న్యాయం చేస్తున్న ప్రభుత్వంపై రాళ్ళు వేస్తారా మైసూరా రెడ్డి..?

జమ్మలమడుగు వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే  ఎం సుధీర్ రెడ్డి  

  తెలంగాణకు అనుకూలంగా చంద్రబాబు, బాబుకు అనుకూలంగా మైసూరారెడ్డి మాట్లాడుతుంటే ఏమిటి అర్థం..? 

 బాబు సీఎంగా ఉన్నప్పుడే.. తెలంగాణ అక్రమ ప్రాజెక్టులపై కర్నూలులో వైయ‌స్ జ‌గ‌న్ జలదీక్ష  

 కేఆర్‌ఎంబీ పరిధిలోకి ఉమ్మడి ప్రాజెక్టులను తీసుకువస్తుంటే.. మైసూరారెడ్డికి బాధ ఏంటి..?

  రాయ‌ల‌సీమ ప్రాంత ప్ర‌జ‌లు ఎప్పుడూ విడిపోవాల‌ని కోరుకోలేదు.

వైయ‌స్ఆర్ జిల్లా: రాయలసీమకు అన్యాయం చేస్తున్న రోజుల్లో మౌనంగా ఉండి..  న్యాయం చేస్తున్న ఈ ప్రభుత్వం మీద రాళ్లు విసరడానికి మైసూరా రెడ్డి రెడీ అయ్యారని జమ్మలమడుగు వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే  ఎం సుధీర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయలసీమ మీద ఆయనకున్న ప్రేమ ఎంతో..  చంద్రబాబు పాలన 5 ఏళ్లలో నోరు విప్పకపోవడమే అతి పెద్ద సాక్ష్యం అని అన్నారు. కృష్ణా, గోదావరి బోర్డుల పరిధులను నిర్దేశిస్తూ కేంద్రం జారీచేసిన గెజిట్‌.. గ్రేటర్‌ రాయలసీమ ప్రాజెక్టులకు గొడ్డలిపెట్టు.. అంటూ మైసూరారెడ్డి చేసిన వ్యాఖ్య‌ల‌ను సుధీర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. రాష్ట్ర విభ‌జ‌న‌తో సీమ ప్రాంతం ఇప్పటికే చాలా న‌ష్ట‌పోయింద‌ని, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే రాజకీయాలను ఇకనైనా మానుకోవాలని హితవు పలికారు.  

 తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలానికి ఎగువన రిజర్వాయర్‌ లెవెల్‌ 800 అడుగులకు చేరకముందే నీటిని పట్టుకు వెళ్లేందుకు, ఒకటి కాదు, రెండు కాదు అనేక పథకాలను 2014–19 మధ్య ప్రారంభిస్తున్నప్పుడు, వాటిని యుద్దప్రాతిపదిక మీద ఎటువంటి అనుమతులు లేకుండా నిర్మాణాలు చేస్తున్నప్పుడు మైసూరారెడ్డి మౌనం పాటించారు. 

 ఓటుకు కోట్లు కేసులో దొరికిపోయన బాబు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని వారు అక్రమ ప్రాజెక్టులు కడుతున్నా ప్రశ్నించలేకపోయాడు. తన సొంత ప్రయోజనాల కోసం చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలను, ప్రత్యేకించి రాయలసీమ ప్రయోజనాలను తాకట్టు పెడుతుంటే నోరెత్తని మైసూరా.. ఈరోజు శ్రీశైలంలో రాయలసీమకు నీరు వెళ్లక ముందే తెలంగాణ విద్యుత్‌ ఉత్పత్తి చేయడానికి వీలు లేదని జగన్‌ గారు కేంద్రానికి లేఖలు రాసి... చివరకు మరో మార్గం లేక కేఆర్‌ఎంబీ పరిధిలోకి ఉమ్మడి ప్రాజెక్టులను తీసుకురావడం తప్ప మార్గాంతరం లేదని కోరి ఒప్పించినందుకు మైసూరారెడ్డి బాధ పడుతున్నారు.

