27 క్రిమి సంహారక మందులపై నిషేధం

రాజ్యసభలో  వి.విజయసాయి రెడ్డి ప్రశ్నకు కేంద్ర మంత్రి జవాబు

న్యూఢిల్లీ : మనుషులు, జంతువులకు హానికరంగా పరిగణిస్తున్న 27 క్రిమి సంహారక మందుల తయారీ, వినియోగంపై నిషేధం విధించినట్లు వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ వెల్లడించారు. రాజ్యసభలో శుక్రవారం వైయ‌స్ఆర్ సీపీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ డాక్టర్ అనుపమ్ వర్మ నేతృత్వంలోని నిపుణుల సంఘం 66 కీటక నాశక మందులు కలిగించే దుష్ప్రభావాలను సమీక్షించిన అనంతరం 12 క్రిమి సంహారక మందులను పూర్తిగా నిషేధించింది. మరో 6 క్రిమిసంహారక మందులను క్రమంగా వినియోగం నుంచి తొలగించిందని మంత్రి తెలిపారు. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం 46 క్రిమిసంహారక మందులను నిషేధించడమో లేదా వినియోగం నుంచి తొలగించడమే చేసింది. 4 క్రిమిసంహారక మందుల ఫార్ములేషన్స్‌ను దిగుమతి, తయారీ, విక్రయాల నుంచి నిషేధించింది. నిషేధించిన 5 క్రిమిసంహారక మందులను కేవలం ఎగుమతి చేయడానికి తయారీకి అనుమతించింది. మరో 8 క్రిమిసంహారక మందుల తయారీకి అనుమతించిన రిజిస్ట్రేషన్లను రద్దు చేసినట్లు మంత్రి చెప్పారు. డీడీటీని మాత్రం ప్రజారోగ్య కార్యక్రమాల కోసం వినియోగించేందుకు అనుమతిస్తున్నట్లు ఆయన తెలిపారు.
క్రిమిసంహారక మందులు విషతుల్యమే అయినప్పటికీ నిర్దేశించిన రీతిలో వాటి వినియోగం వలన పర్యావరణానికి ఎలాంటి ప్రమాదం లేదని మంత్రి చెప్పారు. క్రిమిసంహారక మందుల భద్రత, సామర్ధ్యం వంటి అంశాలపై నిరంతరం జరిగే అధ్యయనాలు, నివేదికలు, సమాచారం ఆధారంగా నిపుణులు తరచుగా సమీక్షలు నిర్వహించి ప్రభుత్వానికి సిఫార్సులు చేస్తుంటాయని మంత్రి చెప్పారు.
 
భద్రక్‌-విజయనగరం రైల్వే లైన్ లేనట్లే
  భద్రక్‌-విజయనగరం మధ్య 2015-16 రైల్వే బడ్జెట్‌లో ప్రతిపాదించిన మూడో రైల్‌ లైన్‌ నిర్మాణానికి ఇంకా ఆమోదం పొందలేదని రైల్వే శాఖ మంత్రి  అశ్విని వైష్ణవ్‌ రాజ్యసభకు తెలిపారు.  ఎంపీ  విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన రాతపూర్వకంగా జవాబిస్తూ ఆ ప్రాజెక్ట్‌కు సంబంధించి రూపొందించిన డీపీఆర్‌ ప్రకారం 385 కిలోమీటర్ల దూరం నిర్మించే ఈ రైలు మార్గం నిర్మాణానికి 3823 కోట్ల రూపాయలు ఖర్చు కాగలదని అంచనా వేసినట్లు తెలిపారు. ఈ ప్రాజెక్ట్‌ ఇంకా ఆమోదానికి నోచుకోనందున కాలయాపన వలన  ప్రాజెక్ట్‌ వ్యయం పెరిగే అవకాశమే లేదని చెప్పారు.

తాజా వీడియోలు

Back to Top