న్యాయం గెలిచిందా? రోగం గెలిచిందా?. 

 రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి  

 బలవంతపు నిరసనలు చేసే అవసరం లేదని టిడిపి శ్రేణులు సంతోషంగా బాణసంచాలు కాల్చారు..!

 వైద్య చికిత్స కోసం కండీషన్‌ బెయిల్‌ ఇచ్చారు..!

 చంద్రబాబు శాశ్వతంగా జైలులోనే ఉంటారు..!

 చంద్రబాబు చికిత్స చేయించుకుని ఆరోగ్యంగా జైలుకు వెళ్లాలని కోరుకుంటున్నా..!

అనంత‌పురం:  స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో అరెస్ట్‌ అయి రిమాండ్‌లో ఉన్న చంద్రబాబుకు కేవలం మెడికల్‌ గ్రౌండ్స్‌ కింద కోర్టు కండీషన్‌ బెయిల్‌ ఇచ్చింది. ‘న్యాయం గెలిచింది’ అని చెప్పే తెలుగుదేశం వారిని అడుగుతున్నా.... న్యాయం గెలిచిందా? రోగం గెలిచిందా?’’ అని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి  ప్రశ్నించారు. బుధవారం అనంతపురం ఆర్‌అండ్‌బి అతిథిగృహంలో ఎమ్మెల్యే విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 
కండీషన్‌ బెయిల్‌పై విడుదల కావడంతో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తూ బాణసంచాలు కాల్చుకున్నారు. ఇంకా కొందరైతే పొట్టేళ్లు నరకడం, జంతు బలి చేయడం చూస్తే సభ్యసమాజం తలదించుకునేలా హేయమైన చర్యలకు పాల్పడడం చాలా బాధాకరం. 73 ఏళ్ల వయసులో అనేక దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న చంద్రబాబు క్యాంట్రాక్ట్‌ ఐ సర్జరీ చేసుకోవాల్సిన అవసరం ఉందని వైద్యులు ధ్రువీకరణపత్రం ఇవ్వడంతో 28 రోజుల పాటు బెయిల్‌ ఇచ్చారు. 
వయసు రిత్యా అనేక జబ్బులు ఉన్న చంద్రబాబుకు మానవతా దృక్పథంతో కేవలం చికిత్స కోసమే కండీషన్‌ బెయిల్‌ ఇచ్చారు. బెయిల్‌ అంశంలో ఎక్కడా కూడా కేసు పూర్వపరాలు గురించి ప్రస్తావించలేదు. ముందు నుంచి కూడా కోర్టు ఎక్కడా కూడా కేసులో చంద్రబాబు పాత్ర లేదనే విషయాన్ని వెల్లడించలేదు. కోర్టు నమ్మింది కాబట్టే ఆయన్ను అరెస్ట్‌ చేశారు. 

చంద్రబాబు జైలుకు వెళ్లిన తర్వాత ఆయన ఆదేశాలను అమలు చేస్తూ టిడిపి శ్రేణులు విజిల్స్‌ వేయడం, తట్టాలు, స్పూన్లతో సౌండ్లు చేయడం, కొవ్వొత్తుల ర్యాలీ చేయడం, కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలియజేయడం తదితర విచిత్రమైన విన్యాసాలను నారా లోకేష్‌ ఆదేశాలతో చేపట్టారు. 53 రోజుల పాటు బలవంతంగా నిరసనలు తెలియజేశారు. ఎన్నడూ రాజకీయాల్లోకి రాని వారుకూడా చంద్రబాబు, లోకేష్‌ ఆదేశాల మేరకు బయటకు వచ్చి ఈ విచిత్ర విన్యాసాలు చేశారు. ఈ విచిత్ర విన్యాసాలకు చెక్‌ పడిందని, బలవంతపు నిరసనలు చేసే అవసరం లేదని టిడిపి శ్రేణులు సంతోషంగా బాణసంచాలు కాల్చారు. 

 రాప్తాడు నియోజకర్గంలో పొట్టేళ్లు నరికారు..!

 చంద్రబాబు కండీషన్‌ బెయిల్‌పై విడుదల కావడంతో అత్యుత్సాహంలో ఆ పార్టీ శ్రేణులు ముఖ్యంగా రాప్తాడు నియోజకవర్గంలో సభ్యసమాజం తలదించుకునేలా పొట్టేళ్లు నరికారు. చంద్రబాటు చిత్రప‌టానికి పొట్టేళ్ల రక్తం చిందించారు. పైగా వాటిని వీడియోలు తీసి సోషల్‌ మీడియాలో వైరల్‌ చేశారు. ఇలాంటి హేయమైన  చర్యలకు పాల్పడ్డారు. నిజంగా వారికి చంద్రబాబు మీద ప్రేమ ఉంటే గుడికి వెళ్లి ప్రార్థనలు చేయొచ్చు. అన్నదానాలు చేయొచ్చు. స్వీట్లు పంచుకోవచ్చు. అంతేకాని ఇలా నీచాతినీచంగా వ్యవహరించారు. 

మాధవ్  వ్యాఖ్యలను టిడిపి వాళ్లు వక్రీకవరించారు. వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి  మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని దీంతో చంద్రబాబు రాజకీయంగా చనిపోతారని, ఆయనకు ఉన్న జబ్బుల రీత్యా మృతి చెందుతాడని మాట్లాడి ఉండొచ్చు. అంతేకాని మేమైతే చంద్రబాబు ఇంకో 15 ఏళ్లయినా సంపూర్ణంగా బతకాలని కోరుకుంటున్నాం. ఆయన ఉన్నంత వరకూ వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అవుతారు. ప్రజల్ని మోసం చేయడంలో సిద్ధహస్తుడు ప్రతిపక్ష నేతగా ఉన్నంతకాలం, చెప్పిన ప్రతి మాట నిలబెట్టుకుంటున్న వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ప్రజలు గెలిపిస్తూ ఉంటారు. 

 అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగాలతో రాష్ట్రాన్ని సాధించుకున్న రోజున తెలుగుజాతిని నిట్ట నిలువునా చీల్చిన చంద్రబాబు గురించి మాట్లాడుకోవడం దురదృష్టకరం. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రజాధనాన్ని దోచుకున్న ఇలాంటి వ్యక్తికి  వేసేశిక్షలు భవిష్యత్‌ రాజకీయ తరాలకు గుణపాఠంగా ఉండాలని కోరకుంటున్నా. చంద్రబాబు చికిత్స చేయించుకుని ఆరోగ్యంగా జైలుకు వెళ్లాలని కోరుకుంటున్నా అంటూ తోపుదుర్తి ప్ర‌కాశ్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

Back to Top