హ‌త్యా రాజకీయాల‌ను పెంచి పోషించింది టీడీపీనే

నందం సుబ్బయ్య హత్యను రాజకీయానికి వాడుకోవాలని బాబు దుర్బుద్ధి 

 బీసీలపై దాడులు జరుగుతున్నాయని చంద్ర‌బాబు, లోకేష్ త‌ప్పుడు ప్రచారం  

వైయ‌స్ఆర్‌సీపీ బీసీ సెల్ రాష్ట్ర అధ్య‌క్షుడు జంగా కృష్ణమూర్తి,  ఎమ్మెల్యే జోగి ర‌మేష్ 

 విజ‌య‌వాడ‌:  హ‌త్యా రాజ‌కీయాల‌ను, ఫ్యాక్ష‌న్ రాజ‌కీయాల‌ను పెంచి పోషించింది టీడీపీనే అని వైయ‌స్ఆర్‌సీపీ బీసీ సెల్ రాష్ట్ర అధ్య‌క్షుడు, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి,  ఎమ్మెల్యే జోగి ర‌మేష్ పేర్కొన్నారు. ప్రొద్దుటూరులో జరిగిన హత్య విషయంలో చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు లోకేష్ విమర్శలు పూర్తి బాధ్యతా రాహిత్యమ‌ని వారు తీవ్రంగా ఖండించారు. ఈ మేర‌కు మంగ‌ళ‌వారం వారు ఓప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. చంద్ర‌బాబు హ‌యాంలో పత్తికొండలో వైయ‌స్ఆర్‌సీపీ నేత‌ చెరుకులపాడు నారాయణ రెడ్డిని హత్య చేయించింది కేఈ కృష్ణమూర్తి, బాబు బృందం అన్నది అందరికీ తెలుసు అన్నారు. రాయలసీమలో ప్రశాంతతకు భంగం కలిగించే రాజకీయాన్ని చేసిన చంద్రబాబు, ఇప్పుడు తనకేమీ తెలియదన్నట్టు నటిస్తుండటం, బీసీల మీద దాడులు జరుగుతున్నాయని ప్రచారం చేయడం బాధ్యతారాహిత్యం. ఈ హత్య ఎవరు చేసినా కచ్చితంగా వారిని శిక్షించాల్సిందే. చట్టం తన పని తాను చేసుకుపోవాల్సింద‌ని స్ప‌ష్టం చేశారు.  

టీడీపీ కొత్త వాద‌న‌..

రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, ఆయన బావమరిది అవినీతి మీద సుబ్బయ్య నిలదీసినందువల్లే ఆయన్ను హత్య చేశారంటూ జరుగుతున్న ప్రచారం కూడా పూర్తి బాధ్యతారాహిత్యమే. సుబ్బయ్య ఒక చేనేత కుటుంబానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి బీసీలపై ఈ దాడి జరిగిందని టీడీపీ కొత్త వాదన మొదలుపెట్టింది. టీడీపీ అధికారంలో ఉన్న 2014 నుంచి 2019 వరకు ఇదే సుబ్బయ్య మీద టీడీపీ ప్రభుత్వంలోనే నాలుగు క్రిమినల్ కేసులు నమోదు చేస్తే.. అందులో రెండింటిలో ఆయనకు శిక్ష పడింది. 

గత ఇరవై ఏళ్ళుగా సుబ్బయ్య మీద అనేక కేసులు ఉన్నాయని స్పష్టమవుతోంది. ఈరోజు టీడీపీ వారు తమ అధికార ప్రతినిధి అని చెబుతున్న సుబ్బయ్య మీద టీడీపీ హయాంలోనే కేసులెందుకు పెట్టారన్న ప్రశ్నకు వారే సమాధానం చెప్పాలి. 

ఈ హత్య చేశారని సుబ్బయ్య కుటుంబం ఆరోపిస్తున్న వ్యక్తులను పోలీసులు వెంటనే అరెస్టు చేశారు. వారికీ, సుబ్బయ్యకు మధ్య ఒకప్పుడు మంచి స్నేహం ఉండేదని, తర్వాతకాలంలో వ్యక్తిగత కారణాల వల్ల వారి మధ్య వైరం పెరిగిందని, అది కక్షల స్థాయికి చేరిందని స్థానికులు చెబుతున్నారు. అయినా ఈ నిజాలతో సంబంధం లేకుండా నందం సుబ్బయ్య హత్యను రాజకీయానికి వాడుకోవాలనే దుర్బుద్ధితో చంద్రబాబు వేగంగా పావులు కదుపుతున్నారు. తన కొడుకుని కూడా పంపుతున్నారు.

అమరావతిలో అయినా, ప్రొద్దుటూరులో అయినా జరిగిన సంఘటనలు స్థానికంగా ఉన్న వ్యక్తిగత కక్షలకు సంబంధించినవే తప్ప వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వీటితో ఎలాంటి సంబంధమూ లేదు. 

తామే హత్యలు చేయించి, అది ఇతరుల మీద నెట్టివేసే నేర్పరితనం ఉన్న చంద్రబాబు, ఆయన పార్టీ హస్తం ఈ హత్యలో ఉందా.. అన్న అంశంపై కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు జరగాలని వారు డిమాండు చేశారు. 

Back to Top