వర్క్స్‌, సిస్టమ్స్‌ ఎంతైనా అవసరమని ఆయన అన్నారు. నేరస్తుల వేలి, కాలిముద్రల సేకరణ అనేది కొత్తగా ప్రవేశపెడుతున్నదేమీ కాదు. అనేక క్రిమినల్‌ కేసుల్లో వాటిని సాక్ష్యాలుగా వినియోగించుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయని చెప్పారు. ఉదాహరణకు 2013లో బుద్దగయలో జరిగిన టెర్రర్‌ దాడి గురించి ఆయన వివరిస్తూ ఈ దాడి అనంతరం సంఘటనా స్థలంలో బౌద్ధ భిక్షవు ధరించే వస్త్రం దొరికింది. ఆ వస్త్రంలో దొరికిన వెంట్రుకలు బాంబు దాడికి పాల్పడిన నిందితుడి వెంట్రుకలకు మ్యాచ్‌ అయ్యాయి. ఈ కేసులో నిందితుడికి వ్యతిరేకంగా అవే కీలక సాక్ష్యంగా మారాయని చెప్పారు. క్రిమినల్‌ ఇన్వెస్టిగేషన్‌లో అందుబాటులోకి వచ్చిన అధునాతన టెక్నాలజీని మనం కచ్చితంగా వినియోగించుకుని తీరాల్సిందేనని అన్నారు.
దిశ బిల్లుకు వెంటనే ఆమోదం తెలపండి...
మహిళలపై జరిగే అత్యాచారం కేసుల్లో నిందితులను త్వరితగతిన శిక్షించేందుకు వీలుగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకువచ్చిన దిశ బిల్లును తక్షణమే ఆమోదించాల్సిందిగా విజయసాయి రెడ్డి సభలో ఉన్న హోం మంత్రి  అమిత్‌ షాకు విజ్ఞప్తి చేశారు.

Back to Top