రాజధాని గ్రామాల్లోని పేదలకు రూ.5 వేలు ఇవ్వాలి

వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి
 

అమరావతి: అమరావతి రాజధాని పరిధిలోని గ్రామాల్లో కూలీ పనులు చేసుకుంటున్న పేదలకు ప్రభుత్వం నుంచి ఇచ్చే రూ.2500ను రూ.5 వేలకు పెంచి ఇవ్వాలని వైయష్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కోరారు. గురువారం ఎమ్మెల్యే శ్రీదేవి అసెంబ్లీలో మాట్లాడారు. సీఆర్‌డీఏలో ల్యాండ్‌పులింగ్‌ కోసం 32 వేల ఎకరాలు ఇచ్చారు. అక్కడ బడాబాబులు, పెద్ద సామాజిక వర్గాలు మాత్రమే ల్యాండ్‌ పులింగ్‌కు భూములు ఇచ్చారు. ఇక్కడ సామాన్యులు, పేదలు, దళితులు కూడా నివసిస్తున్నారు. వారికి మనం ఏం న్యాయం చేస్తున్నామన్నది చూడాలి. సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సహృదయంతో 52 వేల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని ముందుకు వచ్చారు. దాన్ని కోర్టులో కేసు వేసి అడ్డుకున్నారు. వడ్డెమాను, దొండపాడు లాంటి 16 గ్రామాల్లో ఇళ్ల పట్టాలు ఇస్తే బాగుంటుంది. రాజధాని ప్రాంతంలో ఎస్సీలకు జీవనోపాధికి భూములు కూడా లేవు. ఉపాధి కోసం  40 కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి ఉంటుంది. అలాంటి పేదలకు రూ.2500 చొప్పున ప్రభుత్వం తరఫున ఇస్తున్నారు. దీన్ని వైయస్‌ జగన్‌ రూ.5 వేలకు పెంచారు. అయితే టీడీపీ నేతలు కోర్టు కేసు ద్వారా అడ్డుకున్నారు. రూ.5 వేలు ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కోరారు.
తుళ్లూరు రాజధానిలో ఉన్నా కూడా రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయి. రాయపూడి గ్రామంలో మైనారిటీలు ఎక్కువగా ఉన్నారు. ఆ గ్రామంలో ఈద్గాలో లేదు. సీడ్‌యాక్సిన్‌ రోడ్డులో టెంట్లు వేసుకొని ప్రార్థనలు చేస్తున్నారు. ఇక్కడ భూములు లేవు. ఉన్న భూమి సీఆర్‌డీఏ పరిధిలోకి వెళ్లింది. పంచాయతీ పరిధిలోని భూముల్లో కొంత స్థలం కేటాయిస్తే ఉపయోగకరంగా ఉంటుందని ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కోరారు.
 

Back to Top