పాలన చూసి ఓర్వలేక చంద్రబాబు కుట్రలు

ఏడాది పాలనలో 36 మందిని చంపిన ఘనత బాబుది

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే మేరుగు నాగార్జున

గుంటూరు: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరిపాలన చూసి ఓర్వలేక చలో ఆత్మకూరు అంటూ చంద్రబాబు కుట్రలు చేస్తున్నాడని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే మేరుగు నాగార్జున ధ్వజమెత్తారు. గుంటూరులోని వైయస్‌ఆర్‌ సీపీ కార్యాలయం వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు గత ఐదేళ్ల పాలనలో మొదటి సంవత్సరంలోనే 36 మందిని చంపేశాడన్నారు. 500 మందిపై దాడులు చేయించాడన్నారు. రాష్ట్రంలో అంటరానితనాన్ని చంద్రబాబు పురిగొల్పాడు. గరగపర్రులో దళితులను వెలివేస్తే గతంలో ప్రతిపక్షనేతగా ఉన్న వైయస్‌ జగన్‌ ప్రశాంత వాతావరణంతో వెళ్లి అన్ని కులాలు కలిసి ఉండాలని సమస్యను పరిష్కరించారని గుర్తుచేశారు. చంద్రబాబు హయాంలో అమలాపురంలో దళితులను చెట్టుకు కట్టేసి కొట్టారన్నారు. ప్రతిపక్ష నేతగా ఉన్న వ్యక్తి ఎలా వ్యవహరిస్తే బాగుంటుందో వైయస్‌ జగన్‌ గత ఐదేళ్లు చూపించారు. ఆ విధంగా నడుచుకో చంద్రబాబు అని ఎమ్మెల్యే మేరుగు నాగార్జున సూచించారు. 

పల్నాడులో టీడీపీ ఖాళీ అవుతుందని చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నాడని మేరుగు మండిపడ్డారు. గతంలో సభాపతిగా ఉన్న వ్యక్తి కోడెల శివప్రసాద్‌ అసెంబ్లీ ఫర్నిచర్‌ దొంగతనం చేశాడు. కే ట్యాక్స్‌ పేరుతో ప్రజల జేబులకు చిల్లుపెట్టాడు. యరపతినేని అనే వ్యక్తి మైనింగ్‌ మాఫియా చేసి దొరికిపోయాడు. తెలుగుదేశం పార్టీ నాయకుల అరాచకాలు బయటపడకుండా ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చంద్రబాబు చేస్తున్నాడు. పార్టీలకు అతీతంగా పరిపాలన ఉండాలని, సంక్షేమ పథకాలు అందరికీ అందాలని సీఎం వైయస్‌ జగన్‌ చెబుతుంటే అది ఓర్వలేక చలో ఆత్మకూరు అంటూ చంద్రబాబు కుట్రలు చేస్తున్నాడని మండిపడ్డారు. 

అలిపిరిలో చంద్రబాబుపై దాడి జరిగితే దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి  రోడ్డు మీదకు వచ్చి నిరసన వ్యక్తం చేశారని ఎమ్మెల్యే మేరుగు నాగార్జున గుర్తుచేశారు. ప్రతిపక్షనేతగా ఉన్న వైయస్‌ జగన్‌పై ఎయిర్‌పోర్టులో కత్తితో దాడి జరిగితే కోడి కత్తి అని చంద్రబాబు వెకిలిగా నవ్వాడన్నారు. వైయస్‌ఆర్‌ కుటుంబానికి చంద్రబాబుకు చాలా తేడా ఉందని, పల్నాడులో చంద్రబాబు కాలుమోపితే ఉన్న నలుగురు టీడీపీ నాయకులు కూడా వెళ్లిపోతారు ఇది చంద్రబాబు గమనించాలని సూచించారు.  
 

తాజా వీడియోలు

Back to Top