 తెలంగాణ అక్రమ ప్రాజెక్టులు కొనసాగినట్లైతే, శ్రీశైలం నుంచి వారు 800 అడుగులలోపే నీటిని తరలించుకుపోయే అవకాశం ఉంటే, జల విద్యుత్‌ కేంద్రం, సాగర్, పులిచింతల ఇలా ప్రతి ఒక్క చోట పని చేయిస్తుంటే కేఆర్‌ఎంబీ పరిధిలోకి ప్రాజెక్టులు తీసుకువెళ్లడం మినహా మార్గమేమిటి...?

  చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉండగానే.. డిండి గానీ, పాలమూరు-రంగారెడ్డి గానీ.. ఇలా దాదాపు డజను ప్రాజెక్టులు వారు కట్టుకుంటుంటే రాయలసీమకు అన్యాయం జరుగుతుందని కర్నూలులో జలదీక్ష చేసిన నాయకుడు జగన్‌గారు మాత్రమే. 

 అంత అన్యాయం చేసిన చంద్రబాబును 2019 ఎన్నికలకు ముందు వెళ్లి మైసూరారెడ్డి ఎందుకు కలిశారు, ఏం మంతనాలు జరిపారన్నది బహిరంగంగా అందరికీ తెలిసిన విషయమే. మైసూరారెడ్డి తనకు పొద్దు పోనప్పుడు లేదా తనకు బాబుతో ఉన్న సంబంధాల రీత్యా బాబు లైన్‌ తీసుకుని, బాబు పార్టీ సభ్యుడిగా మాట్లాడడం అంటే దానర్థం ఏమిటంటే... తెలంగాణకు అనుకూలంగా చంద్రబాబు మాట్లాడుతుంటే, చంద్రబాబుకు అనుకూలంగా మైసూరారెడ్డి మాట్లాడుతున్నట్లు. 

 తెలంగాణలో ప్రతి ఒక్క నాయకుడూ, ఏ పార్టీ నాయకుడైనా వారి అక్రమ ప్రాజెక్టులను కూడా సక్రమమే అని చెబుతుంటే .. మన దౌర్భాగ్యం కొద్దీ రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీయటానికి... ఒక చంద్రబాబు, ఒక మైసూరా, ఒక రఘురామరాజు, ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక టీవీ5 దాపురించాయి. 

  కేంద్రం ఇచ్చిన గెజిట్ గురించి అనుభ‌వంలో పెద్ద‌వాళ్లు అయిన‌ మైసూరారెడ్డిగారు ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేయ‌డం కాకుండా త‌న సూచ‌న‌లు, స‌ల‌హాలు ఇస్తే బాగుండేది. 

 ఇద్ద‌రు ముఖ్య‌మంత్రులు కూర్చుని మాట్లాడుకుంటే స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించుకోవ‌చ్చు క‌దా అని అంటున్నారు. అందుకు మా ముఖ్య‌మంత్రిగారు సిద్ధంగానే ఉన్నారు. అయితే అటువైపు నుంచి సానుకూల వాతావ‌ర‌ణం రానందునే కేంద్రానికి ఫిర్యాదు చేయ‌డం జ‌రిగింది. ఈ అంశంపై ఎంపీ అవినాష్‌రెడ్డి పార్లమెంట్‌లో కూడా మన వాదనను గట్టిగా వినిపించారు. 

 రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌కు సంబంధించి ఎవ‌రైనా స‌రే ఉపయోగ‌ప‌డే మాటలు మాట్లాడితే బాగుంటుంది. తెలుగుదేశం పార్టీ ఓవైపు, మ‌రోవైపు ఎల్లో మీడియా ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేయ‌డం స‌రికాదు. ఇప్ప‌టికే రాష్ట్ర విభ‌జ‌న జ‌రిగి మ‌నం చాలా న‌ష్ట‌పోయాం. రాయ‌ల‌సీమ ప్రాంత ప్ర‌జ‌లు ఎప్పుడూ విడిపోవాల‌ని కోరుకోలేదు. అంతా క‌లిసి ఉండాల‌నే అనుకున్నాం. 

