భీమ్లా నాయక్ సినిమా ప్రమోషన్..   పార్టీ ఉనికి కోసమే పవన్ స‌భ‌

రాజ్యసభ సభ్యుడు  మోపిదేవి వెంకట రమణ

గుంటూరు:  భీమ్లా నాయక్ సినిమా ప్రమోషన్..  జ‌న‌సేన పార్టీ ఉనికి కాపాడుకోవడం కోసమే అన్నట్టు పవన్ కల్యాణ్ న‌ర‌సాపురంలో స‌భ పెట్టిన‌ట్లుగా ఉంద‌ని  రాజ్య‌స‌భ స‌భ్యుడు మోపిదేవి వెంక‌ట‌ర‌మ‌ణ విమ‌ర్శించారు. గుంటూరు జిల్లా రేపల్లె నుంచి రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకట రమణ మీడియాతో మాట్లాడారు.

ప్రీ మూవీ రిలీజ్ ఫంక్షన్ లా.. 
- మత్స్యకార అభివృద్ధి పేరుతో పవన్ కల్యాణ్ నరసాపురంలో ఏర్పాటు చేసిన సభ తీరుతెన్నులు చూస్తే.. మూడు, నాలుగు రోజుల్లో ఆయన నటించిన సినిమా రిలీజ్ కాబోతున్న సందర్భంగా.. ఆ సినిమాను ప్రమోట్ చేసుకోవడానికి ఏర్పాటు చేసిన ప్రీ మూవీ రిలీజ్ ఫంక్షన్ లా కనిపించింది. మత్స్యకారుల పట్ల పవన్ కల్యాణ్ కు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నట్టు కనిపించలేదు. 
- ఈ సభ ప్రధాన ఉద్దేశాలు రెండుః 1. తన భీమ్లా నాయక్ సినిమా ప్రమోషన్.. 2. తన పార్టీ ఉనికి కాపాడుకోవడం కోసమే అన్నట్టు ఆ సభలో పవన్ కల్యాణ్ మాటలు ఉన్నాయి. 

చంద్రబాబు డైరెక్షన్ లోనే..
- చంద్రబాబు డైరెక్షన్ లో, టీడీపీ ఆఫీసునుంచి వచ్చిన స్క్రిప్టు ప్రకారం పవన్ కల్యాణ్ ఎప్పుడూ వ్యవహరిస్తూ ఉంటాడు. ఈరోజు జరిగిన సభలో కూడా టీడీపీ ఆఫీసు నుంచి వచ్చిన స్క్రిప్టును బట్టీ పట్టి అప్పజెప్పినట్టు కనిపించింది. 

- మత్స్యకారుల అభివృద్ధి కోసం మత్స్యకార భరోసాతోపాటు ఎన్నో కార్యక్రమాలను చేపట్టిన ముఖ్యమంత్రి  జగన్ గారు మత్స్యకారులను మోసం, దగా చేశారా..? జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల కోసం విప్లవాత్మకమైన, చరిత్రాత్మకమైన ఎన్నో నిర్ణయాలు తీసుకోవడం వల్ల వారి ఆర్థిక, సామాజిక, రాజకీయ అభివృద్ధికి బాటలు పడుతున్నాయి.  పవన్ కల్యాణ్ కోసమో, మరొకరి కోసమో, మీరు ఎప్పుడో వస్తారని, ఏదో చేస్తారని మత్స్యకారులు ఎదురుచూసే పరిస్థితులు ఇప్పుడు రాష్ట్రంలో లేవు. స్థానిక సంస్థల నుంచి శాసనసభ, శాసన మండలి, రాజ్యసభ వరకు అన్నింటా బీసీ వర్గాల రాజకీయ పరపతి పెంచుతూ నిర్ణయాలు తీసుకున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్ గారు. కార్పొరేషన్ ఛైర్మన్ల దగ్గర నుంచి ఎన్నో పదవులు ఇచ్చి, బీసీలకు సముచిత స్థానం కల్పించారు. రాష్ట్రంలో ఉన్న బీసీలు ఈరోజు జగన్ మోహన్ రెడ్డిగారి నాయకత్వంలో నేను ఈ పదవిలో కూర్చోగలిగానని గర్వంగా చెప్పే పరిస్థితి కల్పించారు.

- జగన్ మోహన్ రెడ్డిగారు అధికారంలోకి వచ్చాక... మత్స్యకారులకు ఇచ్చే డీజిల్ సబ్సిడీని రూ. 6 నుంచి 9 రూపాయలకు పెంచారు, వేట నిషేధం సమయంలో ఇచ్చే రిలీఫ్ ను రూ. 4 వేల నుంచి 10 వేలకు పెంచారు, అలానే, వేటకు వెళ్ళి ప్రమాదవశాత్తూ చనిపోయిన మత్స్యకారుల కుటుంబాలకు ఇచ్చే ఎక్స్ గ్రేషియాను రూ. 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచారు, అక్వా రైతాంగానికి ఇచ్చే పవర్ టారిఫ్ గతంలో రూ.3.50 ఉంటే, దానిని రూపాయిన్నరకే ఇస్తున్నారు. 
- పశ్చిమ గోదావరి జిల్లాలో ఇదే నరసాపురం నియోజకవర్గంలో మెరైన్ యూనివర్సిటీని త్వరలో ఏర్పాటు చేస్తున్నారు, ఇవన్నీ పవన్ కల్యాణ్ కంటికి కనిపించలేదా..?

- ప్రతి జిల్లాలో ఫిష్షింగ్ హార్బర్ ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో.. ముఖ్యమంత్రి గారు మత్స్యకారుల జీవన ప్రమాణాలు పెంచుతున్నారు. దశలవారీగా వాటి పనులు జరుగుతున్నాయి, ఇప్పటికే 5 ఫిష్షింగ్ హార్బర్ల పనులు ప్రారంభమయ్యాయి. 

