తాడేపల్లి: ఎవరు చనిపోతారా అని గోతి కాడ నక్కలాగా ఎల్లోమీడియా ఎదురు చూస్తోందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. విశాఖ జిల్లాలో వృద్ధురాలు అనారోగ్యంతో మరణిస్తే రేషన్ కోసం నిల్చుని చనిపోయిందని దుష్ప్రచారం మొదలు పెట్టారు. కరోనా అదుపులో ఉన్నందుకు ఇప్పటికే కుళ్లికుళ్లి ఏడుస్తున్న వారు డెడ్ బాడీని చూసి సంబరపడుతున్నారు’ అని ట్విట్టర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. విశాఖ జిల్లాలో ఓ వృద్దురాలి మరణంపై ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేసి దొరికిపోయిన సంగతి తెలిసిందే. చోడవరం ద్వారకానగర్కు చెందిన షేక్ మీరాబి అనే వృద్ధురాలు రేషన్ కోసం ఎండలో నిలబడి చనిపోయారంటూ ఎల్లో మీడియా ప్రచారం చేసింది. సహజ మరణాన్ని ఇలా రాజకీయం చేయడం ఏంటని ఆవేదన చెందిన కుటుంబ సభ్యులు ఎల్లో మీడియాపై పోలీసులకు సోమవారం ఫిర్యాదు చేశారు.