రియల్ ఎస్టేట్ వ్యాపారిలా చంద్రబాబు మాటలు

ఉత్తరాంధ్రను ఎలా అభివృద్ధి చేశారో చెప్పగలరా..?

రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి మూడు రాజధానులు

ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ ఉత్తరాంధ్రకు వరప్రదాయని

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే డాక్టర్‌ సీదిరి అప్పలరాజు

 

తాడేపల్లి: రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ కట్టుబడి ఉన్నారని, అందుకే మూడు రాజధానులను ప్రతిపాదించడం జరిగింది. విశాఖలో ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ ఉత్తరాంధ్రకు వరప్రదాయని అని వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే డాక్టర్‌ సీదిరి అప్పలరాజు అన్నారు. నిన్నటి నుంచి చంద్రబాబు, టీడీపీ నేతలు గొంతులు చించుకొని రాజధానుల గురించి మాట్లాడుతున్నారని, వారి మాటలు రియలెస్టేట్‌ వ్యాపారి మాటల్లా ఉన్నాయన్నారు. అసెంబ్లీలో శ్రీకాకుళం జిల్లాను అభివృద్ధి చేశానని బల్లగుద్ది చెబుతున్న చంద్రబాబు.. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం మూడు జిల్లాలకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఉత్తరాంధ్రకు దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి చేసిన అభివృద్ధిని తాము వివరించి చెప్పగలమన్నారు.

తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజధానిలో వేల ఎకరాలను నిరుపేద రైతుల నుంచి లాక్కుని ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు పాల్పడ్డాం.. దమ్ముంటే మా తప్పులను వెతుక్కోండి అని బాబు, లోకేష చాలెంజ్‌ చేస్తున్నారన్నారు. వీరిని చూస్తుంటే తనకు ఒక గుర్తుకు వస్తుందని వివరించారు. ‘ముగ్గురు స్నేహితులు ఒక షాపుకు వెళ్లి రూ.30 పెట్టి మూడు యాపిల్స్‌ కొనుగోలు చేశారు. ఆ షాపు యజమానితో బేరం ఆడితే రూ.5 రిటన్‌ ఇస్తాడు. దాంట్లో ఒక్కో రూపాయి తీసుకుంటారు. ఒక్కొక్కరికి ఒక యాపిల్‌ రూ. 9కి పడింది. మూడు కలిపితే రూ.27 అవుతుంది. మిగిలింది రూ.2, మొత్తం కలిపితే రూ.29 లెక్క వస్తుంది. మిగతా రూ.1 ఏమైనట్లు’..? టీడీపీ నేతలు మాటలు వింటుంటే తన కుమారుడు అడిగే కథ గుర్తుకు వస్తుందన్నారు. అమరావతిలో జరిగిన భూ ఆక్రమణలపై సమగ్ర విచారణ చేయాల్సిన అవసరం ఉందన్నారు.
 
రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా అభివృద్ధిని వికేంద్రీకరించాల్సిన అవసరం ఉందని, అలా జరిగితేనే రాష్ట్రంలోని అన్ని జిల్లాలు అభివృద్ధి చెందుతాయని సీఎం వైయస్‌ జగన్‌ మూడు రాజధానులను ప్రతిపాదించడం జరిగిందన్నారు. ఒక ప్రాంతంలో అభివృద్ధి కేంద్రీకృతం అయిపోయిన తరువాత ఆ అభివృద్ధి ఫలాలను తీసుకోవడం కోసం బలమైన ఉద్యమాన్ని చేసి హైదరాబాద్‌ను తెలంగాణలో ఉంచేశారన్నారు. మళ్లీ  ఉద్యమాలకు దారి తీసే పరిస్థితి రావొద్దని, అన్ని ప్రాంతాల ప్రజలు సమానంగా అభివృద్ధి చెందాలని సీఎం భావించారన్నారు. వేల కిలోమీటర్లు ప్రజా సంకల్పయాత్రలో ప్రజలు సలహాలు, సూచనల తీసుకున్న సీఎం వైయస్‌ జగన్‌ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందాలని మూడు రాజధానులను ప్రతిపాదించారన్నారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ఒక ఎక్స్‌పర్ట్‌ కమిటీ అధ్యయనం చేస్తున్నారని, కమిటీ రిపోర్టు ఇచ్చిన తరువాత సీఎం ఫైనల్‌గా నిర్ణయాన్ని చెబుతారన్నారు.

ఉత్తరాంధ్ర అభివృద్ధిలో వెనుకబడిపోయిందని, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు రాష్ట్రంలో చివరి ర్యాంకుల కోసం పోటీ పడుతున్నాయని సీదిరి అప్పలరాజు ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు ఇచ్చిన డేటా ఆధారంగా 2017 నుంచి 2018 వరకు శ్రీకాకుళం 3.8 జీడీపీ, విజయనగరం 3.5 జీడీపీ రాష్ట్రంలో చివరిస్థానాల్లో నిలిచాయి. అదే విధంగా బ్రాడ్‌ సెక్టార్‌ వైజ్‌ గ్రాస్‌ వాల్యూ ఆడిడ్‌ 2017–18లో మొదటి స్థానంలో కృష్ణా జిల్లా ఉంటే 12వ ర్యాంకులో శ్రీకాకుళం, 13వ ర్యాంకులో విజయనగరం జిల్లా ఉంది. ఇండస్ట్రీ సెక్టార్‌ జీవీఏ 2017–18లో శ్రీకాకుళానికి మైనింగ్‌ అండ్‌ క్వారింగ్‌లో ర్యాంకు 11, విజయనగరానికి 13, మ్యానిఫ్యాక్టరింగ్‌లో శ్రీకాకుళం జిల్లాకు 13, విజయనగరం 9వ ర్యాంకు, ఇండస్ట్రీ సెక్టార్‌లో శ్రీకాకుళం 12, విజయనగరం 13వ ర్యాంకు. ఎలా చూసుకున్నా.. రెండు జిల్లాలు అత్యధికంగా వెనుకబడ్డాయి. సెక్టార్‌ వైజ్‌ పర్సంటేజ్‌ డిస్ట్రిబ్యూషన్‌ చూస్తే జీడీపీలో అగ్రికల్చర్‌ అండ్‌ ఎలీడ్‌ శ్రీకాకుళం జిల్లాకు 13, విజయనగరం జిల్లాకు 12వ ర్యాంకు, ఇండస్ట్రీలో శ్రీకాకుళం 12, విజయనగరం 13వ ర్యాంకు, సర్వీసెస్‌లో శ్రీకాకుళం 12, విజయనగరం 13వ ర్యాంకు, టోటల్‌ పర్సంటేజ్‌ ఉన్న కంట్రిబ్యూషన్‌ ఆఫ్‌ జీడీపీలో శ్రీకాకుళం 12, విజయనగరం 13వ ర్యాంకులో ఉన్నాయన్నారు. స్వాత్రంత్యం వచ్చి దశాబ్దాలు గడిచినా ఏనాడూ కూడా మారుమూల జిల్లాలను ఏ ప్రభుత్వం కూడా పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలనే ఆసక్తి చూపించలేదన్నారు. విశాఖ ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌తో ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుందన్నారు.

Back to Top