- నాడు-నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ ఆసుపత్రులు అద్భుతంగా తీర్చిదిద్దారు. మరోవైపు రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో తాగునీటి వసతులు పెంచారు, రహదారులు నిర్మిస్తున్నాం...ఇంత స్పష్టంగా అభివృద్ధి కనిపిస్తున్నా పవన్ కల్యాణ్ కు కనిపించటం లేదంటే.. వారి రాజకీయ ఎజెండా ఏమిటి అన్నది ప్రజలు అర్థం చేసుకోగలరు. 

సముద్రానికి, జీవో 217కు ఏమిటి సంబంధం?
- తోక పిట్టలా... జీవో 217 పట్టుకుని పవన్ కల్యాణ్, ఇతర కొన్ని ప్రతిపక్ష పార్టీలు అర్థంపర్థం లేని విమర్శలు చేస్తున్నాయి. 
- అనేక సందర్భాల్లో మీడియా సమావేశాల ద్వారా జీవో 217 వల్ల మత్స్యకారులకు ఒనగూరే ప్రయోజనాలు ఏమిటో వివరించాం. మత్స్యకారులు మాత్రం మంచి జీవో తెచ్చారని ఆనందంగా ఉంటే.. వీళ్ళు మాత్రం, సముద్రానికి లింకు పెట్టి మాట్లాడుతున్నారు.
-  జీవో 217 మీద మీకు అసలు స్పష్టత ఉందా.. ? ఆ జీవో చించడం కాదు, ముందు మీరు ఆ జీవో పూర్తిగా చదవండి, దాని వల్ల ఒనగూరే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకోండి.
-  సముద్ర తీరప్రాతంలో కూడా 217 వర్తిస్తుందనే ధోరణిలో పవన్ కల్యాణ్ మాట్లాడటం సరైన విధానం కాదు.  ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా.. మీ ఉనికి కోసం రాజకీయాలు చేయటం కరెక్టు కాదు.
- పవన్ కల్యాణ్ మాట్లాడినవి పచ్చి అబద్ధాలు. బహిరంగ సభలో ప్రజల ముందు మాట్లాడేటప్పుడు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలి. జీవో వల్ల రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క మత్స్యకారుడికి నష్టం జరుగుతుందన్నట్టుగా పవన్ మాట్లాడిన మాటలు శుద్ధ అబద్ధం. 

100 హెక్టార్ల పైన ఉన్న చెరువులు దళారీల చేతుల్లోనే..
- నిజానికి, 100 హెక్టార్లు పైన ఉన్న చెరువులు సొసైటీల చేతుల్లో లేవు. అవి దళారీలు, గ్రామాల్లో ఆధిపత్యం ఛలాయించే వారి చేతుల్లోనే ఉన్నాయి. పేరుకే మత్స్యకార సొసైటీలు.. వాటి ఫల సాయం పొందేది మాత్రం దళారీలే. దళారీ వ్యవస్థ అరికట్టాలనే లక్ష్యంతోనే ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి, 100 హెక్టార్లు పైన ఉన్న చెరువులను బహిరంగ వేలం పెట్టి, ఆ సొసైటీ పరిధిలోని సభ్యులకు ఒక్కొక్కరికీ రూ. 15 వేలు వరకు ఆదాయం వచ్చేలా గొప్ప నిర్ణయం తీసుకుంటే.. దానిపైనా లేనిపోని విమర్శలు చేస్తున్నారు.

- ఇందులో భాగంగా, నెల్లూరును పైలట్ ప్రాజెక్టుగా తీసుకుంటే.. జిల్లాలో మొత్తం 333 చెరువులు అంటే, అందులో కేవలం 27 చెరువులకే ఈ జీవో వర్తిస్తుంది. ప్రభుత్వం ఆలోచన మేరకు, నెల్లూరు జిల్లాలో బహిరంగ వేలం ద్వారా ఆదాయం వచ్చిన తర్వాత,  రాష్ట్రంలో 100 హెక్టార్లు పై బడి ఉన్న చెరువుల పరిధిలో అందరి అభిప్రాయాలు సేకరించి, వారంతా సంతృప్తి వ్యక్తపరిచిన తర్వాతే.. ఆ జీవోను మిగతా ప్రాంతాల్లో కూడా వర్తింపజేయడం జరుగుతుంది.

- వాస్తవానికి, ఇప్పటివరకు కనీసం సొసైటీ సభ్యులు రూ. 3000 - 4000 కూడా ఆదాయం కూడా పొందలేని దౌర్భాగ్య పరిస్థితి ఉంది.

- ఒక్కో సభ్యుడికి, కేవలం మూడు వేల రూపాయలు ఆదాయం వచ్చే విధానం మంచిదా..? రూ. 15 వేలు వచ్చే విధానం మంచిదా..? అన్నది పవన్ కల్యాణ్ సమాధానం చెప్పాలి. పవన్ మాటలు ప్రకారం, మత్స్యకారులు ఇంకా పేదరికంలో ఉండాలనుకుంటున్నారా... ? వారి జీవన ప్రమాణాలను పెంచాలని కోరుకుంటున్నారో చెప్పాలి. 

- ఆఖరికి కులాల్ని రెచ్చగొట్టేలా పవన్ కల్యాణ్ మాట్లాడినా.. ప్రతి సందర్భంలోనూ ప్రజలెప్పుడూ జగన్ మోహన్ రెడ్డిగారికి అండగా ఉన్నారు, ఉంటారు కూడా. 

Back to Top