  రాష్ట్ర విభజనకు చంద్రబాబు నాయుడే కారణం. తన మంత్రివర్గంలో కేసీఆర్‌కు మంత్రి పదవి ఇచ్చి ఉంటే ఆయన అసలు పార్టీయే పెట్టేవాడు కాదు కదా.. ! చంద్రబాబు అధికారంలో ఉన్న‌ప్ప‌టి నుంచి చేసిన‌ తప్పులను కప్పిపుచ్చుకునేందుకే ప్రభుత్వంపై బురద చల్లుతున్నారు. ఆయన హైదరాబాద్‌లోనే ఉన్నారు కదా, కేసీఆర్‌ దగ్గరకు వెళ్లి మాట్లాడవచ్చుగా.

  తన అనుకూల మీడియా ద్వారా ప్రజలను పక్కదారి పట్టించేందుకు చంద్రబాబు శాయశక్తులా ప్రయత్నాలు చేస్తున్నారు. చంద్రబాబు, రఘురామకృష్ణంరాజు, మైసూరారెడ్డి, ఎల్లో మీడియా.. అంతా క‌లిసి ముఖ్య‌మంత్రిగారితో పాటు, ప్ర‌భుత్వంపై అక్క‌సును ప్ర‌ద‌ర్శిస్తున్నారు. 2014 నుంచి 19 వ‌ర‌కూ ముఖ్య‌మంత్రిగా ప‌నిచేసిన చంద్ర‌బాబు నాయుడు ప్రాజెక్టుల విష‌యంలో ఏం చేశారు. నీటి కేటాయింపుల అంశం అనేది రెండు కుటుంబాల మ‌ధ్య జ‌రిగే పంచాయితీ కాద‌ు, రెండు వ్య‌వ‌స్థ‌లు, ప్రాంతాలు, రాష్ట్రాల మ‌ధ్య జ‌రిగే వ్య‌వ‌హారం. 

 ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రెచ్చ‌గొట్టే వ్యాఖ్య‌లు మానుకుంటే మంచిది. టీఆర్‌పీ రేటింగ్ పెరుగుతుంద‌ని బూతులు మాట్లాడ‌టం స‌రికాదు. ఇది నైతిక జ‌ర్న‌లిజం అనిపించుకోదు. కేంద్రానికి లేఖలు రాయకుండా మ‌రేం చేస్తారు..?
- అధికారంలోకి వ‌చ్చిన వైయ‌స్సార్ కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఏమి చేసింద‌ని గుచ్చి గుచ్చి అడుగుతున్నారే? ఓవైపు కరోనాతో ప్ర‌పంచం మొత్తం అత‌లాకుత‌లం అవుతుంటే...  ప్రజల ప్రాణాలను కాపాడటానికి దేశంలో మరే ప్రభుత్వం చేయనన్ని కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి జగన్ గారు అమలు చేస్తుంటే మీ కళ్ళకు కనిపించలేదా.. ?
- క‌రోనా వ్యాప్తిని నియంత్రించ‌డంలో ప్ర‌భుత్వం స‌మ‌ర్థ‌వంతంగా ప‌నిచేసింది. వైరాల‌జీ ల్యాబ్‌లు, టెస్టింగ్ సెంట‌ర్లు, కోవిడ్ సెంట‌ర్లు, ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రాను పెంచుకోవ‌డంతో పాటు వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ను వేగ‌వంతంగా చేస్తోంది. వాలంట‌రీ వ్య‌వ‌స్థ ద్వారా సంక్షేమ ఫ‌లాలు అంద‌రికీ గుమ్మం వద్దే అందుతున్నాయి. 
-మరోవైపు స‌కాలంలో వ‌ర్షాలు ప‌డుతున్నాయి. ప్రాజెక్టులు నిండుకుండ‌ల్లా నీళ్ల‌తో కళకళలాడుతున్నాయి. జ‌గ‌న‌న్న పాల‌న‌లో ప్ర‌జ‌లంతా సంతోషంగా ఉన్నారు. అందుకే మీరు ఓర్వలేకపోతున్నారు. సహించలేకే ఈ ప్రభుత్వంపై లేనిపోని విమర్శలు చేస్తున్నారు.

Back to Top