25 కోట్ల మొక్కలు నాటేందుకు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ నిర్ణ‌యం 

విశాఖ‌లో మొక్క‌లు నాటే కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించిన ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి

విశాఖపట్నం: రాష్ట్రంలో 25 కోట్ల మొక్కలను పెంచాలని ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారని వైయ‌స్ఆర్ సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి తెలిపారు. విశాఖ ఆర్కే బీచ్‌లో కోతని అరికట్టేందుకు జీవీఎంసీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. సన్‌ రే రిసార్ట్స్‌తో కలిసి స్కేవోలా టకాడా మొక్కలు నాటే ప్రక్రియ గురువారం ప్రారంభమయింది. ఈ సందర్భంగా ఎంపీ విజయసాయిరెడ్డి బీచ్‌ రోడ్డులో మొక్కలు నాటారు. 

బీచ్‌లో మొక్క‌లు నాట‌డం ఆనందంగా ఉంది
నౌపాక మొక్కల్లో ఎన్నో ఔషధ గుణాలున్నాయని, బీచ్‌లో మొక్కలు నాటడం ఆనందంగా ఉందని విజ‌య‌సాయిరెడ్డి పేర్కొన్నారు. విశాఖలో ఉష్ణోగ్రత తగ్గేందుకు ఈ మొక్కలు దోహద పడతాయన్నారు. నగరంలో 2 కోట్ల మొక్కలను నాటాలని నిర్ణయించామని వెల్లడించారు. మంత్రి అవంతి శ్రీనివాస్‌ మాట్లాడుతూ పర్యాటకులకు స్వర్గధామం విశాఖ అని రాబోయే రోజుల్లో నౌపాక మొక్కలు పర్యాటకులను ఆహ్లాదాన్ని కలిగిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌, వీఎంఆర్డీఏ ఛైర్మన్‌ ద్రోణంరాజు శ్రీనివాస్‌, కలెక్టర్‌ వినయ్‌చంద్‌, జీవీఎంసీ కమిషనర్‌ సృజన, సన్‌రే రిసార్ట్స్‌ ఎండీ రాజబాబు తదితరులు పాల్గొన్నారు.

Back to Top