చిత్తూరు: నగరి మున్సిపాలిటీని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దుతామని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా పేర్కొన్నారు. శనివారం నగరి మున్సిపల్ కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే రోజా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పట్టణ ప్రగతిలో భాగంగా సుందరీకరణ పనులను ప్రారంభించి వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. పారిశుద్ధ్యం నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు. ఆటోల ద్వారా ప్రతి ఇంటి నుంచి తడి, పొడి చెత్త వేరువేరుగా సేకరణ, రోడ్లు, వీధుల్లో పరిసరాల పరిశుభ్రత, వీధి దీపాల ఏర్పాటు, తాగునీటి సరఫరాకు ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. ప్రధాన మురుగు కాలువ పూడికతీత పనులు వేగవంతం చేయాలన్నారు. అవసరమైతే ప్రైవేట్ వాహనాల ద్వారా యుద్ధ ప్రాతిపదికన మూడు రోజుల్లో పూడికతీత పూర్తి చేయాలన్నారు. సమావేశంలో నగరి మున్సిపల్ చైర్మన్ నీలమేఘం, వైస్ చైర్మన్ లు బాలన్, వెంకటరత్నం, కౌన్సిలర్లు, మున్సిపల్ కమిషనర్ నాగేంద్ర ప్రసాద్, అధికారులు పాల్గొన్నారు.