తాడేపల్లి: రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా దెబ్బతిందని శాసనమండలిలో విపక్షనేత, వైయస్ఆర్సీపీ బొత్స సత్యన్నారాయణ మండిపడ్డారు. 3 రోజులుగా సాక్షి కార్యాలయాలపై పథకం ప్రకారం దాడులు చేస్తున్నారని, ఇవాళ ఏలూరు సాక్షి కార్యాలయానికి నిప్పుపెట్టడం దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు. మీడియాపై దాడి ప్రజాస్వామ్యంపై దాడే అవుతుందని ధ్వజమెత్తారు. హింసాత్మక చర్యలు భవిష్యత్లో తీవ్ర పర్యవసానాలకు దారితీస్తాయని హెచ్చరించారు. దాడులతో ప్రశ్నించే వారిని భయపెట్టలేరని, ఈ అరాచకాలపై ప్రజలకు సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుందన్నారు. జరిగిన దారుణాలకు బాధ్యత వహించాల్సి ఉంటుందని, అక్రమ కేసులో కొమ్మినేని అరెస్టు సహా, సాక్షి మీడియాపై దాడులను ఖండిస్తున్నానని బొత్స సత్యనారాయణ ఓ ప్రకటన విడుదల చేశారు.